– పీఎంఈఏసీ నుంచి షమిక, రతిన్లతొలగింపు
– మోడీ సర్కారు విధానాలు, ఆర్థిక మందగమనంపై ప్రశ్నించినందుకు మూల్యం
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (పీఎంఈఏసీ)లో సభ్యులుగా ఉన్న ఇద్దరు అధికారులు షమిక రవి, రతిన్రారులు ఉద్వాసనకు గురయ్యారు. ఈ మేరకు వారిని పీఎంఈఏసీ నుంచి తొలగిస్తున్నట్టు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. నలుగురు సభ్యులుండే ఈ ప్యానెల్లో ఇద్దరు తాత్కాలిక సభ్యులు కాగా ఇద్దరు ఫుల్టైం మెంబర్లుగా ఉన్నారు. శాశ్వత సభ్యులైన పీఎంఈఏసీ చైర్మెన్ బిబేక్ డెబ్రారు, రతన్ వటల్లు స్థానచలనం చెందలేదు. తొలగించిన వారి స్థానంలో జేపీ మోర్గాన్లో ఆర్థికవేత్తగా పనిచేస్తున్న సాజిద్ చినోరు, ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్లో పనిచేస్తున్న అశిమా గోయల్ను నియమించారు. రతిన్, షమికల తొలగింపునకు కారణాలేమీ వెల్లడించలేదు. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో రతిన్ రారు దేశ ఆర్థిక వ్యవస్థపై ఓ పత్రికలో వ్యాసం రాస్తూ.. ఆర్థిక మాంద్యం చాపకింద నీరులా పాకుతుందని పేర్కొన్నారు. గతేడాది ఆర్థిక సంవత్సరానికి కేంద్రం తీసుకున్న పలు విధానాల ఫలితంగా వృద్ధిరేటు మందగించడం తప్పేలా లేదని ఆయన వ్యాసంలో రాశారు. అలాగే షమిక తన ట్విట్టర్లో స్పందిస్తూ.. ఆర్థిక మందగమనం గురించి పలు ట్వీట్లు చేశారు. ఈ సమస్య నుంచి అధిగమించడానికి కేంద్రం తక్షణ చర్యలకు ఉపక్రమించాలని ఆమె సూచించారు. ఆర్థిక వ్యవస్థను ఆర్థిక మంత్రికి వదిలివేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈ కారణంగానే వీరిద్దరూ ఉద్వాసనకు గురయ్యారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Courtesy Nava telangana…