- ఉద్యోగార్థులు రాసే పరీక్షలను ఉద్యోగులు రాశారు. ఆ పరీక్ష పేపర్లు సిద్ధంచేసిన ఏపీపీఎస్సీలోనే వారు పనిచేస్తున్నారు. అంతేకాదు పేపర్లు తయారుచేసిన విభాగంలో పనిచేసే మహిళా ఉద్యోగి ఒకరు ఈ పరీక్షలకు హాజరయ్యారు. గురువారం విడుదలచేసిన సచివాలయ ఫలితాల్లో కేటగిరి-1లో టాప్ 1 ర్యాంకరు ఆమే!
- వారంతా ఏపీపీఎస్సీ ఉద్యోగులు! ఏపీపీఎస్సీ పర్యవేక్షణలో జరిగిన పరీక్ష ఫలితాల్లో వారిలో కొందరు బంధువులు టాప్ టెన్లో అదరగొట్టారు!
- ఇంట్లో అందరూ టీచర్లే! కుటుంబమంతా వైద్యులే! అనే మాటలు వింటుంటాం. అలాగే, ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న ఆ ఉద్యోగి ఇంట్లో దాదాపు అందరూ గ్రామ సచివాలయ పోస్టులకు అర్హత సాధించారు. ఆయన భార్య కాకుండా ఇంట్లో మరో ఇద్దరు మంచి ర్యాంకులు తెచ్చుకొన్నారు.
- తిలాపాపం తలాపిడికెడు! పేపరు సంపాదించిన ఏపీపీఎస్సీలోని కొందరు ఉద్యోగులు.. దానిని గుట్టుగా ఉంచలేదు. బంధువులు, సన్నిహితులకూ లీక్ చే శారు.
- పేపర్ టఫ్! ఐఏఎస్లకు ఇవ్వాల్సిన పేపరు అది!
- 50 శాతం మార్కులు వస్తే ఎక్కువన్నది పలువురి మాట! అలాంటి పేపరులో టాప్ స్కోరు 112.
- పరీక్ష పేపరు తయారుచేసింది ఏపీపీఎస్సీ. ఆ పేపరు ఆధారంగా పరీక్ష నిర్వహించిందీ కమిషనే. కానీ, పేపరు తయారీకి, పరీక్ష నిర్వహణకు మధ్యలో ప్రశ్నపత్రం ఓ రిటైర్డు అధికారి చేతికి పోయింది. ఏపీపీఎస్సీ చరిత్రలోనే ఇలా ‘బయటి కన్ను’ ప్రశ్నపత్రంపై పడటం ఇదే తొలిసారి!
పేపరు టైపిస్టే టాపరు? అనితమ్మ కేటగిరి-1లో టాప్ ర్యాంకర్. ఏపీపీఎస్సీలో పరీక్షల వ్యవహారాలు చూసే విభాగంలో అనితమ్మ ఔట్సోర్సింగ్ విధానంలో జూనియర్ అసిస్టెంట్. ప్రశ్నపత్రం టైప్ చేసిందీ ఆమేనని కమిషన్ వర్గాలే అంటున్నాయి! బంధువంటే ఇలా.. దొడ్డా వెంకట్రామిరెడ్డి కేటగిరి-3లో ఫస్ట్ ర్యాంకరు, .కేటగిరి-1లో మూడో ర్యాంకరు. ఆయన సొంత అన్న ఏపీపీఎస్సీలో ఏఎస్వో.
- సచివాలయ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ!
- ఆ పేపరు టైప్ చేసిన ఉద్యోగినే టాపరు!
- ఏపీపీఎస్సీ కేంద్రంగా సాఫీగా వ్యవహారం
- రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన టాపర్లలో
- అక్కడి ఉద్యోగులూ, వారి బంధువులూ
- ఓ ఉద్యోగికి కేటగిరి-3లో రెండో ర్యాంకు
- ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగినికి టెన్త్ ర్యాంకు
- ఓ ఉద్యోగి భార్య సహా ముగ్గురికి ర్యాంకు
- అన్న ఉద్యోగి.. తమ్ముడు టాప్ ర్యాంకర్
- రెండు కేటగిరీల్లోనూ ఫస్ట్, థర్డ్ ర్యాంకు
- జిల్లాల్లోని తమవారికీ పేపర్ అందజేత
- సర్వీసు కమిషన్ విశ్వసనీయత గోదాట్లో
- ఏపీపీఎస్సీపై తొలినుంచీ సందేహాలే
- ‘తమ’వారికే ఇచ్చుకొనేలా గూడుపుఠాణి
- చేస్తున్నట్టు అనుమానించిన అభ్యర్థులు
అమరావతి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ పరీక్షల్లో భారీ బాగోతం చాపకింద నీరులా సాగిపోయింది. గురువారం ఫలితాలు ప్రకటించిన వెంటనే ఈ పరీక్షల్లో జరిగిన గూడుపుఠాణి బట్టబయలైంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం కేంద్రంగా జరిగిన కుట్ర రాష్ట్ర వ్యాప్తంగా పాకినట్లు తెలుస్తోంది. సర్వీసు కమిషన్ ఉద్యోగులు కొందరు ప్రశ్నపత్రం సంపాదించి తాము ప్రయోజనం పొందడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక మందికి ఈ పేపర్లు అందజేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వహస్తాలతో విడుదల చేసిన ఫలితాల్లో కేటగిరి-1లో జి.అనితమ్మ(అనంతపురం) అనే యువతి టాప్ ర్యాంకర్గా నిలిచారు. ఏపీపీఎస్సీలో పరీక్షల వ్యవహారాలు చూసే కాన్ఫిడెన్షియల్ విభాగంలో ఔట్సోర్సింగ్ విధానంలో జూనియర్ అసిస్టెంట్గా అనితమ్మ పనిచేస్తున్నారు. కేటగిరి-3లో ఫస్ట్ ర్యాంకర్గా నిలిచిన దొడ్డా వెంకట్రామిరెడ్డి(ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం)సొంత అన్న మల్లికార్జునరెడ్డి ఇదే ఏపీపీఎస్సీలో ఏఎ్సవోగా పనిచేస్తున్నారు. కేటగిరి-1లో మూడో ర్యాంకు కూడా ఆయనకే వచ్చింది. కేటగిరి-3లో రెండో ర్యాంకర్గా నిలిచిన వెన్నా మహేశ్వరరెడ్డి కూడా ఏపీపీఎస్సీలోనే పనిచేస్తుండటం గమనార్హం. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సచివాలయ పరీక్షల్లో అంతా పకడ్బందీగా చేశామని ముఖ్యమంత్రి, అధికారులు బల్లగుద్ది చెప్పినప్పటికీ లోలోపల చాలా వ్యవహారాలు నడిచినట్లుగా ఈ ఫలితాలే చెబుతున్నాయి.
మనం.. మనం..: సాధారణంగా సర్వీసు కమిషన్లో పనిచేసేవారు ఆ విభాగం నిర్వహించే పరీక్షలు రాసే పక్షంలో వారిని ఆ విభాగానికి దూరంగా ఉంచుతారు. కానీ ఈ దఫా మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. పైగా కొందరు కీలక అధికారులు కుమ్ముక్కై అస్మదీయులకు పేపర్లు అందించేందుకు వీలుగా వారిని అలాగే వదిలేశారని తెలుస్తోంది. ఏపీపీఎస్సీ ఉద్యోగులు స్వప్రయోజనాలకోసం అధికార దుర్వినియోగానికి పాల్పడి పేపర్లు లీక్ చేసుకున్నట్లే, బయట వారికి కూడా వెళ్లిపోయాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేటగిరి-1లో ఫస్ట్ ర్యాంకర్గా ఉన్న అనంతపురం జిల్లాకు చెందిన జి.అనితమ్మ గత కొంత కాలంగా ఔట్సోర్సింగ్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన పలు పోటీ పరీక్షలకు హాజరైనప్పటికీ ఎక్కడా ఎంపికకాలేదు. ఈసారి మాత్రం తానే ప్రశ్నపత్రం టైపు చేయడంతో టాపర్గా నిలిచారని అక్కడ ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. అదే కార్యాలయంలో ఏఎ్సవోగా పనిచేస్తున్న మల్లికార్జునరెడ్డి సొంత తమ్ముడు వెంకట్రామిరెడ్డికి మూడో ర్యాంకు వచ్చింది.
ఆదినుంచీ అనుమానాలే: వాస్తవానికి సచివాలయ పరీక్షల్లో పెద్ద గూడుపుఠాణి నడుస్తోందని, కొందరికి ప్రయోజనం కూర్చేలా స్కెచ్ వేశారని, వారికే ఉద్యోగాలు వచ్చేలా కథ నడుస్తోందని ‘ఆంధ్రజ్యోతి’కి కొద్ది రోజుల కిందటే ఉద్యోగార్థులు సమాచారమందించారు. ప్రతిభావంతులను పక్కనబెట్టి కొద్ది మందికి ప్రశ్నపత్రాలు ముందుగా అందిస్తున్నారని వారు ఆరోపించారు. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ‘ఆంధ్రజ్యోతి’ వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. కానీ ఫలితాలు ప్రకటించిన కొన్ని నిమిషాల్లోనే భారీ సంఖ్యలో అభ్యర్థులు మొత్తం వ్యవహారాన్ని బట్టబయలు చేస్తూ ‘ఆంధ్రజ్యోతి’కి ఉప్పు అందించారు. పూర్తి స్థాయిలో పరిశీలన అనంతరం వారి ఆరోపణ నిజమేనని, సర్వీసు కమిషన్లో పనిచేస్తున్న ఆ ముగ్గురే కాకుండా అనేక జిల్లాల్లో చాలా మందికి ఈ పేపర్లు వెళ్లిపోయాయని తెలుస్తోంది.
ప్రక్రియలోనే తిరకాసు: ప్రశ్నపత్రాల తయారీకి సంబంధించి అప్పట్లో పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. పరీక్షల నిర్వహణ విషయంలో ఎంతో పకడ్బందీగా అన్నీ జాగ్రత్తలు తీసుకున్న అధికారులు, పేపర్ రూపకల్పన సమయంలో జరుగుతున్న వ్యవహారాన్ని పసిగట్టలేకపోయారు. సాధారణంగా ప్రశ్నపత్రం ఆయా శాఖలు వారి సబ్జెక్టులకు సంబంధించి వివిధ యూనివర్సీటీలు, నిపుణులతో తయారుచేయించి ఏపీపీఎస్సీకి అందించాలి. ఏపీపీఎస్సీ ఈ ప్రశ్నాపత్రాలను ముద్రించి పరీక్షా నిర్వహకుల ద్వారా అన్ని జిల్లాలకు తరలిస్తారు. అయితే పరీక్షాపత్రాలను ఏపీపీఎస్సీకి కాకుండా నేరుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనరేట్లో పనిచేస్తున్న ఓ రిటైర్డ్ అధికారికి అందించారు. ఆ అధికారి ఈ ప్రశ్నాపత్రాలను ఏపీపీఎస్సీకి సమర్పించారు. ఈ సందర్భంలో ఒక రిటైర్డ్ అధికారికి ప్రశ్నాపత్రాలు అందించడమేంటి? అంటూ పలుఆరోపణలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఏపీపీఎస్సీలో ఈ అధికారి పేపర్లను చూశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అప్పట్లో ఈ ఆరోపణలపై కమిషనరేట్ స్పందించలేదు.
టఫ్ పేపర్కు ఇన్ని మార్కులా? : గ్రామ సచివాలయ ఉద్యోగుల రాత పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రం అత్యంత కఠినంగా ఉందని సర్వత్రా అభిప్రాయం ఉంది. దీంతో ఈ దఫా రాసిన ఉద్యోగార్థుల్లో ప్రకటించిన ఉద్యోగాల సంఖ్య మేర అయినా అర్హత పొందుతారో లేదోనన్న అనుమానాలు ఉన్నాయి. పేపర్ అత్యంత క్లిష్టంగా ఉందని ఐఏఎస్ పరీక్షలకు ఇచ్చే ప్రశ్నపత్రంలాగా ఉందని పలువురు మంత్రులు కేబినెట్లో ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించారు. ఈ పరీక్షల్లో 150 మార్కులకుగాను 100 మార్కులు దాటడమే కష్టమన్న భావన అందరిలో ఉంది. ఈ నేపధ్యంలో మొదటి ర్యాంకు అభ్యర్థులకు 112.25 మార్కులు రావడంతో ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలకు బలం చేకూరింది.
ఆ ఇంట్లోనే 3 ర్యాంకులు: గ్రామ సచివాలయ ఫలితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇంకా అనేకానేక ఆసక్తికరఅంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక ఉద్యోగి కుటుంబంలో ఆయన భార్యతో సహా మొత్తం ముగ్గురికి మంచి ర్యాంకులే వచ్చాయి. ఆయనే కాకుండా మరికొంత మంది ఉద్యోగులకు కూడా తమ తమ బంధువర్గాలకు ప్రశ్నపత్రాలను పంపి కథ నడిపించేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఏపీపీఎస్సీలో ఔట్సోర్సింగ్లో పనిచేస్తున్న మరో మహిళా ఉద్యోగికి ఆమె సొంత జిల్లాలో టాప్ 10లో స్థానం దక్కినట్లు తెలుస్తోంది.