- యురేనియం కోసం నల్లమలను నాశనం చేస్తారా?
- సినీనటుడు విజయ్ దేవరకొండ ట్వీట్.. ఉద్యమానికి మద్దతు
- భావితరాలకు కాలుష్య తెలంగాణ ఇద్దామా?: పవన్ కల్యాణ్
- రాజకీయ ఉద్యమం అవసరం: రాహుల్ రామకృష్ణ. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను సినీనటుడు విజయ్ దేవరకొండ తప్పుబట్టారు. తవ్వకాల వల్ల 20 వేల ఎకరాల అటవీ ప్రాంతం నాశనమయ్యే ప్రమాదముందన్నారు. ‘సేవ్ నల్లమల’ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ‘‘మనం చెరువులను నాశనం చేసుకున్నాం. సహజ వనరులు దెబ్బతినడం వల్ల కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, మరికొన్ని ప్రాంతాల్లో అనావృష్టిని చూశాం. తాగునీటి వనరులు కలుషితమయ్యాయి. అన్నిచోట్లా మనం పీల్చే గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. ఇప్పుడు పచ్చని నల్లమల అడవులపైనా మన కన్ను పడింది. యురేనియం కావాలంటే కొనుక్కోవచ్చు.. కానీ, అడవులను కొనగలమా? అని విజయ్ ట్వీట్ చేశారు. యురేనియాన్ని కొనలేకపోతే సౌరవిద్యుత్తు లాంటి ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని సూచించారు.
- పీల్చేందుకు గాలి, తాగేందుకు నీరు లేనప్పుడు యురేనియం విద్యుత్తు శక్తితో ఏం చేసుకుంటామని ప్రశ్నించారు. నల్లమల అడవులను రక్షించేందుకు రాజకీయం ఉద్యమం చేయాలని మరో సినీనటుడు రాహుల్ రామకృష్ణ ట్విటర్లో పిలుపునిచ్చారు. కాగా.. ‘భావితరాలకు బంగారు తెలంగాణ ఇస్తామా? యురేనియం కాలుష్యంతో కూడిన తెలంగాణ ఇస్తామా? అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గురువారం మధ్యాహ్నం ట్విటర్లో ఉంచిన ప్రకటనలో ప్రశ్నించారు. యురేనియం తవ్వకాలపై కొద్ది రోజుల్లో రాజకీయవేత్తలు, మేధావులు, నిపుణులు, పర్యావరణ ప్రేమికులతో రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.
Courtesy Andhrajyothi…