– కరోనాను కట్టడి చేయలేక చేతులెత్తేసిన భారత్, అమెరికా
– ట్రంప్ సర్కార్ నిర్లక్ష్యానికి మూల్యం చెల్లిస్తున్న అమెరికన్లు
– భారత్లో వైరస్ బాధితుల్ని వేధిస్తున్న ప్రజారోగ్య సేవలు
– మోడీ సర్కార్ కీలకమైన రెండు నెలల సమయాన్ని వృధాచేసింది : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : రెండు అతిపెద్ద ప్రజాసామ్య దేశాలు…అమెరికా, భారత్లు కరోనాబారిన పడి విలవిల్లాడుతున్నాయి. అత్యధిక మరణాలతో అమెరికా, అత్యధిక కొత్త కేసులతో భారత్ రోజూ వార్తల్లో నిలుస్తున్నాయి. అక్కడ డొనాల్డ్ ట్రంప్…ఇక్కడ ప్రధాని మోడీ…ఇప్పుడు ప్రజలకు జాగ్రత్తలు చెప్పి…బాధ్యత నుంచి తప్పుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు దేశాల్లోనూ ప్రజారోగ్య వ్యవస్థ సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది సహా కరోనాబారిన పడుతున్నారు. సరైన మౌలిక వసతులు లేక ప్రజలు భయంతో చనిపోయే వాతావరణం నెలకొంది. అక్కడ ట్రంప్ సర్కార్…ఇక్కడ మోడీ సర్కార్ వైరస్ వ్యాప్తి గురించి నిజాలు చెప్పటం లేదనే అనుమానాలు బలపడుతున్నాయి.
సమస్యను అంగీకరించ లేకపోవటం
వైరస్కు సంబంధించి తొలిరోజుల్లో డొనాల్డ్ ట్రంప్ ఎలా వ్యవహరించారో ప్రపంచమంతా చూసింది. నిన్నమొన్నటి వరకూ అసలు మాస్క్ ధరించటాన్ని సైతం ఆయన నిరాకరించారు. అంతేగాక వైద్య ఆరోగ్యశాఖల నిపుణుల సలహాల్ని సైతం ఆయన తేలిగ్గా తీసుకున్నారు. ఎవ్వర్నీ లెక్కచేయనితనం ఆయన వ్యవహరశైలిలో స్పష్టంగా కనపడింది. దాంతో వైరస్ను శాస్త్రీయ దృక్పథంతో అరికట్టే చర్యలకు ట్రంప్ సర్కార్ చాలా దూరంలో నిలబడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కరోనా మహమ్మారి వంటి తీవ్రమైన సంక్షోభం తలెత్తిన సమయంలో అమెరికాలో ట్రంప్ సర్కార్కు-ఆరోగ్య వ్యవస్థకు మధ్య సమన్వయం కుదరలేదు. ఒక ఏకీకృత ప్రజారోగ్య వ్యవస్థ మహమ్మారిని నియంత్రించే చర్యలు చేపడితే పరిస్థితులు వేరేలా ఉండేవని అక్కడి నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో అత్యంత ధనవంతులు సైతం ప్రయివేటు హాస్పిటల్స్లో చికిత్స పొందటం సాధ్యమయ్యే పనికాదు. అక్కడి ప్రయివేటు హాస్పిటల్స్ ఆ రేంజ్లో బిల్లులు వేస్తుంటాయి. ఇక సామాన్యులు, సగటు ఉద్యోగులు, పేద అమెరికన్ల సంగతి మనం ఊహించుకోవచ్చు. అందువల్లే ప్రపంచంలో అత్యధిక మరణాలు అమెరికాలో చోటుచేసుకోవటాన్ని మనం చూస్తున్నాం.
భారత్లో కొరవడిన సన్నద్ధత
ఇంచుమించుగా భారత్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ప్రభుత్వ ఆరోగ్య సేవలు కరోనా బాధితులకు, అనుమానితులకు అందుబాటులో లేవు. ప్రయివేటు హాస్పిటల్స్కు వెళ్దామంటే చేతిలో కనీసం నాలుగైదు లక్షల రూపాయలు ఉండాల్సిందే. అమెరికాతో పోల్చితే భారత్లో భిన్నమైన పరిస్థితులేమీ లేవు. అమెరికాలో ఎలాంటి భయానక పరిస్థితి ఉందో…భారత్లోనూ ప్రజలు భయంతో చచ్చిపోతున్నారు. అమెరికాలో ఆరోగ్యవ్యవస్థ మొత్తం ప్రయివేటు బీమా కంపెనీల చేతుల్లో చిక్కుకుపోయింది. ఇక్కడా దాదాపు అదేపరిస్థితి. గత ఆరేండ్లలో ప్రజారోగ్య వ్యవస్థలో మోడీ సర్కార్ పెద్దగా మార్పు తెచ్చిన దాఖలా లేదు. పోనీ ఈ సంక్షోభ సమయంలోనైనా మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించారా అంటే అదీ లేదు.
వైరస్పై పోరాటం ఇలాగేనా!
అమెరికా ఎలాగైతే సరైన సన్నద్ధత లేక కరోనా వైరస్ ముంగిట తలొగ్గిందో…భారత్కూడా దాదాపు అదే పరిస్థితులో ఉందని చెప్పక తప్పదు. పక్కనే ఉన్న చైనాలో ఏం జరుగుతుందో, 2019 డిసెంబరు నుంచీ చూస్తున్నా మోడీ సర్కార్ తగిన చర్యలు చేపట్టలేదు. అత్యంత కీలకమైన ఫిబ్రవరి, మార్చి…సమయాన్ని మోడీ సర్కార్ సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఫిబ్రవరి 24న అహ్మదాబాద్లో ట్రంప్ సభను విజయవంతం చేయడానికి మోడీ సర్కార్ ఎంతగానో తపించింది. ఇదే రకమైన చిత్తశుద్ధి కరోనాను కట్టడి చేయటంలో కనపడలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఎలా గెలుపొందాలా? అల్లర్లు, హింస ఘటనలతో రాజకీయంగా లబ్ది ఎలా పొందాలా? అనే ఆలోచనలతో అధికార రాజకీయ నాయకులు బిజీ బిజీగా గడిపారు. మార్చి చివరి వరకూ ఇలాగే సాగదీసి..హఠాత్తుగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. కేవలం మూడు వారాల్లో వైరస్పై విజయం సాధిస్తామని మోడీ సర్కార్ ప్రకటించింది. లాక్డౌన్పై ఎక్కడా కూడా రాష్ట్రాలతో సంప్రదింపులు జరపలేదు. ఆహారం, ఉపాధి, వలస కార్మికులకు ఆశ్రయం వంటి విషయాలపై ఆలోచన చేయకుండా ముందుకెళ్లారు. దాంతో ఉపాధి కరువై, కరోనా వెంటాడుతుంటే..ప్రజలు నానా అవస్థ పడాల్సి వస్తున్నది.
Courtesy Nava telangana