- కొత్తగూడెం జిల్లాలో ఘటన.. ఆందోళనలో గిరిజనులు
- మందుపాతర పేలిన 24 గంటల్లో తుపాకుల మోత
- పూసుగుప్ప అడవుల్లో మళ్లీ అలజడి మొదలు
- ప్రజా ప్రతినిధులు బయట తిరగొద్దన్న పోలీసులు
చర్ల/కొత్తగూడెం/హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో.. పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. చర్ల మండలంలోని వద్దిపేట-పూసుగుప్ప గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. తాలిపేరు ప్రాజెక్టు సమీపంలో మావోయిస్టులు మందుపాతర పేల్చి 24 గంటలు గడవక ముందే ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. రెండు తుపాకులు, రెండు కిట్ భ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ ఆదివారం బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో దాడులు జరగవచ్చనే సమాచారం పోలీసులకు అందింది. దాంతో చర్ల అడవుల్లో కూబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు తారస పడ్డారు. దీంతో.. ఇరువైపులా 20 నిమిషాలపాటు కాల్పులు జరిగాయి.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చర్లకు, అక్కడి నుంచి భద్రాచలానికి తరలించినట్లు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్దత్ తెలిపారు. ఎన్కౌంటర్లో మృతిచెందినవారిని ఇంకా గుర్తించలేదన్నారు. తాలిపేరు వద్ద మావోయిస్టులు మందుపాతరను పేల్చడం.. ఆ తర్వాతి రోజే మావోయిస్టుల ఎన్కౌంటర్తో అడవుల్లో తుపాకీ మోత మోగడం, పోలీసుల కూంబింగ్ కొనసాగుతుండడంతో గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా.. రెండేళ్ల తర్వాత చర్లలో కాల్పుల మోత మోగింది. 2018 ఆగస్టులో చర్ల అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఏరియా కమాండర్ అరుణ్కుమార్ మృతిచెందిన విషయం తెలిసిందే.
వారంలో రెండో ఎన్కౌంటర్
సెప్టెంబరు 7 అడవిలో మళ్లీ అలజడి రేగింది. ఏడాదికాలంగా ప్రశాంతంగా ఉన్న అటవీ ప్రాంతాల్లో తిరిగి కాల్పుల మోత మొదలైంది. ఇటీవల యాక్షన్ టీముల సంచారంతో పోలీసులు అప్రమత్తమ్యయారు. ఈ మొత్తం వ్యవహారాన్ని డీజీపీ దగ్గరుండి పర్యవేక్షించారు. గతవారం గుండాలలో జరిగిన ఎన్కౌంటర్ మావోయిస్టుల ఉనికిని తెలియజేస్తే.. తాజాగా జరిగిన ఎన్కౌంటర్ తిరిగి వారు సాధించిన పట్టును నిరూపిస్తోంది. ఇటీవల పోలీసుశాఖలో చేసిన మార్పులు కూడా.. మావోయిస్టుల ఉనికిని గుర్తించడంలో ఫలితాలనిస్తున్నాయి. దీనికితోడు పోలీసుశాఖలో పనిచేసి రిటైర్ అయిన వారి సేవలను వినియోగించుకుంటున్నారు. స్పెషల్ పోలీసు ఆఫీసర్లు (ఎస్పీవోలు)గా తాత్కాలిక ప్రాతిపదికన కొంతమంది మాజీ సైనికులను నియమించుకుంటున్నారు. తాజా ఎన్కౌంటర్ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా ఛత్తీ్సఘడ్ సరిహద్దుపై పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. అటవీ ప్రాంతాలను కూంబింగ్తో జల్లెడపడుతున్నారు. యాక్షన్ టీమ్లు సంచరిస్తున్న ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు.. ప్రధానంగా అధికార పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. సమాచారం ఇవ్వకుండా ఏజెన్సీల్లో కార్యక్రమాలు పెట్టుకోవద్దని చెబుతున్నారు.
Courtesy Andhrajyothi