జాతీయ సమైక్యతకు, దేశభక్తికి రూపంగా నిలిచిన గాంధీని పొట్టన పెట్టుకున్న వారే ఈ రోజు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు. ఎంత నయవంచన! ఆనాడు బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి తొత్తులుగా వ్యవహరించి, ఈనాడు అమెరికన్ సామ్రాజ్యవాదపు వ్యూహాత్మక మైత్రీబంధం అనే ఉచ్చులో దేశాన్ని పూర్తిగా బిగించి మన స్వాతంత్య్రానికే మళ్లీ చేటు తెస్తున్న వాళ్లు మన దేశ ప్రజలకు దేశ భక్తి గురించి, జాతీయత గురించి ఉపన్యాసాలు చెబుతున్నారు.
‘భారత దేశము నా మాతృభూమి, నేను నా దేశమును ప్రేమించుచున్నాను…’ అంటూ పాఠశాలల్లో విద్యార్థులు రోజూ ప్రతిజ్ఞ చేస్తారు. ‘జనగణమన’ జాతీయ గీతం. ‘వందేమాతరం’ మన జాతీయోద్యమంలో ఒక నినాదం. భారత దేశాన్ని ‘దేశమాత’గా ఆరాధిస్తాం. మాతృదేశం అంటాం. కొన్ని దేశాల ప్రజలు ఫాదర్ ల్యాండ్ అంటారు. వారి దేశభక్తి కూడా తక్కువేమీ కాదు. జాతీయ పక్షి, జాతీయ జంతువు… ఇలాంటి చిహ్నాలు మన దేశ ప్రజలలో వెల్లివిరిసిన జాతీయతా భావానికి సంకేతాలు. వీటన్నింటికీ పరాకా
ష్టగా జాతీయ జెండా ఉంది. గాలిలో ఆ జెండా రెపరెపలాడుతుంటే మన హృదయాల్లో ఒక ఉత్తేజం ఉప్పొంగుతుంది.
దేశభక్తి ఒక్క మతానికే పరిమితమా?
ఈ జాతీయతా భావం కేవలం హిందువులకే పరిమితమైనది కాదు. హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ, బౌద్ధ, జైన… తదితర మతాలలో నమ్మకాలు కలిగివున్న వారు గాని, ఏ మత విశ్వాసాలూ లేనివారు గాని, భారతీయుడైన ప్రతివాడూ- అంటే, ఈ దేశంలో జన్మించిన ప్రతి పౌరుడూ సహజంగా దేశభక్తి కలిగి వుంటాడు. బాగా అభివృద్ధి చెందిన అమెరికాకో, బ్రిటన్కో, ఆస్ట్రేలియాకో పోయి అక్కడే స్థిరపడి పోయిన వారు గాని, స్థిర పడిపోదామని అనుకుంటున్న వారు గాని ఈ దేశం పట్ల ద్వేషంతో ఉండరు. మహా అయితే ఇక్కడి అవినీతినో, వెనకబాటుతనాన్నో తిట్టుకోవచ్చు. అంతమాత్రాన వారెవరికీ దేశభక్తి, మాతృదేశం మీద అభిమానం లేవని అనలేం కదా! ఎవరో కొంతమంది దేశద్రోహులు ఉండవచ్చు. ఆ ద్రోహులు వివిధ మతాలకు చెందినవారే తప్ప ఏదో ఒక్క మతానికే పరిమితం అయిలేరు.
ఈ దేశంలో జాతీయ భాషలుగా హిందీ, తెలుగు, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, ఒడియా, మరాఠీ, మలయాళం, కన్నడం, తమిళం, గుజరాతీ వంటి పలు భాషలు ఉండగా, ఇంకా కొంకణి, భోజ్పురి, హరియాన్వి ప్రాంతీయ భాషలున్నాయి. అన్నట్టు ఈ దేశ పౌరులుగా ఉంటూ దేశభక్తిలో ఎవరికీ తీసిపోని ఆంగ్లో ఇండియన్స్ మాతృభాష ఇంగ్లీషు. జాతీయతా భావం ఈ అన్ని భాషల ప్రజల సమైక్యత లోంచి వచ్చిన స్ఫూర్తే కాని ఏ ఒక్క భాషకో పరిమితం అయినది కాదు. ఇన్నేళ్ల ఇంగ్లీషు చదువుల తర్వాత కూడా ఒక భారతీయుడు ఇంగ్లీషులో గనక మాట్లాడితే అతడి మాతృభాష ఏంటో ఇట్టే చెప్పేయగలం. తమిళుడి ఇంగ్లీషు, బెంగాలీయుడి ఇంగ్లీషు, పంజాబీయుడి ఇంగ్లీషు వేరువేరుగా ఉంటాయి. ‘పడోసన్’ హిందీ చిత్రం (1970 దశకం నాటిది)లో హాస్యనటుడు మెహమూద్ తమిళుడు హిందీ మాట్లాడితే ఎలా వుంటుందో అనుకరించిన తీరు బాగా పాపులర్ అవడమే గాక తమిళనాట కొందరికి ఆగ్రహం కూడా తెప్పించింది. ఈ సుసంపన్నమైన మన భాషా వైవిధ్యం మన దేశపు ప్రత్యేకత. ఏ ఒక్క భాషకో దేశభక్తిని ముడిపెట్టి మాట్లాడలేం కదా!
ఆ మాటకొస్తే జాతీయగీతం ‘జనగణమన’ బెంగాలీ భాషలోనిది గనుక తక్కిన భాషల ప్రజలకన్నా బెంగాలీలదే దేశభక్తి పాలు ఎక్కువ అంటే ఒప్పుకుంటామా? గురజాడ, సుబ్రమణ్య భారతి, ప్రేమ్చంద్… ఇలా ప్రతి భాషలోనూ దేశభక్తిని ప్రేరేపించిన రచనలు చేసిన వారున్నారు. సారే జహాసే అచ్ఛా ఎంత గొప్ప దేశభక్తి గీతం! దానిని ఇక్బాల్ ఉర్దూలో రాశాడు. కనుక జాతీయతా భావం భిన్న భాషల ప్రజల సమైక్యత లోనుంచి వచ్చింది.
భిన్నత్వంలో ఏకత్వం
మన దేశ ప్రజలలో నల్లవారు, గోధుమ వర్ణం వారు, పచ్చని ఛాయ వారు, తెల్లవారు ఈ అన్ని రంగుల వారూ ఉన్నారు. వేల సంవత్సరాల క్రితం నుండి మనుగడ కోసం ఇక్కడికి వివిధ జాతులు వచ్చాయి. అలాగే వేల సంఖ్యలో ఈ దేశంలో కులాలు వున్నాయి. ఈ దేశంలోని భిన్నత్వం బహుముఖంగా విస్తరించి వుంది. ఆహారపుటలవాట్లలో చాలా తేడా వుంటుంది. శాకాహారులు మాత్రమే జాతీయతకు ప్రతినిధులు అని గాని, ఆవు మాంసం తింటే వారికి దేశభక్తి లేదని గాని చెప్పడం ఎంత అపహాస్యంగా ఉంటుంది! ఆకలి చావులు సంభవిస్తున్న ఈ దేశంలో ఏదో వొకటి తిని బతకమని చెప్పడం మానవత్వం అవుతుంది గాని ‘ఫలానా మాంసం తినడం కుదరదు’ అని నిషేధించడం ఎంత అవివేకం! ఎంత అజ్ఞానం! వివిధ రకాల ఆహారపుటలవాట్లు, వస్త్రధారణ పద్ధతులు, పండుగలు, ఆటలు, రకరకాల సంగీతం, భిన్నరీతుల నృత్యాలు, శిల్పకళ-ఎంత గొప్ప వైవిధ్యం ఉంది మన దేశంలో! ఇంతటి సుసంపన్న వైవిధ్యాన్ని చూసి గర్వించడం, ఉప్పొంగి పోవడం జాతీయత అవుతుంది గాని ఫలానా తిండే తినాలి! ఫలానా పద్ధతి లోనే దుస్తులు ధరించాలి; ఫలానా పాటే పాడాలి; ఫలానా ఆటే ఆడాలి; సినిమా ఫలానా విధంగానే తీయాలి; అని శాసించడం జాతీయత అవుతుందా? సప్తవర్ణ ఇంద్రధనస్సుకి ఉండే శోభ ఏదో ఒకే రంగులో ఉంటుందా? కర్ణాటక సంగీతం, హిందూస్థానీ సంగీతం-రెండింటి జుగల్బందీలో ఉండే రసాత్మకత ఏ బాణీ సంగీతం గొప్ప అని తగవులాడు కోవడంలో వస్తుందా?
భిన్నత్వంలో ఏకత్వం అన్న భావనకి రూపమే మన జాతీయతా స్ఫూర్తి. ఒకే దేశం-ఒకే జాతి-ఒకే భాష-ఒకే తిండి- ఒకే మతం-ఇది జాతీయత కాదు; దేశభక్తి అంతకన్నా కాదు. రజనీకాంత్ ‘రోబో’ సినిమా లోని మర మనుషుల్లా జనాలందరూ ఉంటే-ఏ వైవిధ్యమూ, ఏ తేడాలూ, ఏ ప్రత్యేకతలూ, ఏ సృజనా లేకుండా యంత్రల్లా ఉంటే-ఈ దేశం చాలా చాలా దుర్భరంగా ఉంటుంది.
భారతదేశాన్ని రూపొందించింది ప్రజలే
మన దేశం ఒక్కటిగా అయింది 1947 ఆగస్టు 15న. అంతకు ముందు భారతదేశం లేదా? అంటే బ్రిటీష్ ఇండియా ఉంది. వాళ్లు ఈ దేశాన్ని ఆక్రమించుకోక మునుపు? అప్పుడేముంది? ఒక దేశం లేదు. అనేక రాజ్యాలున్నాయి. అరేబియా ప్రాంతంలో అనేక రాజ్యాలు ఉన్నట్లే; భారత ఉపఖండంలో అనేక రాజ్యాలు-చెప్పాలంటే వందలాది రాజ్యాలున్నాయి. తన పెత్తనం కిందికి ఈ ప్రాంతాన్నంతటినీ తెచ్చుకున్న బ్రిటీష్ పాలకులు ఈ ప్రజలందరినీ ఏకం చేయాలని ఏనాడూ అనుకోలేదు. పైగా ఏకంగాకుండా జాగ్రత్త పడ్డారు. ఒక రాజుకు, ఇంకో రాజుకు తగవు పెట్టారు. ఒక మతానికి, ఇంకో మతానికి మధ్య చిచ్చు పెట్టారు. కులాల చిచ్చును ఆర్పలేదు సరిగదా మరింత రాజేశారు. మెకాలే కొన్ని కులాలను, తెగలను ఏకంగా నేరస్త కులాలుగా, నేరస్త జాతులుగా తన చట్టాల లోనే పొందుపరిచాడు! ఈ ఉపఖండం లోని ప్రజల నడుమ నిరంతరం భేదభావాలను, పరస్పర విద్వేషాలను రెచ్చగొట్టి బ్రిటీష్ పాలకులు తమ పెత్తనం కొనసాగించారు. దోపిడీ చేసి ఇక్కడి సంపదను కొల్లగొట్టారు. ఇక్కడి ప్రజలను దుర్భర దారిద్య్రం లోకి నెట్టారు. కరువు కాటకాలకు బలి చేశారు.
బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటించే క్రమంలో జాతీయతా భావానికి అంకురార్పణ జరిగింది. అనేక సంస్థానాల అధిపతులు ఈ జాతీయోద్యమాన్ని వ్యతిరేకించారు. బ్రిటీషు వాడి తొత్తులుగా వ్యవహరించారు. హైదరాబాదు నైజామ్ గాని, కాశ్మీర్ రాజు హరిసింగ్ గాని మతాలు వేరైనా బ్రిటీషు వాడికి మాత్రం తొత్తులే. చాలా కొద్దిమంది మాత్రమే- టిప్పుసుల్తాన్, ఝాన్సీలకీëబాయి, సిరాజ్ ఉద్దౌలా వంటి వారు బ్రిటీష్ వారిని వ్యతిరేకించి నిలిచారు. కాని బ్రిటీష్ వాడు తనను వ్యతిరేకించిన ఏ రాజునూ బతకనివ్వలేదు. బ్రిటీష్ వాడి పాలన పోవాలని, ఒకే ఒక స్వతంత్ర దేశంగా భారతదేశం ఉండాలని ఈ ఉపఖండం లోని వివిధ రాజ్యాల కింద, సంస్థానాల కింద, ఉన్న ప్రజలంతా, ఏకమై పోరాడడం ద్వారానే జాతీయతా భావం పెంపొందింది. చదువుకున్న కొద్దిమంది మధ్యతరగతి ప్రజలకే పరిమితంగా మొదలైన జాతీయోద్యమం సమరశీల జాతీయోద్యమంగా రూపుదిద్దుకుంది. ‘సంపూర్ణ స్వాతంత్య్ర’ నినాదంతో ఆ నినాదాన్ని ముందుకు తెచ్చింది కమ్యూనిస్టులు. అందుకే జాతీయోద్యమకారులు ‘వందేమాతరం’ అని ఏవిధంగా నినదించారో, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ (విప్లవం వర్థిల్లాలి) అని కూడా అదేవిధంగా నినదించారు.
దేశం లోని మారుమూలన ఉండే పల్లెలకి సైతం జాతీయోద్యమం విస్తరించింది. అన్ని కులాల, అన్ని మతాల, అన్ని భాషల, అన్ని రంగుల ప్రజలనూ ఐక్యం చేసి ‘మనమంతా భారతీయులం’ అన్న చైతన్యాన్ని వారిలో కలిగించింది జాతీయోద్యమం. ఇది ఏ ఒక్క మతాన్ని బట్టో, భాషను బట్టో రాలేదు. బ్రిటీష్ సామ్రాజ్యవాద దోపిడీని ఎదిరించి జరిపిన పోరాట క్రమంలో వచ్చిన స్ఫూర్తి.
ప్రజల లోని భిన్నత్వంలో నుంచి ఏకత్వాన్ని సాధించింది ఆ జాతీయోద్యమం. అన్ని కులాల, అన్ని మతాల ప్రజలూ ఏకం కావాలన్న జాతీయోద్యమ స్ఫూర్తికి రూపంగా నిలిచాడు గనుకనే మహాత్ముడైనాడు గాంధీ. ఆ స్ఫూర్తితోనే ప్రజలంతా ఆయన వెంట నడిచారు. జాతీయోద్యమం ఫలితంగా స్వతంత్రం వచ్చింది. భారతదేశం ఏర్పడింది. కనుక ఈ దేశ ప్రజలకి దేశభక్తి, జాతీయతా స్ఫూర్తి ఇప్పుడు ప్రత్యేకించి ఎవరో నేర్పవలసిన అవసరం ఏమీ లేదు.
జాతీయోద్యమానికి ఆమడ దూరంలో ఆరెస్సెస్
ఇంత మహత్తర జాతీయోద్యమాన్ని వ్యతిరేకిస్తూ, దానికి దూరంగా నిలిచింది ఆరెస్సెస్, దేశభక్తుడుగా వారు చెప్పుకునే సావర్కర్ సైతం తన విడుదల కోసం బ్రిటీష్ వారికి విధేయుడై పోయాడు. ఇది హిందువుల దేశంగానే ఉండాలన్న తన కోరికను స్పష్టంగా ఆరెస్సెస్ పత్రిక ‘ఆర్గనైజర్’ 1947 ఆగస్టు 14న ప్రకటించింది. మూడు రంగుల జెండాను జాతీయ జెండాగా గుర్తించ నిరాకరించింది. బ్రిటీష్ సామ్రాజ్యవాదులపై ఏనాడూ ఆరెస్సెస్ పోరాడలేదు. వాళ్లు ఈ రోజు మనందరికీ దేశభక్తి గురించి పాఠాలు చెబుతున్నారు. అదే విచిత్రం!
జాతీయ సమైక్యతకు, దేశభక్తికి రూపంగా నిలిచిన గాంధీని పొట్టన పెట్టుకున్న వారే ఈ రోజు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు. ఎంత నయవంచన!
ఆనాడు బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి తొత్తులుగా వ్యవహరించి, ఈనాడు అమెరికన్ సామ్రాజ్యవాదపు వ్యూహాత్మక మైత్రీబంధం అనే ఉచ్చులో దేశాన్ని పూర్తిగా బిగించి మన స్వాతంత్య్రానికే మళ్లీ చేటు తెస్తున్న వాళ్లు మన దేశ ప్రజలకు దేశ భక్తి గురించి, జాతీయత గురించి ఉపన్యాసాలు చెబుతున్నారు.
నేటితరం యువతకు మన చరిత్ర, వారసత్వం ఏంటో తెలియకపోతే ఆరెస్సెస్ చెప్పేదే నిజమైన చరిత్ర అని భ్రమపడే ప్రమాదం వుంది. అందుకే లౌకిక, ప్రజాస్వామ్య వాదులంతా మన జాతీయోద్యమ చరిత్రను, స్ఫూర్తిని నవతరానికి అందించే కర్తవ్యాన్ని తీసుకోవాలి.
– ఎం.వి.ఎస్ శర్మ.
Courtesy Prajashkathi..