ముంబై: విలక్షణ నటుడు ఇర్ఫాన్ఖాన్ మరణించి 24 గంటలు గడవక ముందే హిందీ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు రిషికపూర్ (67) గురువారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడటంతో రిషి కపూర్ను కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
క్యాన్సర్తో బాధపడుతున్న రిషి కపూర్ ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకుని గత సెప్టెంబర్లో ముంబైకి తిరిగి వచ్చారు. తర్వాత పలు ఆరోగ్య సమస్యలతో రెండు పర్యాయాలు ఆస్పత్రి పాలయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రిషి కపూర్ సమకాలిన సమస్యలపై తనదైన శైలిలో స్పందించేవారు. ఏప్రిల్ నుంచి తన ట్విటర్ పేజీలో పోస్టులేమి పెట్టలేదాయన. రిషికపూర్ మరణంతో బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
బాలీవుడ్ దిగ్గజ నటుడు రెండో కొడుకైన రిషికపూర్.. 1952, సెప్టెంబర్ 4న ముంబైలో జన్మించారు. మేరా నామ్ జోకర్ చిత్రంతో బాల నటుడిగా రంగప్రవేశం చేసిన ఆయన ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ‘బాబీ’ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు.
చాందినీ, గురుదేవ్, మేరానామ్ జోకర్, బాబీ, జిందా దిల్, రాజా, అమర్ అక్బర్ ఆంటోనీ, సర్గమ్, పతీపత్నీఔర్ ఓ, కర్జ్, కూలీ, దునియా, నగీనా, దూస్రా ఆద్మీ చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. దాదాపు 51 సినిమాల్లో హీరోగా నటించారు. రిషి కపూర్కు భార్య నీతూ కపూర్, పిల్లలు రిద్దిమా కపూర్ సాహ్ని, రణ్బీర్ కపూర్ ఉన్నారు. 1980లో హీరోయిన్ రీతూకపూర్ను ఆయన వివాహం చేసుకున్నారు. నటుడుగానే కాకుండా దర్శక, నిర్మాతగా రాణించిన ఆయన పలు అవార్డులు అందుకున్నారు.