ఉత్కంఠ… ఉద్విగ్నం.. నరాలు తెగే టెన్షన్…
ప్రపంచాన్ని శాసించే అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత ఎవరన్నది తేలలేదు సరికదా… మరింత సంక్లిష్టంగా మారింది. ఫలితాల సరళి బట్టి చూస్తే డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ మేజిక్ మార్క్ 270ని దాటేయవచ్చన్నది అంచనా.. లక్షల సంఖ్యలో ఉన్న పోస్టల్ బ్యాలెట్లు ఆయనకే ఎక్కువగా లభించవచ్చని సర్వే సర్వత్రా వినిపిస్తోంది. నాలుగేళ్ల కిందట హిల్లరీ క్లింటన్ను అనూహ్యంగా ఓడించినట్లే ఈసారీ అద్భుతం సృష్టిస్తానని అటు ట్రంప్ ఆశ. అదే సమయంలో భయం కూడా!
ఆ భయంతోనే తుది ఫలితం తనకు అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టుకెక్కుతానని హెచ్చరిక. అటు బైడెన్ శిబిరమూ దీనికి సై… ఏతావాతా అగ్రరాజ్యం చరిత్రలోనే ఎన్నడూ చూడనంత అనిశ్చితి…
- ఉద్రిక్తత… ఆందోళన!
- వైట్హౌస్ బిగ్బాస్ జోబైడెనే?
- స్వింగ్ రాష్ట్రాల్లో బైడెన్ స్వల్ప ముందంజ
- సాగుతున్న కౌంటింగ్.. తేలని తుది ఫలితం
- అనూహ్యంగా పుంజుకొన్న ట్రంప్
- ఫ్లోరిడా, టెక్సస్, ఒహాయో రాష్ట్రాల్లో విజయం
- గెలుపు తనదేనని ప్రకటన.. విభేదించిన బైడెన్
- సుప్రీంకెక్కుతానన్న ట్రంప్.. రెడీ అంటున్న జో
వాషింగ్టన్ : ఊహించినట్లే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ-భరిత క్లైమాక్స్ దిశగా వెళుతున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ మధ్య నువ్వా-నేనా అన్న పరిస్థితి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం… రేసులో బైడెన్ ముందంజలో ఉన్నారు. ప్రారంభంలో తడబడ్డా చివర్లో బైడెన్ పుంజుకొన్నారు. ఎలక్టోరల్ కాలేజీలో ఉన్న 538 ఓట్లకు గాను- 270 ఓట్లు సాధించేవారే అధ్యక్షుడవుతారు. తాజా సమాచారం ప్రకారం… బైడెన్కు 227 లభించగా, ట్రంప్ 213 ఓట్లతో అతి సమీపంలో ఉన్నారు. అత్యంత కీలకమైన 6 ప్రభావ రాష్ట్రాల్లో ఇద్దరి మధ్యా హోరాహోరీ సాగుతోంది. అందులోనూ మూడింట — పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సన్ల్లో గెలిచేవారే అధ్యక్ష పదవి చేపట్టవచ్చని చెబుతున్నారు. వీటిలో మిషిగన్, విస్కాన్సన్ల్లో బైడెన్ ముందంజలో ఉన్నారు. పెన్సిల్వేనియాలో ట్రంప్కు ఆధిక్యం ఉంది. ఇవి కాక- మిగిలిన మూడూ- నార్త్ కరోలినా, జార్జియా, నెవడాలూ కీలకమైన స్వింగ్ రాష్ట్రాలుగా మారాయి. ఈ ఆరింటా లక్షల సంఖ్యలో ఉన్న పోస్టల్, ముందస్తుగా పడిన వ్యక్తిగత (ఇన్-పర్సన్) ఓట్ల లెక్కింపు శ్వేతసౌధాధిపతి ఎవరన్నది నిర్ణయిస్తుంది. ఇందులో కూడా పెన్సిల్వేనియాపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. వీటి కౌంటింగ్కు కనీసం మరో 12-15 గంటలు పట్టవచ్చన్నది ఓ అంచనా. అంటే గురువారం మధ్యాహ్నం 12 గంటలకు గానీ ఓ స్పష్టమైన చిత్రం రాకపోవచ్చు. ప్రభావ రాష్ట్రాలను మినహాయిస్తే మిగిలిన చోట్ల బైడెన్ గణనీయమైన రీతిలో విజయాలు నమోదుచేశారు. న్యూయార్క్, న్యూజెర్సీ, కొలరాడో, కనెక్టికట్, ఇల్లినాయి, డెలావేర్, మసచుసెట్స్, న్యూమెక్సికో, వెర్మాంట్, వర్జీనియాల్లో విజయం సాధించారు.
ఫ్లోరిడా గెలుపుతో ఉత్సాహం
అటు ట్రంప్- కీలకమైన ఫ్లోరిడా, టెక్సస్, అయోవా, ఒహాయోల్లో అనూహ్య విజయాలు సాధించి ప్రత్యర్థి శిబిరంలో ప్రారంభంలోనే కలకలం రేపారు. కొవిడ్ ఉధృతిని, దేశవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూలతను ఆయన అధిగమించారని, ముఖ్యంగా అతివాద శ్వేతజాతీయతావాదం ఆయనకు కలిసొచ్చిందని విశ్లేషణలు వచ్చాయి. ఫ్లోరిడా, టెక్స్సల్లో ఆయన లాటినోల (లాటిన్ అమెరికా నుంచి వచ్చి సెటిలైనవారు) మద్దతు సాధించడం విశేషం. రిపబ్లికన్లను సంతోషంలో ముంచెత్తిన ఫలితాలివి. వీటితో పాటు అలబామా, ఆర్కాన్సస్, కెంటకీ, లూసియానా, మిసిసిపీ, నెబ్రాస్కా, నార్త్ డకోటా, సౌత్ డకోటా, టెన్నెస్సీ, ఓక్లహామా, వెస్ట్ వర్జీనియా, ఇండియానా, వ్యోమింగ్, సౌత్ కరోలినాల్లో ట్రంప్ గెలుపొందారు. అయితే ఇవన్నీ తక్కువ ఎలక్టోరల్ ఓటర్లున్నవి.
ఇదో పెద్ద ఫ్రాడ్: ట్రంప్
ప్రత్యర్థి కంటే వెనుకంజలో ఉన్న సమయంలోనే ట్రంప్- ఈ ఎన్నికల్లో తానే విజేతనని ప్రకటించేసుకున్నారు. కౌంటింగ్ సాగుతున్న సమయంలో….. అమెరికా కాలమానం ప్రకారం- తెల్లవారుఝామున 2 గంటలకు ఆయన వైట్హౌస్ తూర్పు వైపు రూమ్నుంచి తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు.
’’చాలా రాష్ట్రాల్లో మనం ముందంజలో ఉన్నాం. నిజానికి ఇప్పటికే విజయం సాధించేశాం. ఈ ఎన్నికలు ఓ రకంగా దేశ ప్రజలపై ఓ ఫ్రాడ్. కౌంటింగ్ను వెంటనే నిలిపేయాలి. ఇది మనకు ఓ ఇబ్బందికర పరిస్థితి. పోలింగ్ ముగిశాక పోస్టల్ బ్యాలెట్లను అనుమతించడమేంటి..? నాలుగు గంటల తరువాత వచ్చిన ఏ బ్యాలెట్నూ స్వీకరించకూడదు… లెక్కించకూడదు. దేశ ప్రయోజనం కోసం నిజాయితీగా వ్యవహరించాలి. చట్టాన్ని సరైన రీతిలో అమలు పరచాలి. లేదంటే దీనిపై సుప్రీంకోర్టుకెక్కుతాం. ఈ అంశాన్ని సవాలు చేస్తాం’’ అని ఆయన ప్రకటించారు. ’ఇది దేశానికి ఓ దుర్దినం. నాకు లక్షల మంది అమెరికన్లు ఓటేశారు. కానీ కొద్దిమంది ఆ ఓటును నిర్వీర్యం చేసే యత్నం చేస్తున్నారు. మేం దీన్ని అడ్డుకుంటాం. మేం గెలవం అనుకున్న రాష్ట్రాల్లో కూడా గెలిచాం. ఫ్లోరిడా, ఒహాయో, టెక్సస్ ఇప్పటికే మా వశమయ్యాయి. అలాగే జార్జియా, నార్త్ కరోలినాల్లోని చాలా కౌంటీల్లో జయభేరి మోగించాం. పెన్సిల్వేనియాలో సైతం ఇప్పటికే మాకు 6,90,000 ఓట్లు పడ్డాయి. 64 శాతం ఓట్లు వచ్చేసినందున అక్కడా గెలవబోతున్నాం. ఇక మిషిగన్లో 3లక్షల ఓట్లు పడ్డాయి. అంటే 65 శాతం. అదీ మాదే. మిగిలిన విస్కాన్సన్లోనూ విజయం సాధిస్తున్నాం. మొత్తం మీద ఇంతటి భారీ ఆధిక్యం, ప్రజల మద్దతు మాకు లభించిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. భారీ సెలబ్రేషన్స్కు సిద్ధంగా ఉండండి’’ అని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ ప్రస్తావించిన అనేక రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో పోస్టల్, పోలింగ్ రోజు ఓట్లు లెక్కించాల్సి ఉంది. అదే అంతిమం కాదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. సుప్రీంకోర్టుకెక్కుతామన్న ఆయన మాటలు ఆయనలోని భయాలను సూచిస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాల్లో కోర్టు వ్యాజ్యాలు తప్పవని ట్రంప్ శిబిరం బుధవారం రాత్రి ప్రకటించింది. ఇందుకోసం భారీ ఎత్తున నిధుల సేకరణ కూడా మొదలుపెట్టింది.
కౌంటింగ్ మరికొన్ని రోజుల పాటు..: బైడెన్
ట్రంప్ సుప్రీంకెళతానన్న మాటలు విన్న జో బైడెన్ శిబిరం తమ న్యాయవాదులు కూడా సిద్ధంగా ఉన్నారని ప్రకటించింది. ’కౌంటింగ్ నిలిపేయాలన్న ట్రంప్ వ్యాఖ్యలు మున్నెన్నడూ ఏ అధ్యక్షుడూ చేయనివని, దారుణమని, అసత్యమని’ బైడెన్ తరఫు ప్రచార మేనేజర్ జెన్ ఒమేలీ డిలాన్ అన్నారు. అయితే తాను విజయపథంలో పయనిస్తున్నట్లు బైడెన్ కూడా ప్రకటించారు. ’ఓపిక పట్టండి. వేచి చూడండి. ఇది చాలా రోజులు పట్టవచ్చు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు చాలా సమయం పడుతుంది. ప్రతీ ఓటూ ముఖ్యమే. ప్రతీదీ లెక్కించాలి. ప్రస్తుతం మన స్థితి చాలా బాగుంది. ఇంకా మెరుగవుతుంది. మన విజయం ఖాయం’’ అని ఆయన పేర్కొన్నారు. ’అరిజోనాలో గెలుస్తున్నాం. జార్జియాలో ఇప్పటికీ రేసులోనే ఉన్నాం. ఇక విస్కాన్సిన్, పెన్సిల్వేనియాల్లో మన పరిస్థితి బాగుంది’ అన్నారాయన. ట్రంప్ విజయాన్ని ప్రకటించుకోవడాన్ని ఆక్షేపిస్తూ- ఎవరు గెలిచారో నేను గానీ ట్రంప్ గానీ చెప్పలేం. అది అమెరికన్ ప్రజలు చెప్పాలి’ అని కౌంటర్ ఇచ్చారు.
స్వింగ్ ఎటు వైపు..?
విస్కాన్సిన్: విస్కాన్సిన్లో మొత్తం పడ్డ ఓట్లు సుమారు 30.2 లక్షలు. వీటిలో ముందస్తు ఓటింగ్లో (అంటే నవంబరు 3కు ముందు జరిగిన వ్యక్తిగత ఓటింగ్లో) ట్రంప్కు కాస్త ఆధిక్యం వచ్చింది. అయితే మిల్వాకీ సహా అనేక చోట్ల నుంచి వచ్చిన పోస్టల్ బ్యాలెట్లు, పోలింగ్ రోజు ఓట్లలో అత్యధికం బైడెన్కు వచ్చి ఆయన ట్రంప్ కంటే 8000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. ఇప్పటికీ గ్రీన్ బే సహా కొన్ని కౌంటీల ఓట్ల లెక్కింపు అనంతరం వాతావరణం బైడెన్కే అనుకూలమన్నది అన్ని మీడియా సంస్థల అంచనా.
పెన్సిల్వేనియా : దీర్ఘకాలంగా పెన్సిల్వేనియా బ్లూ వాల్లో ఉన్న రాష్ట్రం…అంటే డెమోక్రాట్ల కంచుకోట. అక్కడ ఇపుడు ట్రంప్కు 6.75 లక్షల ఓట్లు పడ్డాయి. ఇది విని ఆయన సంబరపడి- గెలిచేశానన్నారు. కానీ ఇంకా 14 లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇందులో పోస్టల్ బ్యాలెట్లన్నీ గుండగుత్తగా బైడెన్కు పడొచ్చని, ఆయన అతి స్వల్ప తేడాతోనైనా నెగ్గవచ్చనేది విశ్లేషకుల అంచనా. పెన్సిల్వేనియా ఓ రకంగా బైడెన్కు స్వరాష్ట్రం. దీని పక్కనే ఉన్న డెలావర్లో ఆయన నివాసముంటున్నారు. అక్కడి నుంచే చాలా సార్లు సెనెట్కు ఎన్నికయ్యారు. ఎవరు గెలిచినా మెజారిటీ అతి స్వల్పం కావొచ్చు.
మిషిగన్: మిషిగన్లో పడ్డ మొత్తం ఓట్లు 50.26 లక్షలు. ఇందులో ఇప్పటిదాకా 79 శాతం ఓట్లే లెక్కించారు. ప్రారంభంలో ట్రంప్ 2.26 లక్షల ఓట్లతో ముందంజలో ఉన్నారు. కానీ ఇంకా పెద్ద ఎత్తున పోస్టల్ ఓట్లు లెక్కించాలి. ఇవన్నీ దాదాపుగా బైడెన్కే వెళ్లవచ్చు. ముఖ్యంగా వేన్ కౌంటీలో ఉన్న డెట్రాయిట్ ఎప్పటినుంచో డెమోక్రాట్ల కంచుకోట.
నార్త్ కరోలినా: ఇక నార్త్ కరోలినాలో ట్రంప్ తొలిరౌండ్లలోనే 76, 000 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. కానీ అక్కడ ఇంకా 2లక్షల పైచిలుకు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలి. వీటి ద్వారా బైడెన్ ఆయనను దాటేయవచ్చన్న అంచనాలున్నాయి.
జార్జియా : జార్జియాలో తనకు ఇప్పటికే 1.17 లక్షల ఓట్ల ఆధిక్యం ఉన్నదని ట్రంప్ చెప్పుకున్నా… ఆ సంఖ్యపై సందేహాలున్నాయి. ఇంకా 7 శాతం పోస్టల్ ఓట్లను గణించాల్సి ఉంది. అట్లాంటా పరిసరాల్లోని డికాబ్, ఛాతమ్ కౌంటీలు ఆదినుంచీ డెమోక్రాట్ల కంచుకోటలు తుది లెక్కింపులో బైడెన్కు ఆధిక్యం దక్కవచ్చు. ఇది మొత్తం ఫలితాన్ని తారుమారు చేయవచ్చంటున్నారు.
నెవడా: నెవడాలో 70 శాతం ఓట్లు లెక్కించి కౌంటింగ్ను తాత్కాలికంగా నిలిపేశారు. తిరిగి అమెరికా కాలమానం ప్రకారం గురువారం ఉదయం ఇది మొదలవుతుంది. కౌంటింగ్ ఆపే సమయానికి జో బైడెన్ 49.2 శాతం ఓట్లు సాధించగా, ట్రంప్ అతి సమీపంలో 48.6 శాతం ఓట్లు కైవసం చేసుకున్నారు. ఇంకా గణించాల్సిన వాటిలో పోస్టల్ బ్యాలెట్లే ఎక్కువ.
సుప్రీం పోరాటం అనివార్యం!
రేసు చాలా తీవ్రంగా, నువ్వా నేనా అన్నట్లుండడంతో మేజిక్ ఫిగర్ 270 ఎవరు సాధిస్తారన్నది పెద్ద ప్రశ్న. ఎవరు సాధించినా తేడా స్వల్పంగానే ఉండొచ్చు. ఒకవేళ 270కి అటూ ఇటూగా ఎవరికి వచ్చినా వారు ఖచ్చితంగా సుప్రీంకోర్టుకెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ సుప్రీంలో కేసులు పడితే ఎవరికి అనుకూలం..? ఏం జరుగుతుంది..?
- సుప్రీంకోర్టులో కన్సర్వేటివ్లకు అంటే రిపబ్లికన్లకు 6-3 మెజారిటీ ఉంది. ఈ మధ్యే ట్రంప్ తనకు అనుకూలమైన యామీ బారెట్ను జడ్జిగా నియమించారు కూడా! ఇది వారికి కొంతవరకూ సానుకూలమే అయినా రాజ్యాంగాన్ని కాదని, చట్టాలను ఉల్లంఘించి కోర్టు కూడా తీర్పులు చెప్పదు. పరిస్థితి ఎటూ తేలకపోతే 2000వ సంవత్సరంలో ఫ్లోరిడాలో ఎదురైన స్థితి ఇపుడు కూడా రావొచ్చు. ఫ్లోరిడా హైకోర్టు కౌంటింగ్ను నిలిపేయాలని తీర్పిచ్చాక- రిపబ్లికన్ అభ్యర్థి జార్జి జూనియర్ బుష్ తన ప్రత్యర్థి అల్ గొరె మీద కేవలం 537 ఓట్లతో నెగ్గగలిగారు.
- సాధారణంగా ఓ రాష్ట్రంలో విజేతను అక్కడి గవర్నర్ సర్టిఫై చేసి కాంగ్రెస్కు తెలియపరుస్తారు. కానీ తేడా అతి స్వల్పమైనపుడు అక్కడి శాసనసభ కూడా విడిగా ఓ రిపోర్టు ఇచ్చే అవకాశం ఉంటుంది. పోటీ తీవ్రంగా ఉన్న విస్కాన్సన్, మిషిగన్, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియాల్లో గవర్నర్లు డెమోక్రాట్ పార్టీకి చెందినవారు. కానీ అక్కడి శాసనసభ మాత్రం రిపబ్లికన్ల చేతిలో ఉంది. అలాంటపుడు గవర్నర్లు డెమోక్రాట్స్కు అనుకూలంగా నివేదిక ఇస్తే అపుడు శాసనసభ కూడా విడిగా రిపోర్టు పంపడానికి చట్టం అనుమతిస్తుంది. ఆ సమయంలో కాంగ్రెస్- గవర్నర్ నివేదికను అనుమతిస్తుందా లేక ఆ రాష్ట్రపు మొత్తం ఓట్లను పరిగణించకుండా వదిలేస్తుందా అన్నది తేలాలి. ప్రస్తుతం ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు, సెనెట్లో రిపబ్లికన్లకు మెజారిటీ ఉంది. కొత్త కాంగ్రెస్ అంటే తాజాగా ఎన్నికైన సభ్యులతో కూడిన కాంగ్రెస్ జనవరి 3న ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఒకవేళ ఈ రెండు సభలూ ఈ విషయంలో విభేదిస్తే ఏం చేయాలన్నది కోర్టు తేల్చాలి. విశేషమేమంటే -1887లో చేసిన ఎలక్టోరల్ కౌంట్ ఏక్ట్ (ఈసీఏ)లో కూడా దీనికి సంబంధించిన నిర్దిష్టమైన పరిష్కారం లేదు.
- మరో అంశమేంటంటే … అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అక్కడి సెనెట్ అధ్యకుడు కూడా! (మన దగ్గర రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతి ఉన్నట్లు). ఎలక్టోరల్ ఓట్ల విషయంలో ఉభయసభలూ ఏకీభవించకపోతే ఆయన తన అధికారాలను ఉపయోగించి- సదరు రాష్ట్ర ఓట్లను పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించవచ్చు. అయితే అలాంటపుడు మేజిక్ ఫిగర్ 270 ఉండాలా లేక తగ్గించాలా అన్నది మాత్రం చట్టంలో లేదు. ఉదాహరణకు పెన్సిల్వేనియాలో 20 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. వీటిని గనక చెల్లనివిగా ప్రకటిస్తే మొత్తం ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 518కి తగ్గుతాయి. అలాటపుడు 260ని మేజిక్ ఫిగర్గా తీసుకోవాలి. దీన్ని కూడా కోర్టు తేల్చాలి.
ఎవరు గెలిస్తే భారత్కు లాభం?
నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలి స్తే భారత్కు లాభం? ఇద్దరు అధ్యక్షుల వ్యవహార శైలి, అభిప్రాయాలను బేరీజు వేస్తే ట్రంప్ గెలిస్తేనే కొన్ని అంశాల్లో భారత్కు ఎక్కువ లాభమని రాజకీయ, విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. ట్రంప్ చైనాకు బద్ధ వ్యతిరేకి. బైడెన్కు అలాంటి తీవ్ర వ్యతిరేకత ఏమీ లేదు.
ట్రంప్ ఓడిపోతే చైనా విస్తరణవాద కాంక్షకు వ్యతిరేకంగా భారత్ పోరాటానికి అగ్రరాజ్యం మద్ద తు ప్రస్తుత స్థాయిలో ఉండదు. అలాగే.. పాకిస్థాన్ పట్ల ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. బైడెన్ మాత్రం పాక్ పట్ల ఉదారంగా ఉంటారు. పాక్కు ఆర్థిక సాయం అందించే ప్రతిపాదన చేసినందునే 2008లో ఆ దేశం బైడెన్ను ‘హిలాల్-ఎ-పాకిస్థాన్’ పురస్కారంతో గౌరవించింది. అంతేకాదు.. జమ్మూకశ్మీర్, పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరపట్టిక వంటి అంశాలపై బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే పాక్.. బైడెన్ గెలుపును కోరుకుంటోంది. ట్రంప్ మళ్లీ గెలిస్తే పాక్ పట్ల మరింత వ్యతిరేకతతో ప్రవర్తించవచ్చని, బైడెన్ గెలిస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని వారు విశ్లేషిస్తున్నారు. కాబట్టి, బైడెన్ గెలిస్తే భారత్-అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగవచ్చుగానీ.. ట్రంప్ హయాంలోలాగా బలంగా ఉండదు. అయితే.. బైడెన్ గెలిస్తే అమెరికాలో మనవాళ్ల ఉద్యోగాలకు ఢోకా ఉండదు. జాతీయవాద రాజ కీయాలు చేస్తున్న రిపబ్లికన్ పార్టీ అమెరికన్లకే ప్రాధాన్యమిస్తుంది. హెచ్1బీ వీసాలపై ట్రంప్ వ్యవహారశైలి ఇందుకు నిదర్శనం. ఉదారవాద విధానాలను అవలంభించే డెమోక్రాటిక్ పార్టీ గెలిస్తే మనవాళ్ల ఉద్యోగాలు సురక్షితమనే వాదన వినిపిస్తోంది.
Courtesy Andhrajyothi