ప్రధానికి, క్రీడల మంత్రికి లేఖ రాసిన రెజ్లర్ సాక్షి మాలిక్
దిల్లీ: అర్జున అవార్డులు అందించేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిరాకరించడంతో కలత చెందిన రెజ్లర్ సాక్షి మాలిక్ ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడల మంత్రి కిరణ్ రిజిజుకి లేఖ రాసింది. దేశం తరఫున ఇంకేం సాధిస్తే నాకు అర్జున ఇస్తారంటూ ఆవేదన వెలిబుచ్చింది. ‘గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారికి.. నన్ను గతంలో ఖేల్ రత్న పురస్కారంతో గౌరవించారు. అందుకు నేనెంతో గర్విస్తున్నాను. ప్రతి క్రీడాకారుడు అన్ని పురస్కారాలు పొందాలని కలలు కంటాడు. అందుకోసం ఎంతో శ్రమిస్తారు. నాకు కూడా అర్జున పురస్కారం దక్కాలని ఎన్నో కలలుగన్నాను. మరి దేశానికి నేను ఇంకెలాంటి పతకం అందిస్తే నన్ను అర్జునతో సన్మానిస్తారు. నాకింకా ఆ పురస్కారం పొందే అదృష్టమే లేదా? అని లేఖలో పేర్కొంది.
2016 రియో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్ సాక్షి మాలిక్ను అదే ఏడాది ఖేల్రత్న పురస్కారంతో భారత ప్రభుత్వం సన్మానించింది. 2017లో వెయిట్ లిఫ్టింగ్ ప్రంపంచ ఛాంపియన్షిప్ విజేత మీరాభాయ్ చాను తర్వాతి ఏడాది ఖేల్రత్న అందుకుంది. అయితే వీరిద్దరూ ఈ ఏడాది అర్జున అవార్డుకు దరఖాస్తు చేసుకోగా సెలక్షన్ కమిటీ వీరి పేర్లను సిఫార్సు చేసింది. సాక్షి, మీరా గతంలోనే అత్యున్నత పురస్కారాలు అందుకోవడంతో వారికి అర్జున పురస్కారాలు ఇవ్వకూడదని క్రీడల శాఖ నిర్ణయించి వారికి పురస్కారం అందివ్వలేదు.
Courtesy Eenadu