– కష్టకాలంలో గుట్టుచప్పుడు కాకుండా జాయింట్ వెంచర్
– ఆమోదించిన ఉక్కు మంత్రిత్వ శాఖ పీఎంఓ కీలకపాత్ర?
– తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గుర్తింపుసంఘం
విశాఖ : విశాఖ ఉక్కు .. ఆంధ్రుల హక్కు..! ఇది రాష్ట్రంలో ఒకప్పుడు మారుమ్రోగిన నినాదం! ప్రజల త్యాగాలతో ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ భూములపై కార్పొరేట్ల కన్ను పడింది. కార్మికులు, ఉద్యోగులతో పాటు స్థానిక ప్రజల అభ్యంతరాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా భూములను పోస్కో కంపెనీకి అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. జాయింట్ వెంచర్ పేరుతో గ్రీన్ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటుకు 1170 ఎకరాల విశాఖ స్టీల్ భూములను పోస్కోకు బదలాయించడానికి కేంద్ర ఉక్కుమంత్రిత్వశాఖ పోస్కోతో చేసుకున్న ఈ ఒప్పందంలో స్టీల్ప్లాంట్ యాజమాన్యం కూడా భాగస్వామ్యమైంది. కరోనా కష్టకాలంలో కూడా గుట్టుచప్పుడు కాకుండా ఈ ఎంఓయు కుదరడానికి ప్రధానమంత్రి కార్యాలయం కీలక పాత్ర పోషించడమే కారణమని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ఎన్నో ఘనతలు సాధించిన విశాఖ స్టీల్కు ఇంతవరకు ఇనుపఖనిజ గనిని కేటాయించని కేంద్ర సర్కారు పోస్కోకు మాత్రం నిరంతరాయంగా ఖనిజ సరఫరా చేయడానికి అంగీకరించింది. ఈ ఒప్పందాన్ని చీకటి ఒప్పందంగా, ప్రజాద్రోహంగా స్టీల్ ప్లాంటు గుర్తింపుసంఘం అభివర్ణించింది. స్టీల్ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజలు ఒప్పుకునే ప్రసక్తి లేదని పేర్కొంది.
ఎప్పటినుంచో …
విశాఖ స్టీల్ప్లాంట్ భూములపై పోస్కో కొన్ని సంవత్సరాలుగా కన్నేసింది. పోస్కో ప్రతినిధులు అనేక దఫాలు స్టీల్ ప్లాంటుకు వచ్చారు. యాజమాన్యంతోనూ, కేంద్ర ప్రభుత్వంతోనూ చర్చలు జరిపారు. మరోవైపు స్టీల్ప్లాంట్ కార్మికులతో పాటు విశాఖ ప్రజలు కూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. కార్మికులు స్థానికంగా ఆందోళనలు చేయడంతో పాటు విజయవాడకు ఛలో కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ప్లాంటుకు వచ్చిన ఉక్కుశాఖ మంత్రి యాజమాన్యంతోనూ, కార్మిక సంఘాలతోనూ చర్చించకుండా పోస్కోతో జాయింట్ వెంచర్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోమని ప్రకటించారు.
గుట్టుచప్పుడు కాకుండా …
మంత్రి ఇంత స్పష్టంగా ప్రకటించినప్పటికీ జరిగింది భిన్నం. జులై 23వ తేది కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ గుట్టుచప్పుడు కాకుండా పోస్కోతో ఒప్పందం చేసుకుంది. అది కూడా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కావడం గమనార్హం. ఈ ప్రక్రియలో పోస్కోతో పాటు,స్టీల్ప్లాంట్ యాజమాన్యం కూడా భాగస్వామ్యం అయ్యింది. 35వేల కోట్ల రూపాయల పెట్టుబడితో సంవత్సరానికి 5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో గ్రీన్ఫీల్డ్ స్టీల్ప్యాక్టరీ ఏర్పాటుకు జాయింట్ వెంచర్కుదిరింది. ఇంత భారీ మొత్తంలో పెట్టుబడులు వస్తున్నప్పుడు ప్రభుత్వాలు ఎంత హడావిడి చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ, కేంద్ర ప్రభుత్వం రోజుల తరబడి గోప్యంగా ఉంచింది. కేంద్ర ఉక్కుమంత్రిత్వశాఖ సాధారణ బులెటిన్లో మూడు రోజుల క్రితం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిలో ఎంఓయును అమలు చేయడానికి జాయింట్ వర్కింగ్గ్రూపును ఏర్పాటు చేస్తున్నట్లు ఉక్కుమంత్రిత్వశాఖ తెలిపింది.
వివాదాల పోస్కో
పోస్కో కంపెనీపై అనేక ఆరోపణలున్నాయి. భారత్లోని స్టీల్ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టాలని చాలా సంవత్సరాలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 12 మిలియన్ టన్నుల ప్లాంట్ కోసం 2005లో ఒడిశా ప్రభుత్వంతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. తరువాత ఈ ఒప్పందం రద్దయింది. 2007లోని భారతదేశంలో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడానికి స్టేట్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ప్రారంభ ఒప్పందం కుదుర్చుకున్నా విజయవంతం కాలేదు. ఇన్ని వివాదాలున్నా పోస్కోతోనే మళ్లీ ఒప్పందం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఏమిటి నష్టం…?
ప్రస్తుతం విశాఖ ఉక్కుకు 7.3 మిలియన్ టన్నుల నుంచి 10 మిలియన్ టన్నుల సామర్ధ్యానికి పెంచినా సరిపోయే భూములు ఉన్నాయి. ఏ విదేశీ సంస్థతోనూ ఒప్పందం లేకుండా లక్ష్యాన్ని సాధించగల నైపుణ్యత ఉన్న కార్మికులు, ఇంజినీర్లు అందుబాటులో ఉండటం విశాఖ స్టీల్ ప్రత్యేకత. నష్టాల సాకుతో ఇప్పటికే నాలుగు సంవత్సరాల నుండి కార్మికులకు నూతన వేతన ఒప్పందం కూడా చేయని యాజమాన్యం ఈ ఒప్పందం తరువాత భవిష్యత్తులో భూములు లేవని చెబుతూ విస్తరణను పూర్తిగా గండికొట్టే అవకాశం ఉంది. విశాఖలో ఉన్న భూములు విలువైనవి, పైగా అభివృద్ది చెందింది. ఓడరేవు పట్టణం. హైగ్రేడ్ స్టీల్ తయారికీ కావలసిన అన్ని సదుపాయాలూ సమగ్రం గా ఉన్నాయి. తక్కువ ధరకు ఉత్పత్తి చేసి విదేశాల్లో ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి చాలా అనువైన ప్రాంతం విశాఖ. అందుకే పోస్కో కంపెనీ కళ్లు విశాఖపై పడ్డాయి. కేంద్రంతో చర్చలు జరిపి అటు గంగవరం పోర్టు ఇటు స్టీల్ప్లాంట్కు దగ్గరగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని జాయింట్ వెంచర్ ద్వారా స్టీల్ ప్లాంట్ను పూర్తిస్థాయిలో హస్తగతం చేసుకోవడానికి కుట్ర పన్నుతోందన్న అనుమానాలూ ఉన్నాయి.
జాయింట్ వెంచర్ రద్దుకు సీఐటీయూ ధర్నా
పోస్కోతో విశాఖ ఉక్కు కుదుర్చుకున్న జాయింట్ వెంచర్ను తక్షణమే రద్దు చేయాలని స్టీల్ప్లాంట్ గుర్తింపు యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన స్టీల్ప్లాంట్ ప్రధాన పరిపాలనా భవనం ఎదుట గురువారం ధర్నా చేశారు. స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గుర్తింపు యూనియన్ అధ్యక్షులు జె.అయోధ్యరామ్ మాట్లాడారు. కరోనాతో దేశ ప్రజలు అల్లాడుతుంటే కేంద్రంలోని బిజెపి జాయింట్ వెంచర్ పేరుతో విశాఖ స్టీల్ప్లాంట్ను అమ్మడానికి పావులు కదపడం దుర్మార్గమ్మన్నారు. ఆత్మనిర్భర భారత్ పేరుతో స్వదేశీసంపదపై జరుగుతున్న దౌర్జన్యాన్ని స్టీల్ కార్మికులు సహించరని, మోడీ పాలనలో దేశభక్తి ముసుగులో స్టీల్ పరిశ్రమల అమ్మకాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. స్టీల్ గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి వైటి.దాస్ మాట్లాడుతూ.. స్టీల్ప్లాంట్ను రక్షించుకునేందుకు తాము చేపట్టిన పోరాటానికి పార్టీలకతీతంగా ప్రజా ప్రతినిధులు, ప్రజలు సంఘీభావం ప్రకటించాలని కోరారు. అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపారు..
Courtesy: NT