– మండిపోతున్న కూరగాయల ధరలు
– చిక్కుడు, బీన్స్ కేజీ వందపైనే
– కాకర, బీర, గోకర, క్యారెట్ రూ.80
– ఏది చూసినా కేజీకి రూ.60 పెట్టాల్సిందే
– ఆకుకూరల ధరలూ తీవ్రంగా పెరిగిన వైనం
హైదరాబాద్ : కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రేట్లు చూసి ‘ఏం కొనేటట్టు లేదు..తినేటట్టు’ లేదు అని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. బోడకాకరకాయ కిలో రూ.160 పలుకుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరింది. చిక్కుడు, బీన్స్ రేట్లు సెంచరీ దాటేశాయి. కాకర, బీర, గోకర, క్యారెట్, మిర్చి రేట్లు కిలో రూ.80 పలుకుతున్నాయి. మిగతా ఏవి కొనాల న్నా తక్కువలో తక్కువ రూ.50 వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. మార్కెట్కు ఆకుకూరలు కూడా పెద్దగా రావడం లేదు. దీంతో వాటి రేట్లు కూడా భగ్గుమంటున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల తో పంటలు దెబ్బతినడం, సరైన రవాణా సౌకర్యాలు లేకపోవ డంతోనే మార్కెట్కు కూరగాయలు రావడం తగ్గిందనీ, ఎండలు కొడుతున్న నేపథ్యంలో వారం రోజుల్లో కొంతమేర తగ్గే అవకాశం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వానలకుతోడు, రవాణా వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో బోయిన్పల్లి, మోండా, ఎన్టీఆర్నగర్, మాదన్నపేట, తదితర కూరగాయల మార్కెట్లకు వచ్చే కూరగాయల సరఫరా గణనీయంగా తగ్గింది. ‘ఈ సీజన్లో వచ్చేదాని కన్నా సగం మేర తక్కువగా వస్తున్నాయి. అవీ మచ్చలతో కూడినవే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో వ్యాపారం కూడా సరిగా నడవట్లేదు’ అని ఎన్టీఆర్నగర్లోని కూరగాయల మార్కెట్కు చెందిన హోల్సేల్ వ్యాపారి రాజారావు తెలిపారు.
హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాల నుంచి బస్సు సౌకర్యం సరిగ్గా లేకపోవడం వల్ల కూడా కూరగాయలు వస్తలేవు. రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో టమాట ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్, మదనపల్లి, కర్నూల్, కర్నాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్, బెల్గాం, కోలార్ తదితర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్నది. కమీషన్ ఏజెంట్లు హౌల్సేల్లో ఏవన్ గ్రేడ్ 25 కేజీల టమాట బాక్స్ వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారు. చిన్నటమాట బాక్సులను నాణ్యతను బట్టి రూ.600 నుంచి రూ.800కు ఇస్తున్నారు. ఎన్టీఆర్నగర్, కొత్తపేట రైతు బజార్లలో కిలో టమాట రూ.40 నుంచి 50 వరకు అమ్ముతున్నారు. అదే నల్లకుంటలో రూ.60 ఉంది. బోయినపల్లి మార్కెట్కు కాకరకాయలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి. అక్కడ నుంచి మిగతా మార్కెట్లకు వెళ్తున్నాయి. హౌల్సేల్లో పదికేజీల కాకరకాయ రూ.400 ఉంది. రైతుబజార్లో రూ.50కి విక్రయిస్తున్నారు. శంకర్మఠ్లోని రిటైల్ మార్కెట్లో, కిరాణాల్లో కిలో కాకరకాయ రూ.80 అమ్ముతున్నారు. కనీసం పదికేజీలు తీసుకుంటే హోల్సేల్లో కమీషన్ ఏజెంట్లు కిలో పచ్చిమిర్చి(ఏవన్ క్వాలిటీ)కి రూ.46 చొప్పున వేస్తున్నారు. రైతుబజార్లో రూ.60 ఉండగా, కిరాణాషాపుల్లో, శంకర్మఠ్ మార్కెట్లో కిలో పచ్చిమిర్చి రూ.80 పలుకుతున్నది. బిన్నీస్ హోల్సేల్లోనే 70 రూపాయలు ఉంది. బహిరంగ మార్కెట్కు వచ్చేసరికి అది కాస్తా వంద నుంచి 110 రూపాయలు ఉంటున్నది.
అయితే, అదీ మచ్చలతో కూడి వస్తుండటంతో వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. రంగారెడ్డి, ఆయా జిల్లాల నుంచి మార్కెట్కు వచ్చిన వంకాయ హోల్సేల్లో కిలోకు కేవలం రూ.10 -15 పలుకుతుండగా బహిరంగ మార్కెట్లో అన్ని కూరగాయల తోపాటే రూ.40 నుంచి రూ.50 వరకు అమ్ముతున్నారు. దోసకాయ రేటు కూడా రూ.50 ఉంది. ఇవి గాక మిగతా కూరగాయలన్నీ కిలో 60 చొప్పున అమ్ముతున్న పరిస్థితి ఉంది. ‘చిక్కుడుకాయ వర్షాలకు మొత్తం మచ్చ వచ్చింది. అదికాస్తా తడవడటం, మార్కెట్కు ఓ గంట ఆలస్యంగా రావడం వల్ల 8 బస్తాల చిక్కుడుకాయ ఆగమైంది. బస్తాల్లో నిల్వ ఉండటం వల్ల మురిగిపోయింది. పారబోసినం.20 వేల దాకా నష్టపోయినం’ అని ఎన్టీఆర్నగర్ మార్కెట్లోని హోల్సేల్ వ్యాపారి రఘు వాపోయాడు.
హోల్సేల్లో వ్యాపారులు తీసుకునే కూరగాయల నుంచి చిరువ్యాపారులను ఏరనీయడం లేదు. పది, ఇరవై కేజీల లెక్కన జోకి ఇచ్చేస్తున్నారు. ఆ సరుకులో కొంతమేర నష్టాన్ని మినహాయించి, రవాణా చార్జీలు, తమ లాభాలను కలుపుకుని బహిరంగ మార్కెట్లో అమ్మేసరికి ధర రెట్టింపు అవుతున్నది. హోల్సేల్ మార్కెట్ల నుంచి వినియోగదారునికి చేరే క్రమంలో మూడు,నాలుగు చేతులు మారడం వల్లనే ఈ పరిస్థితి కనిపిస్తున్నది.
రైతుబజార్లలోనూ రైతులు కూరగాయాలు అమ్ముకుంటున్న పరిస్థితి లేదు. వారి స్థానాలను వ్యాపారులు ఆక్రమించేసిన పరిస్థితి నెలకొంది. రైతులేమో కమీషన్ ఏజెంట్ల వద్ద తమ సరుకును అడ్డికిపావుసేరు లెక్క అమ్ముకుంటున్న పరిస్థితి కనిపించింది. ఓరైతుకు వంకాయను అమ్మి కిలోకు పది రూపాయల చొప్పున మాత్రమే కమీషన్ ఏజెంట్ కట్టించాడు.
ఆకుకూరలూ అందని వైనం
గతంలో ఆకుకూరలు చాలా తక్కువ ధరకే లభించేవి. లాక్డౌన్ సమయంలోనూ పదికి నాలుగు పాలకూర కట్టలు ఇచ్చిన పరిస్థితి. కానీ, ఇటీవల కురిసిన వర్షాలతో ఆకుకూరల పంటలు మొత్తం దెబ్బతిన్నాయి. 20కి నాలుగు పాలకూర కట్టలు ఇస్తున్నారు. పొన్నగంటికూర, పుంటికూర, బచ్చలకూర ఇలా అన్ని ఆకుకూరలదీ ఇదే పరిస్థితి. దీనికితోడు కట్టల సైజూ తగ్గింది. మార్కెట్కు కొత్తిమీర, పూదీన రావడం కూడా తగ్గింది. దీంతో వాటిరేట్లు కూడా పెరిగాయి. పదికి ఐదు, నాలుగు కోతిమీర కట్టలు గతంలో ఇవ్వగా ప్రస్తుతం రెండు మాత్రమే ఇస్తున్నారు.
రేట్లు ఉన్నయి..తప్పదుకదా.. : రవి, వినియోగదారుడు, ఎల్బీనగర్
రేట్లు బాగనే ఉన్నాయి. గతం కంటే రెట్టింపు డబ్బులు పెట్టాల్సి వస్తున్నది. ఏది కొనబోయినా రూ.50, 60 చెబుతున్నరు. పావుకిలో ఇవ్వట్లేదు. కనీసం అరకిలో తీసుకుంటనే ఇస్తున్నరు. రేట్లు తగ్గించమంటే కసురుకుంటున్నరు. సప్పుడుజేయక అడిగినంత ఇచ్చి కొనుక్కుని పోతున్నం. రేట్లు ఉన్నయని తినక తప్పదుకదా. కూరగాయల రేట్లపైనా నియంత్రణ ఉంటే సామాన్యులకు కొంతలో కొంతైనా ప్రయోజనం కలుగుతుంది.