- రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రభుత్వం!
- నగరాలు, జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో..
- ప్రభుత్వ భూముల్లో లే అవుట్లు
- ప్లాట్లుగా లేదా ఇళ్లు నిర్మించి అమ్మకాలు
- మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదన
- అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సానుకూలం
- సీఎం కేసీఆర్ ఆమోదిస్తే వెంటనే అమల్లోకి!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. పెద్దఎత్తున ఆదాయం సమకూర్చుకోవడానికి స్థిరాస్తి వ్యాపారం అనువైనదిగా భావిస్తోంది. ఇది ఉభయతారకమని.. ప్రభుత్వంతో పాటు ప్రజలకూ ఉపయుక్తంగా ఉంటుందని అంచనా వేస్తోంది. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆదాయ మార్గాల అన్వేషణకు ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం.. ప్రభుత్వం స్థిరాస్తి వ్యాపారంలోకి ప్రవేశించాలనే ప్రతిపాదనను సీఎం కేసీఆర్ ముందుంచినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ ప్రతిపాదన ప్రకారం.. హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాలు, అన్ని జిల్లా కేంద్రాలు, ఇతర ప్రధాన పట్టణాల్లో సర్కారు స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి శ్రీకారం చుడుతుంది. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లోని ప్రస్తుత నివాస ప్రాంతాల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను వినియోగిస్తారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ భూములను గుర్తించే పని మొదలైంది.
ప్రభుత్వానికి ప్రయోజనం ఏంటంటే..
రాష్ట్రంలో ప్రభుత్వ భూములను కాపాడటం అధికార యంత్రాంగానికి కష్టంగా మారింది. ధరలు విపరీతంగా పెరగడంతో ఇప్పటికీ కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి, ప్రభుత్వ భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు నిజాయతీగా ఉన్న చోట్ల భూ వివాదాలు కోర్టు గడప తొక్కుతున్నాయి. అటువంటి పంచాయితీలు ఏళ్ల తరబడి ఎటూ తేలడం లేదు. ఇక లంచాలకు అలవాటు పడిన అధికారులున్న చోట్ల ప్రభుత్వ భూముల ఆక్రమణకు అడ్డుకట్ట వేయలేని పరిస్థితి నెలకొంది. తాజా ప్రతిపాదన మేరకు ప్రభుత్వ భూములను లే అవుట్లుగా మార్చి ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్లాట్లు చేసి విక్రయాలు చేపడితే ప్రభుత్వానికీ ఆదాయం వస్తుంది. ఇంజనీరింగ్ సిబ్బంది, మానవ వనరులు అందుబాటులో ఉన్నందున ఇళ్లు, అపార్ట్మెంట్లు నిర్మించి అమ్మితే ఆదాయానికి ఢోకా ఉండదు.
ప్రజలకెలా లాభం అంటే..
ప్రభుత్వం నేరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగడం వల్ల ప్రజలకూ లాభమేనని ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఊరూరా రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. చాలా మంది వ్యాపారుల వెంచర్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండడం లేదు. ప్రజలు అటువంటి వెంచర్లలో స్థలాలు కొని ఇళ్లు నిర్మించుకుంటున్నారు. అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొంటున్నారు. తర్వాత తాము మోసపోయినట్లు గుర్తిస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. అటువంటి వారంతా భూ, భవన క్రమబద్ధీకరణ పథకాల (ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్) పేరిట ప్రభుత్వం ఇస్తున్న వెసులుబాటును విధిలేని పరిస్థితిలో వినియోగించుకోవాల్సి వస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన తప్పులకు, కొనుగోలుదారులు నష్టపోవాల్సి వస్తోంది. అంతేకాక రియల్ ఎస్టేట్ వ్యాపారులు ‘కాస్ట్ టు కాస్ట్’ విక్రయాలు జరిపే దాఖలాలు ఉండవు.
వాస్తవ ధరకు, వారు ఖరారు చేసే ధరకు నాలుగైదు రెట్ల తేడా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల సిండికేట్ వల్ల ఎవరి వెంచర్లో ప్లాటు/ఫ్లాట్ తీసుకున్నప్పటికీ ధరలో పెద్దగా తేడా ఉండటంలేదు. వీటిన్నింటికీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగు పెట్టడం ద్వారా చెక్ పెట్టవచ్చని ఉన్నతాధికార వర్గాలు చెబుతున్నాయి. ‘ప్రధానంగా కొనుగోలుదారులకు భూ వివాదం తలెత్తదు. రిజిస్ట్రేషన్ సమస్య ఉత్పన్నం కాదు. కొలతల్లో తేడా ఉండదు. నిర్మాణాల నాణ్యతా ప్రమాణాలను వేలెత్తి చూపే పని ఉండదు. మార్కెట్ ధర కంటే కొంత తక్కువ మొత్తానికే ప్రజలు స్థలాలు/ ఇళ్లు/ ఫ్లాట్లు కొనుక్కోవచ్చు’ అని ప్రభుత్వంలోని కీలక నేత ఒకరు చెప్పారు.
గత అనుభవాలు ఏం చెబుతున్నాయంటే..
ప్రభుత్వం ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ రంగంలోకి నేరుగా దిగనప్పటికీ ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రభుత్వ ఏజెన్సీలు, స్థానిక పట్టణాభివృద్ధి సంస్థలు ‘రియల్’ తరహా ‘వ్యాపారం’ చేశాయి. హౌసింగ్ బోర్డు కాలనీలు, రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్లు అలా వెలిసినవే. కానీ, ధర ఎక్కువగా ఉండడం, నివాస ప్రాంతాలకు దూరంగా ఉండడం, నాణ్యతా లోపం అనే అపవాదులతో ఏళ్లుగా కొన్ని ఇళ్లు/అపార్ట్మెంట్లు అమ్మకానికి నోచుకోక సంబంధిత ఏజెన్సీలకు నష్టాన్ని తెచ్చిపెట్టాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ల్యాండ్ పూలింగ్ ద్వారా హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో ఇళ్ల స్థలాల విక్రయాన్ని చేపట్టిన హెచ్ఎండీఏ దండిగా ఆదాయం పొందింది. ఈ తరహాలోనే ప్రజలకు సరసమైన ధరలకు ప్రభుత్వ భూములను ఇళ్ల స్థలాలు, గృహాలు, అపార్ట్మెంట్లుగా మార్చి విక్రయిస్తే లాభదాయకమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
సీఎం కేసీఆర్ అంగీకరిస్తే..
ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాలనే ప్రతిపాదనకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సానుకూలంగా ఉన్నారు. దీనివల్ల స్థానికంగా తమకు మంచి పేరు వస్తుందని వారు భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ అంగీకరిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశించే ప్రక్రియ ఆచరణలోకి రానుంది.
Courtesy Andhrajyothi