- చికిత్స పొందుతూ డ్రైవర్ శ్రీనివాస్రెడ్డి మృతి
- హైదరాబాద్లో కండక్టర్ ఆత్మహత్య
- నర్సంపేటలో మరో డ్రైవర్
- ఆత్మాహుతియత్నం
- హైదరాబాద్లో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత
- పోలీసు దిగ్బంధంలో ఖమ్మం నగరం
- 19న రాష్ట్ర బంద్కు విపక్షాల మద్దతు
- కిరణ్ను మించి కేసీఆర్ చర్యలు: లక్ష్మణ్
- కార్మికుల జీవితాలతో ఆడుకోవద్దు:
- మన ఓట్లకు పుట్టినోడు కేసీఆర్: కోదండ
- శ్రీనివాస్రెడ్డిది సర్కారీ హత్య: నారాయణ
- సకల జనుల సమ్మెగా…: ఆర్.కృష్ణయ్య
- మాకు చెప్పి సమ్మె చేస్తున్నరా!?: కారెం
ఆర్టీసీ కార్మికుల విషాదాలు కొనసాగుతున్నాయి! ఉద్యోగం పోయినట్లేనంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనతో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవు తున్నారు! ఇదే కారణంతో శనివారం ఆత్మాహుతి యత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు కూడా ముగియక ముందే మరో కార్మికుడు తనువు చాలించాడు. రాణిగంజ్ డిపోకు చెందిన కండక్టర్ సురేందర్ గౌడ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సెప్టెంబరు నెల జీతం రాకపోవడం, బిడ్డ పెళ్లికి తీసుకున్న రుణానికి ఈనెల చెల్లించాల్సిన ఈఎంఐ బౌన్స్ కావడమే ఇందుకు కారణం!
48 వేల మంది ఆర్టీసీ కార్మికులే తన కుటుంబం అనుకున్నారు! వారి భవిష్యత్తును ప్రభుత్వం ప్రశ్నార్థకం చేయడంతో తీవ్ర మనో వేదనకు గురయ్యారు! తాను చనిపోయినా సోదర కార్మికులంతా ‘మంచిగుండాల’ని భావించారు! తన చావుతోనైనా వారికి న్యాయం జరగాలని ఆశించారు! ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సు కోరుతూ ఆత్మ బలిదానం చేశారు! కార్మికులను ప్రభుత్వం రోడ్డున పడేయడంతో శనివారం ఆత్మాహుతి యత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మరణించారు. హైదరాబాద్ కంచన్బాగ్లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 10.45 గంటలకు కన్నుమూశారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళన మధ్య అక్కడే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. భారీ బందోబస్తు మధ్య శ్రీనివాస్ రెడ్డి మృతదేహాన్ని ఆయన స్వస్థలం ఖమ్మానికి తరలించారు. ఆదివారం రాత్రే ఖమ్మంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు.
మృత్యువుతో పోరాటం….ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెందిన శ్రీనివాస్ రెడ్డి శనివారం మధ్యాహ్నం 3.20 గంటలకు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం ఆయనను రాత్రి 10 గంటలకు డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. 90 శాతం కాలిపోవడంతో శరీరం చికిత్సకు సహకరించలేదు. ఆదివారం ఉదయం 10.45-11.00 గంటల మధ్య శ్రీనివాస్రెడ్డి మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన మరణ వార్తను పోలీసులు గోప్యంగా ఉంచారు. పరామర్శకు వెళ్లిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆస్పత్రి నుంచి బయటికి వచ్చి చెప్పేంత వరకు శ్రీనివాస్రెడ్డి మరణించారనే విషయం బయటికి రాలేదు. శ్రీనివా్సరెడ్డి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అతడి కుమారుడు అభిరామ్ను ఆర్టీసీ జేఏసీ నేతలు ఓదార్చారు. నిబంధనల ప్రకారం.. శ్రీనివాస్రెడ్డి మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించాలి. కానీ, కార్మికుల ఆందోళన నేపథ్యంలో మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించడం కష్టమని భావించిన పోలీసులు.. అదే ఆస్పత్రిలో పోస్టుమార్టానికి ఏర్పాట్లు చేశారు. ఉస్మానియా మార్చురీ డీన్ తాఖీయుద్దీన్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం పూర్తి చేశారు.
ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. కార్మికుల అరెస్ట్……అప్పటి వరకూ శ్రీనివాస్ రెడ్డి బతకాలని ప్రార్థిస్తున్న కార్మికులు, కుటుంబ సభ్యుల ఆశలు ఆయన మరణించారన్న వార్త తెలియగానే ఆవిరయ్యాయి. వారంతా ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయారు. ఆవేదన, ఆగ్రహం, ఆవేశంతో పెద్దపెట్టున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ‘కేసీఆర్ డౌన్.. డౌన్’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ‘శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య.. ప్రభుత్వ హత్య’ అని నినదించారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడల వల్లే శ్రీనివాస్ రెడ్డి మరణించారని మండిపడ్డారు. కార్మికులకు మద్దతుగా సీపీఎం, సీపీఐ-ఎంఎల్, పీవైఎల్, డీవైఎ్ఫఐ తదితర సంఘాల నేతలు ఆస్పత్రి వద్దకు తరలివచ్చి నినాదాలు చేశారు. శ్రీనివాస్ రెడ్డి మృతి విషయం క్షణాల్లో పాకడంతో రాజకీయ నాయకులు ఆస్పత్రి వద్దకు తరలి వచ్చారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
బస్ భవన్కు నో శ్రీనివాస్ రెడ్డి మృతదేహాన్ని బస్ భవన్కు తీసుకెళతామని ఆర్టీసీ జేఏసీ నేత లు పట్టుబట్టగా.. పోలీసులు అనుమతించలేదు. కార్మికుల ఆందోళన నేపథ్యంలో 15 వాహనాలను అంబులెన్స్కు రక్షణగా ఏర్పాటు చేశారు. ముందు 8, వెనక ఏడు వాహనాలు అంబులెన్స్తోపాటు ఖమ్మం వరకు వెళ్లాయి. ఆస్పత్రి ప్రధాన గేటు నుంచి వెళితే.. కార్మికులు అడ్డుకుంటారనే అనుమానంతో గుట్టుచప్పుడు కాకుండా వెనక గేటు నుంచి మృతదేహాన్ని తరలించారు.
పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఆస్పత్రి గేటు వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు థామస్ రెడ్డి, హనుమంతు, సుధాకర్, గోవర్థన్, సత్యనారాయణ, రఘువంశీ సహా 100 మంది కార్మికులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
2 కిలోమీటర్ల నుంచే మోహరించిన పోలీసులు ఆర్టీసీ కార్మికుల ఆందోళనల నేపథ్యంలో అపోలో ఆస్పత్రికి రెండు కిలోమీటర్ల దూరం నుంచే పోలీసులు మోహరించారు. శనివారం రాత్రి నుంచే పోలీసులు ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి విషమించిందనే సమాచారంతో తెల్లవారుజామున ఉన్నతాధికారులు మరింతమంది సిబ్బందిని తరలించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో వివిధ స్థాయుల్లో సిబ్బంది, అధికారులు అక్కడికి చేరుకున్నారు. సౌత్ జోన్, ఈస్ట్ జోన్లకు చెందిన శాంతి భద్రతలు, టాస్క్ఫోర్స్, మహిళా పోలీసు స్టేషన్ల సిబ్బంది, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ నుంచి పెద్దఎత్తున రిజర్వు బలగాలను రప్పించారు. దాంతో, చికిత్స కోసం వచ్చిన రోగులు, వారి అటెండర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆస్పత్రి వద్ద బందోబస్తును హైదరాబాద్ అదనపు కమిషనర్ చౌహాన్ పర్యవేక్షించారు.
నేను సూసైడ్ చేసుకొనుటకు ప్రభుత్వమే కారణము. టీఎ్సఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆర్టీసీ కార్మికుల పీఎఫ్, సీసీఎస్ డబ్బులను వెంటనే జమ చేయాలి. –సూసైడ్ నోట్లో శ్రీనివాస్రెడ్డి
నేను చనిపోయినా పర్వాలేదు. ఆర్టీసీలో 48 వేల మంది కార్మికులు మంచిగా ఉండాలే. ఎంత మందిని మోసం చేస్తావు కేసీఆర్? –ఆస్పత్రిలో శ్రీనివాస్ రెడ్డి చివరి మాటలు
ఉద్యోగం నుంచి తొలగించామని సీఎం చెప్పడంతో నా భర్త చాలా కలత చెందారు. ఉద్యోగం పోతే ఎలా అని ఆందోళన చెందారు. శ్రీనివాస్రెడ్డి మృతి వార్త తెలిసిన దగ్గర్నుంచీ ముభావంగా ఉన్నారు. రాత్రి ఉరి వేసుకుని చనిపోయారు. –సురేందర్ గౌడ్ భార్య
ఆకలి, ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేశాం.
-2018 నవంబరు 13న ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్
శ్రీకాంతాచారి ఇదే ఆస్పత్రిలో..! తెలంగాణ మలి దశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి కూడా కంచన్బాగ్లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలోనే మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడి మరణించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన.. డిసెంబరు 1, 2009న ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతి యత్నం చేసిన విషయం తెలిసిందే. 70 శాతం కాలిన గాయాలతో శ్రీకాంతాచారిని వెంటనే సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. శరీరమంతా పూర్తిగా కాలడంతో చికిత్స చేయడానికి కామినేని వైద్యులు నిరాకరించారు. దాంతో, ఆయనను డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల తర్వాత (డిసెంబరు 3న) మరణించారు. ఆయన మృతదేహాన్ని భారీ బందోబస్తు నడుమ స్వగ్రామం, నల్లగొండ జిల్లాలోని పోడిచేడుకు తరలించారు. ఇప్పుడు శ్రీనివాస రెడ్డి మృతదేహాన్ని కూడా అదే మాదిరిగా భారీ బందోబస్తుతో ఖమ్మానికి తరలించారు.
Courtesy Andhra jyothi..