* అంగీకరించిన అమెరికా
కాబూల్/వాషింగ్టన్ : శుక్రవారం నాడు నాంగ్రార్ ప్రావిన్స్లో తాము జరిపిన డ్రోన్ దాడిలో 30 మంది రైతులు చనిపోయిన మాట నిజమేనని ఆఫ్ఘన్లోని అమెరికా సైనిక దళాలు అంగీకరించాయి. ఖోగ్యాని జిల్లా వజీర్ టాంగీ ప్రాంతంలో జరిగిన ఈ దాడి వెనుక ఆప్ఘన్ ప్రభుత్వ దళాలు వున్నట్లు వార్తలువెలువడిన విషయం తెలిసిందే. ఐఎస్ మిలిటెంట్ సంస్థకు చెందిన ఒక రహస్య స్థావరాన్ని ధ్వంసం చేసే లక్ష్యంతో అమెరికన్ సైనిక దళాలే ఈ డ్రోన్ దాడిని నిర్వహించాయని అమెరికా సైనిక ప్రతినిధి ఒకరు గురువారం ఒక ట్వీట్లో స్పష్టం చేశారు. తొలుత తమకు అందిన సమాచారం ప్రకారం తాము దాడి చేసిన లక్ష్యాలలో ఐఎస్ మిలిటెంట్ సంస్థ సభ్యులున్నట్లు తెలిసిందని, అయితే ఈ దాడులు గురితప్పి రైతుల మరణాలకు దారితీశాయని వెల్లడించారు. ఈ దాడుల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం ఏ మేరకు జరిగిందన్న అంచనా వేసేందుకు తాము స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నామన్నారు. ఈ డ్రోన్ దాడిలో పైన్ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న 30 మంది కార్మికులు మరణించగా, మరో 40 మందికి పైగా గాయపడ్డారని నాంగ్రార్ ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యుడు సోహ్రబ్ ఖాద్రీ వెల్లడించారు. ప్రభుత్వం ఈ దాడిపై దర్యాప్తు చేస్తోందని ఆయన చెప్పారు.
Courtesy Prajashakthi..