– ఖరీఫ్లో పెరిగిన పంట సాగు
– డిమాండ్కు వ్యవ’సాయం’ మద్దతు: ఇండియా రేటింగ్స్ రిపోర్ట్
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ రికవరీలో గ్రామీణ ప్రాంత డిమాండ్ అత్యంత కీలకంగా ఉంటుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఓ రిపోర్ట్లో స్పష్టం చేసింది. అలాగని పట్టణ ప్రాంత డిమాండ్కు ప్రత్యామ్నాయం కాదని తెలిపింది. కరోనా సంక్షోభం నుంచి బయటపడటానికి పారిశ్రామిక, సర్వీసు రంగాలు ఇప్పటికీ తీవ్రంగా కష్టపడుతున్నాయని వెల్లడించింది. కాగా.. ఆర్థిక వ్యవస్థ రికవరీలో వ్యవసాయ రంగమే ప్రధాన పాత్ర (ఇంజిన్)గా ఉందని స్పష్టం చేసింది. ఇండియా రేటింగ్స్ రిపోర్ట్ ప్రకారం.. 2020 జూన్లో మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్ల అమ్మకాల ప్రోత్సాహంలో గ్రామీణ ప్రాంత డిమాండ్దే కీలక వాటా ఉంది. స్థూల విలువ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 17 శాతంగా ఉంది. దీంతో వినిమయ డిమాండ్లో ఈ రంగం మద్ధతు ప్రధానంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) జూన్తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ మైనస్ 17.03 శాతం క్షీణించొచ్చని ఈ ఎజెన్సీ అంచనా వేసింది. లాక్డౌన్కు ముందూ, తర్వాత ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే ప్రభావితం కాలేదు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం 3.5 శాతం వృద్థిని కనబర్చే అవకాశం ఉంది. చాలా సంవత్సరాల తర్వాత వ్యవసాయంలో వరుసగా మూడు సీజన్లు.. 2019 రబీ, 2019 ఖరీఫ్, 2020 రబీ కాలాల్లో మంచి పంటలు వచ్చాయి. గతేడాది ఖరీఫ్ సీజన్తో పోల్చితే ప్రస్తుత కాలంలో మెరుగైన వర్షాలు నమోదు కావడంతో పంటల సాగు పెరిగింది. ఆగస్టు 1-25 మధ్య సాధారణం కంటే 7.4 శాతం అదనపు వర్షపాతం నమోదయ్యింది. వర్షాలు భారీగా పడినప్పటికీ ఎలాంటి వరదలు చోటు చేసుకోకపోవడంతో పంట సాగు పెరిగిందని ఈ రిపోర్ట్ పేర్కొంది. అయితే అధిక పంట దిగుబడులు వచ్చే అవకాశం ఉండటంతో వ్యవసాయ ఆదాయంపై ప్రభావం పడే అవకాశాలున్నాయి. ఖరీఫ్ సాగు, ఉత్పత్తుల అమ్మకాలపై ప్రభుత్వాలు నిరంతరం సమీక్షించాల్సిన అవసరం ఉంది. లాక్డౌన్ కాలంలో చాలా మంది ఫ్యాక్టరీ కార్మికులు తమ సొంత ఊర్లకు వెళ్లిపోయారని.. ఈ పరిణామం కూడా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుదలకు ఓ కారణమని తెలిపింది.
Courtesy Nava telangana