చల్లపల్లి స్వరూపరాణి
కేరళ రాష్ట్రంలో నారాయణ గురు ప్రారంభించిన సామాజిక ఉద్యమం హిందూమతంలోనే అణగారిన కులాల సంస్కరణకోసం వెదకడం అనే పరిమిమితులకు లోబడి అట్టడుగున వున్న దళితులైన పులయా, ధియాల సమస్యలైన అంటరానితనం, కుల వివక్షలపైన అంతగా దృష్టి పెట్టలేదు. పైగా ఆ సంస్థలో రాడికల్స్ అయిన సహోదరన్ అయ్యప్పన్, కుమరన్ అసన్ వంటివారు శ్రీ నారాయణ ధర్మ పరిపాలన సంఘం ఎజవాలను హిందువులుగా పరిగణించరాదని, దళిత సమస్యమీద పనిచెయ్యాలని డిమాండ్ చేసినప్పుడు నారాయణ గురు అనుచరులే అయ్యప్పన్ ను ‘పులయా అయ్యప్పన్’ అని గేలిచేశారు.
స్వయానా ‘దేవుడి స్వంత దేశం’ అని చెప్పుకునే కేరళలో కూడా కులం అక్కడి పచ్చటి పరిసరాల్లో తెగులు మాదిరి వ్యాపించి అణగారిన కులాలలను వీధుల్లో నడవనీయలేదు, బడిలోకి, గుడిలోకి అడుగు పెట్టనీయలేదు. ఆకులాల స్త్రీలు రవిక తొడుక్కుని తమ ముందు నడిస్తే నంబూద్రి బ్రాహ్మలు, నాయర్లు తమ గౌరవానికి భంగం కలుగుతుందని ఆస్త్రీలకు రవిక తొడుక్కునే హక్కును హరించే సామాజిక శాసనాలు రచించారు.
అక్కడ కారల్ మార్క్స్ మీద రచనలు చేసిన కొమ్ములుతిరిగిన కమ్యూనిస్టులలో కూడా ‘తరతరాలనుంచి మేధో వ్యవసాయం చేస్తున్న బుద్ధి జీవులను, వారి పొలాలను మాత్రమే సేద్యం చేస్తున్న పనివాళ్ళను ఒకచోట కూర్చోబెట్టడం గేదెను, గుర్రాన్నీ ఒకే శాలలో కట్టేసినట్టు’ అని బ్రాహ్మలను, దళితులను పోల్చి దళిత విద్యార్ధుల చదువుకు గండి కొట్టాలని చూసిన రామకృష్ణ పిళ్ళై లాంటి సూడో మార్క్సిస్టు మేధావులున్నారు.
అక్కడే దళిత పులయా కులంనుంచి ఒక మేరునగ ధీరుడు ‘అయ్యంకాళి’ ఆవిర్భవించాడు…
ఒకవైపు మేటలు వేసిన కులతత్వంపైన, దానికి దగ్గరి బంధువు గ్రామీణ భూస్వామ్యంపైన, పితృస్వామిక అణచివేత విధానాలపైన విప్లవ పంధాలో కుల, వర్గ పోరాటాలు చేసి పెత్తనదారీ కులాలకు గుండెల్లో రైళ్ళు పరుగెత్తించాడు. శత్రువుతో నేరుగా బాహా బాహీ తలపడ్డాడు అయ్యంకాళి. ఎంత నెత్తురోడినా ఫర్వాలేదు, తనజాతికి మానవహక్కుల ఉల్లంఘనను మాత్రం సహించేది లేదని ధనిక కులాలు చేసే కుట్రలను ఎండగట్టడంతోపాటు వారు చేసే భౌతిక దాడులకు ప్రతిదాడులు చేసే విధంగా ప్రజల్ని సాయుధులుగా తర్ఫీదునిచ్చిన దళ కమాండర్ గా కులతత్వానికి ఎదురు నిలిచాడు. వ్యవసాయ కూలీల కూలీ రేట్లు పెంచాలని కేరళలో కమ్యూనిస్టు ఉద్యమం పుట్టకముందే వ్యవసాయ కార్మికులను సంఘటితపరిచి దేశంలో 1907 నాటికే వర్గ పోరాటాలు ప్రారంభించాడు.
అయ్యంకాళి ‘మాపిల్లలను బడిలోకి రానివ్వకపోతే మీపంట పొలాలను బీళ్ళను చేస్తాం’ అని జబ్బ చరిచాడు. దళిత స్త్రీలకు కూడా కుల, మగ దురహంకారుపై తిరగబడే సాహసం, తెగువ ఇచ్చి వారికి గుండెలు కప్పుకునే రవికలనే కాదు, గుండెలనిండా శ్వాసించడానికి అవసరమైన ఆత్మ స్థైర్యాన్ని నూరిపోశాడు.
రాబోయేకాలంలో మళ్ళీ దళితులను బడి గడప తొక్కనీయని, దళిత స్త్రీలను తమ సుఖాలకోసం పనికొచ్చే భోగ వస్తువులుగా భావించే ఒకానొక దుర్మార్గపు స్థితి పొంచి వుంది. దళితుల రాజ్యాంగ హక్కులు రాను రాను హరించుకుపోతున్న పరిస్థితిలో తన పోరాట పటిమతో మనువాదుల వెన్నులో వొణుకు పుట్టించిన అసలైన మహాత్ముడు అయ్యంకాళిని ఆయన జయంతినాడైనా స్మరించుకుకోవడం ఒకింత స్థైరాన్ని తిరిగి ప్రోది చేసుకోవడమే! అవును, అయ్యంకాళిని తలుచుకోవడం ఇక్కడి కుల, వర్గ దోపిడీపై కురవాల్సిన ఒక అగ్నిని ఆవాహన చేసుకోవడమే!