కన్నెగంటి రవి
ప్రజా సంస్థల నాయకులు పరస్పరం ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ, బురద చల్లుకుంటూ ఉంటారు కానీ, అందరికందరూ, ఒకే రకమైన ప్రపంచీకరణ సృష్టించిన వ్యక్తివాద జీవన విధానానికి అలవాటు పడ్డారు. మార్క్స్, అంబేడ్కర్ పేర్లు ఎవరు, ఎన్ని సార్లు వల్లె వేసినా, ఆచరణలో నిజమైన దోపిడీ, వివక్ష ఎదుర్కొనే మెజారిటీ ప్రజల సమస్యలపై ఆలోచించి పని చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. అందరూ సమాజంలో ఉపరితల అంశాలపై పైపైన మాట్లాడానికి పరిమితమై పోతున్నారు.
వ్యక్తుల మధ్య లేదా సంస్థల మధ్య స్నేహం, ఐక్యత ఎప్పుడు చిరకాలం నిలుస్తాయి? అభిప్రాయాల మధ్య ఏకీభావం ఉన్నప్పుడు, పరస్పర గౌరవం ఉన్నప్పుడు, సమస్య వస్తే చర్చల ద్వారా పరిష్కరించుకునే ఓపిక ఉన్నప్పుడు, అన్నిటికీమించి నిర్దేశించుకున్న లక్ష్యం ఒక్కటైనప్పుడు, వ్యక్తిగత జీవితంలో సామాజిక కార్యాచరణలో నిజాయితీ నిబద్ధత ఉన్నప్పుడు. ప్రజల కోసం పని చేస్తున్నాం అనుకునే వ్యక్తులు, సంస్థలు, పార్టీలు ముందుగా తమలోకి తాము తొంగి చూసుకుంటే ఈ లక్షణాలు తమకు ఉన్నాయో లేదో అర్థమైపోతుంది. ఉన్నాయి అనుకుంటే, అప్పుడు యితరులతో చర్చల గురించి, ఐక్యత గురించి, ఐక్య కార్యాచరణ గురించి ఆలోచించవచ్చు.
ప్రస్తుత వ్యవస్థ అన్నిరకాలుగా కుళ్లిపోయి ఉంది. సమాజంలో అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకు పోయాయి. పాలకులు రాను రానూ మరింత నియంతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ రంగం కుంచించుకుపోతూ, దేశంలో వనరులు విదేశీ స్వదేశీ బహుళ జాతి సంస్థల దురాక్రమణకు గురవుతున్నాయి. నూటికి 70 మంది ప్రజలు పేదరికంలో, అప్పులలో, అనారోగ్యంలో, నిరక్షరాస్యతలో కునారిల్లుతున్నారు. అన్ని రాజ్యాంగ, ప్రజాస్వామిక హక్కులు హరించబడుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే– ప్రజల పక్షాన ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలకు దేశ భౌతిక పరిస్థితి సంసిద్ధంగా ఉన్నా, దేశంలో కనీస నిరసన వ్యక్తం చేసే వాతావరణమే లేకుండా పోయింది.
ప్రతిఘటించడం అటుంచండి, నిరంకుశ పాలకుల విధానాలను ప్రశ్నించే శక్తే సంస్థలలో ఎందుకు లేకుండా పోయింది? పోరాటాలు సాగించాల్సిన యువత, నిరాశా నిస్పృహలలో ఎందుకు కూరుకుపోయింది? కార్మిక వర్గం తన సమరశీల పోరాట స్వభావాన్ని ఎందుకు కోల్పోయింది? సామూహిక ప్రజా ఉద్యమాలలో ప్రభుత్వ నిర్భంధానికి గురై మరణించే వాళ్ళకంటే, సమాజంలో మానసిక ఒంటరితనానికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్న వాళ్ళ సంఖ్య ఎందుకు పెరుగుతున్నది? ప్రజా ఉద్యమ సంస్థలు, పార్టీలు ఎందుకు ఐక్యంగా ఉండలేక, చీలికలకు గురవుతున్నాయి? అస్తిత్వ ఉద్యమాలు, సంస్థలు కూడా ఒక దశ దాటాక ఎందుకు స్తబ్ధతకు గురవుతున్నాయి. ఆయా సంస్థలలో, పార్టీలలో నిబద్ధత కలిగిన కార్యకర్తల సంఖ్య ఎందుకు తగ్గిపోతున్నది? సమాజంలో సమానత్వం, ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, మతసామరస్యం భావనల కంటే, ఉన్నత నాగరిక విలువల కంటే, నిరంకుశత్వం, వ్యక్తి వాదం, దురాశ, అరాచకత్వం, మాదక సంస్కృతి, పిల్లలపై స్త్రీలపై హింస, సామాజికంగా వెనుకబడిన వర్గాలపై వివక్ష, మతోన్మా దం ఎందుకు పెరుగుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడమన్నది ఏ ప్రజా సంస్థకైనా, ప్రజాపక్ష రాజకీయ పార్టీకైనా ప్రధాన ఎజెండాగా ఉండాలి. ఈ క్రమంలో మాత్రమే ఈ వ్యవస్థ దుర్లక్షణాల వల్ల ఎవరు ఎక్కువ సంక్షోభంలో ఉన్నారో తెలుస్తుంది. ఆ సంక్షోభానికి కారణాలను, పరిష్కారాన్ని వెతికే పని నిజాయితీగా చేయగలిగితే ప్రజల భాగస్వామ్యంతో సంక్షోభ పరిష్కారానికి ఎటువంటి కార్యాచరణ చేపట్టాలో అర్థం అవుతుంది. ఈ కార్యాచరణలో ఎవరెవరు తమతో కలసి వస్తారు అన్నది కూడా తెలుస్తుంది. నిరంతర అధ్యయనం, పరిశీలనతో సమస్యల స్వభావంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవాలి. ఆయా మార్పులను ప్రజలకు అర్థం చేయించాలి. దానికి అనుగుణంగా సంస్థలు తమ డిమాండ్లను మార్చుకోవాలి. రోజువారీ కార్యాచరణలో చేసుకోవాల్సిన మార్పుల గురించి చర్చించాలి. చేసుకున్న మార్పులకు అనుగుణంగా సంస్థాగత పత్రాలు, భవిష్యత్ పోరాట రూపాలు నిర్ణయించుకోవాలి.
కానీ ఎప్పుడైతే ఈ క్రమం పాటించరో, అప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలు, వింత వితండ వాదనలు, ఒంటెత్తు పోకడలు మొదలవుతాయి. స్వీయ విమర్శ పోయి, పరనింద ప్రారంభం అవుతుంది. సంస్థల కార్యాచరణపై చర్చ కంటే, వ్యక్తుల మీద గోల మొదలవుతుంది. వర్తమాన విషయాల మీద కంటే, గతంలో జరిగిన తప్పుల మీద చర్చ కేంద్రీకృత మవుతుంది. పడక్కుర్చీ నిట్టూర్పులు, బహిరంగ నోటి దూకుడూ రచ్చకెక్కుతాయి. ఆలోచనకంటే అసహనం మాత్రమే రాజ్యమేలుతుంది. నిర్దేశించుకున్న సిద్ధాంతాలను పక్కకు నెట్టి, నాయకులను దేవుళ్లను చేయడం ప్రారంభమవుతుంది. లేని దేవుళ్ళను పూజించే భక్తులకూ, నాయకుల వ్యక్తి పూజలోకి దిగిన కార్యకర్తలకూ పెద్ద తేడా లేదు.
మొదటి క్రమాన్ని పాటించడం ప్రస్తుతం చాలా సంస్థలు, పార్టీలు మానేశాయి. రెండవ అక్రమమే యిప్పుడు నడుస్తున్నది. అందుకే ప్రజా ఉద్యమాలకంటే వివిధ పేర్లతో ప్రజా సంస్థల సంఖ్య పెరిగిపోతున్నది. స్నేహ పూర్వక చర్చల కంటే, శత్రుపూరిత దూషణలు ముందుకొస్తున్నాయి. తెలిసీ తెలియక, ఏదో ఒక రూపంలో అందరిలోనూ వ్యక్తమవుతున్న ఆధిపత్య, అహంభావ ధోరణులకు చిహ్నం ఇది. ఈ వ్యవస్థను సంపూర్ణంగా మార్చనిదే కొత్త సమాజం నిర్మాణం కాదని భావించే విప్లవకారులు ఉండొచ్చు. ఈ వ్యవస్థ స్వభావాన్ని పూర్తిగా మార్చలేకపోయినా, ప్రజలకు సంక్షేమాన్ని సంస్కరణల ద్వారా సాధించవచ్చు అని భావించే సంస్కరణ వాదులు ఉండొచ్చు. నిజానికి, ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడంలో, ప్రజలతో చర్చించడంలో పాలకులు ఎలా వ్యవహరిస్తారు అన్నదాని మీద ఆధారపడి, ప్రజల పోరాట రూపాలు నిర్ణయమవుతాయి
ఈ వ్యవస్థ పరిధిలోనే, అహింస ద్వారా, రాజ్యాంగం అనుమతించిన పద్ధతుల్లో ప్రయత్నం చేసి పాలకులపై ఒత్తిడి తెచ్చి కొన్ని ప్రజానుకూల సంస్కరణలు సాధించవచ్చు అనుకునే వాళ్లున్నారు. ఈ వర్గ వ్యవస్థను సాయుధ పోరాటం ద్వారా కూలదోసి, నూతన ప్రజాస్వామిక వ్యవస్థను సాధించాలనే ఆలోచనలు కలిగిన వాళ్ళున్నారు. అయితే ఏ ఆలోచనకయినా అన్ని దశలలో ప్రజల భాగస్వామ్యం, మద్దతు అవసరం. పోరాట రూపాలను నిర్ణయించుకున్నవాళ్ళు, ఫలితాలకు కూడా బాధ్యత వహించడానికి సిద్ధపడి ఉంటారు. నడుస్తున్న క్రమంలో మాత్రమే వాటి సవ్య, అపసవ్యతలు నిర్ధారించబడతాయి. చరిత్ర పదే పదే రుజువు చేసిన సత్యమిది. నేర్చుకుంటాయా లేదా అన్నది ఆయా సంస్థల ఇష్టం. మారిన పరిస్థితులలో సంక్షోభానికి కారణాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించడానికి ఆయా సంస్థలు సిద్ధంగా లేకపోవడమే ఇప్పుడున్న అసలు సమస్య. ఒక వేళ గుర్తించినా, అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించక పోవడమే ఇవ్వాళ ప్రధాన సమస్యగా ఉంది.
ప్రజా సంస్థల నాయకులు పరస్పరం ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ, బురద చల్లుకుంటూ ఉంటారు కానీ, అందరికందరూ, ఒకే రకమైన ప్రపంచీకరణ సృష్టించిన వ్యక్తివాద జీవన విధానానికి అలవాటు పడ్డారు. మార్క్స, అంబేడ్కర్ పేర్లు ఎవరు, ఎన్ని సార్లు వల్లె వేసినా, ఆచరణలో నిజమైన దోపిడీ, వివక్ష ఎదుర్కొనే మెజారిటీ ప్రజల సమస్యలపై ఆలోచించి పని చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. అందరూ సమాజంలో ఉపరితల అంశాలపై పైపైన మాట్లాడానికి పరిమితమై పోతున్నారు.
నిజంగా క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి పని చేయాల్సిన అంశాలు లేవా? ఉన్నాయి. ఉదాహరణకు రెండు తెలుగు రాష్ట్రాల ఆదివాసీ ప్రాంతాలలో అటవీ హక్కుల చట్టం సమగ్రంగా అమలు కావడం లేదు. 1/70 చట్టం అమలు కావడం లేదు. ఈ ప్రాంత ప్రజల సమస్యలపై కొన్ని ఎంఎల్ పార్టీలు, కొన్ని ఆదివాసీ సంస్థలు కొంత కార్యాచరణ చేపడుతున్నప్పటికీ, ఈ కార్యాచరణ ఆదివాసీల హక్కులను కాపాడగలిగిన స్థితిలో లేదు.
గ్రామీణ ప్రాంతంలో దున్నుకోవడానికి భూమి లేక, సంవత్సరం పొడవునా చేయడానికి పని లేక ఆర్థికంగా దోపిడీకి, సామాజికంగా వివక్షకు గురవుతున్న వ్యవసాయకూలీలు ఉన్నారు. వీరిలో అత్యధికులు దళితులు, వెనుకబడిన వర్గాలు. కనీసం వీరికి సామాజిక భద్రతా పథకాలు కూడా అమలు కావడం లేదు. గ్రామీణ ప్రాంతంలో కౌలు రైతుల సంఖ్య సన్న చిన్నకారు రైతుల సంఖ్య కూడా ఎక్కువే. వీరిలో కూడా అత్యధికులు దళితులు, వెనుకబడిన సామాజిక వర్గాల వారే. కానీ వీరి సమస్యలపై పని చేస్తున్న రైతు, కూలీ సంఘాలు ఎక్కువ లేవు. ఉన్నా అత్యంత బలహీనంగా ఉన్నాయి. ఈ వర్గాల సమస్యలపై, ముఖ్యంగా భూమి సమస్యపై పని చేసే వర్గ సంఘాలు కూడా తగ్గిపోయాయి. ఒకటి రెండు దళిత, ఆదివాసీ, బహుజన సంఘాలకు తప్ప ప్రధాన సామాజిక సంస్థల ఎజెండాలో కీలకమైన భూమి సమస్య అసలు లేదు. ప్రభుత్వాలు లక్షలాదిగా ఉన్న కౌలు రైతులను గుర్తించడానికి, వారి వ్యవసాయానికి పూర్తి మద్దతు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ఇదొక రకమైన వివక్షే. కానీ దీనిపై గొంతెత్తి మాట్లాడే దళిత, బీసీ సంఘాలు లేవు.
పట్టణ, నగర ప్రాంతాల అసంఘటిత రంగంలో లక్షలాదిమంది ఉన్నారు. వీరు మురికి వాడల్లో, ఎటువంటి హక్కులు లేకుండా జీవిస్తున్నారు. వీరికి కనీస వేతనాలు లేవు. ఉద్యోగ భద్రత లేదు. సంఘటిత ఉపాధ్యాయుల, ఉద్యోగుల, కార్మికులతో పోల్చినపుడు వీరు వివక్షను కూడా ఎదుర్కుంటున్నారు. కానీ ఈ అసంఘటిత ప్రజల కోసం, కార్మికుల కోసం పని చేసే వర్గ సంస్థలు కూడా తక్కువే. దళిత, బీసీ సంఘాల అజెండాలో ఈ ప్రజల సమస్యలు పెద్దగా కనిపించడం లేదు.
ప్రభుత్వ స్కూళ్లలో, కాలేజీలలో చదువుకుంటున్న విద్యార్థులలో అత్యధికులు ఈ గ్రామీణ, పట్టణ శ్రామిక వర్గానికి చెందినవారే. వారిలో కూడా అత్యధికులు దళిత, బీసీ సామాజిక వర్గాలకు చెందినవారే. కానీ ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ విద్యా సంస్థలను నాశనం చేస్తున్నా, వాటిని కాపాడుకోవంపై ఈ వర్గ సంఘాలు కానీ, దళిత, బీసీ సంఘాలు కానీ పెద్దగా దృష్టి సారించడం లేదు. చాలా సంఘాల అజెండాలో ఇది సమస్యే కాదు
ప్రజా ఉద్యమ సంస్థలు, వర్గ సంఘాలు, వివిధ సామాజిక సంస్థల మధ్య పై ఐదు అంశాల ప్రాతిపదికగా చర్చలు జరిగితే తప్పకుండా ఒక విశాల ఐక్య కార్యాచరణ రూపొందడానికి అవకాశం ఉంది. అయితే విషాదం ఏమిటంటే మార్క్సిస్టులు అందరికీ ఈ కీలక ఎజెండా లేకుండా పోయినట్లే, అంబేడ్కరిస్టులు అందరికీ ఈ సమస్యలు సామాజిక వివక్షకు సంబంధించిన అంశాలుగా కూడా కనపడడం లేదు. ఈ అంశాలు ఆలోచించకుండా, అందుకు అనుగుణంగా కార్యాచరణ లేకుండా నిరంకుశ, దోపిడీ పాలకులను ఓడించడం అటుంచండి, ఆయా సామాజిక శ్రేణులు, శ్రామిక వర్గాలు తమ సాధారణ సమస్యలనైనా పరిష్కరించుకోగలవా?
రైతు స్వరాజ్య వేదిక
Courtesy Andhrajyothi