- డిపోల నుంచి కదలని ఆర్టీసీ బస్సులు
- ఉద్యోగాలు పోతాయన్నా సమ్మెలోకే
- సీఎం హెచ్చరించినా కార్మికులు బేఖాతరు
- ఏపీఎస్ఆర్టీసీ నుంచి 190 బస్సుల రాక
- 49,733 ఆర్టీసీలో మొత్తం సిబ్బంది
- 160 శనివారం విధులకు హాజరైనవారు
- ప్రైవేటు బస్సుల్లో రెండింతలు వసూలు
- ఖమ్మం నుంచి హైదరాబాద్కు 180
- 300-400 పిండిన అద్దె బస్సుల ఓనర్లు
ఎర్ర బస్సుకు రెడ్ సిగ్నల్ పడింది! ఆర్టీసీ హారన్ ఆగింది! బస్సులు డిపోలను దాటలేదు! సర్కారు అల్టిమేటాన్ని కార్మికులు తూచ్ అన్నారు! డెడ్లైన్ ముగిసేసరికి దాదాపు 50 వేల మందిలో 160 మంది మాత్రమే విధుల్లో చేరారు. ఎక్కడికక్కడ పోలీసులను మోహరించి.. పటిష్ఠ బందోబస్తు మధ్య ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా.. ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. దసరా, బతుకమ్మ పండుగల ముందు అల్లాడిపోయారు. బస్టాండ్లలోనే గంటలకొద్దీ పడిగాపులు కాశారు. ఇదే అదనుగా ప్రైవేటు వాహనదారులు అందినకాడికి దోచుకున్నారు. రెండు మూడు రెట్లు పెంచి వసూలు చేశారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్కు టికెట్ రూ.190 కాగా.. 600 నుంచి 800 వరకూ పిండేశారు. కాగా, డిపో నుంచి ఒక్క బస్సు కూడా కదలలేదని, సమ్మె 100 శాతం విజయవంతమైందని కార్మిక జేఏసీ ప్రకటిస్తే.. 9000కుపైగా బస్సులను నడిపామని, ప్రయాణికులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చూశామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక, సమ్మెపై సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం సమీక్షించనున్నారు.
వీరు బోజన్న, లచ్చమ్మ దంపతులు. పది రోజుల కిందట హైదరాబాద్ వచ్చారు. బోజన్న గొంతు ఆపరేషన్ చేయించుకున్నాడు. తిరిగి స్వగ్రామం వనపర్తి వెళ్లేందుకు శనివారం ఉదయం ఎంజీబీఎ్సకు వచ్చారు. బస్సులు రాలేదు. బస్టాండ్లో పడిగాపులు కాశారు. ఆర్టీసీ సమ్మె తెలియక బస్టాండుకు వచ్చామని, ఇంటికి ఎలా వెళ్లాలో తెలియడం లేదని లచ్చమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. బస్సుల సమాచారం అడుగుదామంటే సిబ్బంది ఒక్కరూ లేరని, బస్సులు రాకపోతే బస్టాండ్లో పడుకోవాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది రాజధానిలోని ఎంజీబీఎ్సలో పరిస్థితి. హైదరాబాద్లో మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే దుస్థితి. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సద్దుల బతుకమ్మను సంబురంగా జరుపుకొనేందుకు కుటుంబసమేతంగా సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణమైన వారికి ఆర్టీసీ కార్మికుల సమ్మె షాక్ ఇచ్చింది. తాండూరు నుంచి వికారాబాద్కు బయలుదేరిన బస్సుకు మధ్యలోనే డీజిల్ అయిపోయింది. దాంతో, డ్రైవర్ దిగి పరారయ్యాడు. వికారాబాద్ శివారులో బస్సుపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. డ్రైవర్ ముందున్న అద్దం పగిలిపోయింది. డ్రైవర్ చేతికి గాయమైంది. ఈ ఘటనతో భీతిల్లిన కొందరు డ్రైవర్లు తాము ఈ డ్యూటీలు చేయలేమంటూ బస్సులు అప్పగించి వెళ్లిపోయారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా గుర్తు తెలియని వ్యక్తులు రాయి విసరడంతో డ్రైవర్ పక్కన ఉన్న అద్దం పగిలింది. అలాగే, గోదావరిఖని నుంచి భూపాలపల్లి వెళుతున్న బస్సు మంథని సమీపానికి చేరుకోగానే గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు.
దాంతో, బస్సులో ప్రయాణిస్తున్న బాబు, మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం గోకారం వద్ద కూడా గుర్తు తెలియని వ్యక్తులు బస్సుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో అద్దాలు పగిలి డ్రైవర్ చేతికి గాయమైంది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్, శామీర్పేట్, కీసర, మూడుచింతలపల్లి, ఘట్కేసర్, మేడిపల్లి, కాప్రా తదితర మండలాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. బస్సులు నిలిచిపోవడంతో కార్యాలయాలకు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు వెళ్లే సింగిల్ రూట్లకు బస్సులను నిలిపి వేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆటోలు, కార్లు, జీపులను ఆశ్రయించారు.
ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల్లో దోపిడీ : ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల్లో ప్రయాణికులను నిలువు దోపిడి చేశారు. చేవెళ్ల నుంచి మెహదీపట్నానికి ఎక్స్ప్రెస్ టికెట్ ధర రూ.46 కాగా, ప్రైవేటు వాహనదారులు రూ.100 దాకా వసూలు చేశారు. ఉప్పల్ నుంచి భువనగిరికి సాధారణ చార్జి రూ.40 కాగా రూ.100 తీసుకున్నారు. నిర్మల్ నుంచి ఖానాపూర్ బయలుదేరిన ఆర్టీసీ బస్సులోనే తాత్కాలిక సిబ్బంది అధిక ధరలు వసూలు చేశాడు. హన్మకొండ నుంచి హైదరాబాద్కు రూ.150కి బదులుగా ప్రైవేటు వాహనదారులు రూ.350 నుంచి రూ.400 వసూలు చేశారు. మంత్రి అజయ్ సొంత జిల్లా ఖమ్మంలోనూ ఇదే పరిస్థితి. ఖమ్మం నుంచి హైదరాబాద్కు ఎక్స్ప్రెస్ చార్జీ రూ.180 కాగా అద్దె బస్సుల యాజమాన్యాలు రూ.300 నుంచి రూ.400 వసూలు చేశాయి. ప్రైవేటు బస్సులు ఇష్టారాజ్యంగా పిండుకున్నాయి.
శనివారం 9వేల బస్సులను నడిపాం. 2,129 ఆర్టీసీ బస్సులు, 1,717 అద్దె బస్సులు, 1,155 ప్రైవేట్ వాహనాలు, 1,195 స్కూలుబస్సులు, 2,778 మ్యాక్సీ క్యాబ్లు ఉన్నాయి. మరో 7 వేల ప్రైవేటు బస్సులకు అనుమతి ఇస్తాం.
– రవాణా మంత్రి అజయ్
రోజూ ఆర్టీసీ బస్సుల ద్వారా రూ.11 కోట్ల ఆదాయం వస్తుంది. పండుగ రోజుల్లో రూ.15-17 కోట్ల వరకు ఉంటుంది. శనివారం రూ.50 లక్షలు దాటలేదు. వచ్చి ఉంటే అధికారికంగా ప్రకటించండి.
– జేఏసీ నేత
–థామస్ రెడ్డి సవాల్
Courtesy Andhrajyothi…