- 2016లో నిర్ణయం.. 2017లో జీవో జారీ .. ఒక్క ఆస్పత్రినీ నిర్మించని సర్కారు..
- ఎయిమ్స్, టిమ్స్ తమ ఖాతాలోకి
- మరో రెండు నిర్మిస్తామని ప్రకటన.. వాటికి కూడా దిక్కులేని పరిస్థితి
హైదరాబాద్ : ‘‘హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులపై రోగుల భారం పడుతోంది. దానిని తగ్గించేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు దిక్కులా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తాం’’ 2016 ఫిబ్రవరి 20న వైద్య ఆరోగ్యశాఖపై జరిగిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఇది. కానీ, ఐదేళ్లయినా అది కార్యరూపం దాల్చలేదు. ఒక్క ఆస్పత్రి నిర్మాణమూ జరగలేదు. వాస్తవానికి నాలుగు ఆస్పత్రుల నిర్మాణానికి అవసరమైన స్థలాలను వెంటనే గుర్తించాలని నాటి సమీక్ష సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు.
ఉప్పల్-ఎల్బీ నగర్, మల్కాజ్గిరి-సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా, కుత్బుల్లాపూర్- కూకట్పల్లి, శేరిలింగంపల్లి- రాజేంద్రగనగర్ ఏరియాల్లో వీటి నిర్మాణం చేపట్టాలన్నారు. ఒక్కో ఆస్పత్రిలో 750 పడకలు ఏర్పాటు చేయాలని, టిలో 500 పడకలు మల్టీ స్పెషాలిటీ సేవలకు, 250 పడకలు మాతా శిశు సంరక్షణకు ఉపయోగపడేలా ఉండాలని అన్నారు. అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ఆ ఉన్నతాధికారులతో కలిసి ఎల్బీనగర్, రాజేంద్రనగర్ ఏరియాలోని మైలార్దేవ్పల్లి, కూకట్పల్లి ప్రాంతాల్లో పర్యటించి ఆస్పత్రులకు భూములను గుర్తించారు. అనంతరం 2017 జనవరి 23న సర్కారు జీవో నంబరు 64ను జారీ చేసింది.
విక్టోరియా మెమోరియల్ హోమ్-ఎల్బీ నగర్, మైలార్దేవ్పల్లి-రాజేంద్రనగర్, పేట్బషీర్బాద్ పోలీసు స్టేషన్ పక్కన, మియాపూర్ బస్ టర్మినల్ పక్కన ఈ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. నిర్మాణపు అంచనాలు, ప్రణాళికలు రూపొందించాలని టీఎ్సఎంఎ్సఐడీసీకి అనుమతినిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు ఆర్థిక శాఖ అనుమతులు కూడా అదే ఏడాది జనవరి 20న మంజూరయ్యాయి. ఎల్బీనగర్ పరిఽధిలో ఆస్పత్రికి నాలుగు ఎకరాల భూమిని కూడా కేటాయిస్తూ జీవో జారీ అయింది. అయితే అది ప్రభుత్వ భూమి కాదని, స్వచ్ఛంద సంస్థకు చెందిన భూమిని ఎలా కేటాయిస్తారంటూ హైకోర్టులో పిల్ దాఖలు కావడంతో ఆగిపోయింది. అనంతరం ఈ ఆస్పత్రుల నిర్మాణాల గురించి సర్కారు మరిచిపోయింది.
కాగా, ఉమ్మడి రాష్ట్రంలో బీబీనగర్ నిమ్స్ ఆస్పత్రి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ సర్కారు దానిని అభివృద్ధి చేసింది. అనంతర కాలంలో తెలంగాణకు కేంద్రం ఎయిమ్స్ను మంజూరు చేసింది. దీంతో బీబీనగర్ నిమ్స్ను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ ఏడాది మార్చిలో వైద్య ఆరోగ్యశాఖఫై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. గచ్చిబౌలిలోని స్పోర్ట్ కాంప్లెక్స్ను ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయించారు.
దాదాపు రూ.40 కోట్ల వ్యయంతో ఆస్పత్రికి అవసరమైన సదుపాయాలను కల్పించారు. దానికి టిమ్స్గా నామకరణం చేశారు. అనంతరం కరోనాపై వరుసగా రివ్యూలు చేసిన సీఎం కేసీఆర్.. ఒక సమీక్షా సమావేశంలో తూర్పున ఎయిమ్స్ వచ్చిందని, పశ్చిమాన టిమ్స్ ఏర్పాటు చేశామని, ఇక ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇందులో కొంపల్లి వైపు ఒకటి, శంషాబాద్ వైపు మరొకటి ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూములను గుర్తించాలని సంబంధిత జిల్లా కలెక్టర్లతో సీఎం స్వయంగా మాట్లాడి ఆదేశించారు. కానీ, ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
మార్పురాని పరిస్థితి
వాస్తవానికి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవల కోసం ఇప్పటికీ హైదరాబాద్కు వస్తున్నారు. వారికి గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులే దిక్కవుతున్నాయి. గాంధీ ఆస్పత్రి నిన్న మొన్నటి వరకు కొవిడ్ సేవలకే పరిమితం కావడంతో ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రుల్లో రోగులకు పడకలు దొరకని పరిస్థితి నెలకొంది.
సర్కారు నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి దానిని ఆచరణలో తెచ్చి ఉంటే ఈ ఐదేళ్లలో నాలుగు దిక్కులా దవాఖానాలు సిద్ధమయ్యేవి. మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో శరవేగంగా ముందకుపోయిన కేసీఆర్ సర్కారు.. జీహెచ్ఎంసీ పరిఽఽధిలో ఆస్పత్రుల నిర్మాణం ఏ మాత్రం ముందడుగు వేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
Courtesy Andhrajyothi