- విషమంగా ఆయన ఆరోగ్యం
- రోజులు లెక్కబెడుతున్న పరిస్థితి
- చివరి రోజుల్లో కుటుంబ సభ్యుల
- సమక్షంలో ఉండేలా చూడండి
- తక్షణం బెయిల్ ఇప్పించండి
- బాంబే హైకోర్టులో లాయర్ వినతి
- కుటుంబ సభ్యులు చూడవచ్చా?
- రేపటిలోగా సమాధానం ఇవ్వండి
- ఎన్ఐఏకు హైకోర్టు నిర్దేశం
ముంబై : ‘‘విరసం నేత వరవరరావు అంపశయ్యపై ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. మరి కొన్ని రోజులు మాత్రమే ఆయన బతికే అవకాశం ఉంది. ఒకవేళ, ఆయన చనిపోతే, కనీసం కుటుంబ సభ్యుల సమక్షంలో మరణించేలా చూడండి. విచారణను ఏ విధంగానూ ప్రభావితం చేసే స్థితిలో లేని వరవరరావుకు బెయిల్ ఇప్పించండి’’ అని ఆయన తరపు న్యాయవాది సుదీప్ పస్బోలా బోంబే హైకోర్టుకు విన్నవించారు.
విచారణను ప్రభావితం చేసే స్థితిలో ఆయన లేరన్న విషయంపై చివరికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు కూడా భిన్నాభిప్రాయాలు లేవని తెలిపారు. ‘‘ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. పైగా, ఇప్పుడు కరోనా సోకింది’’ అని వివరించారు. అయితే, కరోనా రోగుల్ని కలిసేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మార్గదర్శకాలు అంగీకరించవని కోర్టుకు ఎన్ఐఏ తరపున న్యాయవాది, అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ విన్నవించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కుటుంబ సభ్యులు వరవరరావును కలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది దీపక్ థాకరే తెలిపారు. నిర్దిష్ట దూరం నుంచైనా ఆయనను కుటుంబ సభ్యులు చూసేందుకు వీలవుతుందా? అంటూ పలు ప్రశ్నలు అడిగిన ధర్మాసనం.. బుధవారంలోగా తమకు సమాధానం చెప్పాలని ఆదేశించింది. కాగా, ఆయన ఆరోగ ్య పరిస్థితిని తమకు పారదర్శకంగా తెలపాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన సహచరి హేమలత, కూతుర్లు సహజ, అనల, పవన డిమాండ్ చేశారు. ఆయనను జేజే, సెయింట్ జార్జ్, నానావతి ఆస్పత్రులకు తరలించడం తమకు తెలియదని పేర్కొన్నారు.
‘‘వరవరరావు తనకు తానుగా ఏ పనీ చేయలేకపోతున్నారు. ఆయనకు సహకరించడానికి కుటుంబ సభ్యుల్లో ఒకరిని తోడుగా ఉండేలా చూడండి. ఆరోగ్య పరిస్థితిని రెండు రోజులకోసారి అధికారికంగా తెలియజేయాలని జైలు అధికారులు, ఆస్పత్రి సిబ్బందిని ఆదేశించండి’’ అని డిమాండ్ చేశారు. ఆయన చికిత్సకు సంబంధించిన వైద్య నివేదికలన్నీ అందుబాటులో ఉంచాలన్నారు. బెయిల్ తీసుకోవడానికున్న అడ్డంకులన్నీ తొలగించాలని కోరారు.
Courtesy Andhrajyothi