- అత్యాచారాల ఆరోపణ వెనుక
- బ్లాక్మెయిలర్ హస్తం
- యువతి సర్టిఫికెట్లను దగ్గర పెట్టుకొని
- ఆమెకు డాలర్ భాయ్ బెదిరింపులు
- చెప్పినట్లు చేయాలని చిత్రహింసలు
- పోలీసు కేసు పెట్టడానికి
- 3 రోజుల ముందు నిందితులకు ఫోన్లు
- డబ్బులు అడిగినట్లు కాల్ రికార్డింగ్లు
- ‘139 మంది’ కేసులో రోజుకో ట్విస్ట్
హైదరాబాద్ సిటీ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘139 మంది చేతిలో అత్యాచారానికి గురైన బాధితురాలు’ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. ఈ కేసులో సీసీఎస్ పోలీసులు ఓవైపు దర్యాప్తు ముమ్మరం చేయగా.. మరోవైపు డాలర్ భాయ్ అనే వ్యక్తి మాట్లాడిన ఆడియోలు వైరల్ అయ్యాయి. దీంతో అతడు ఎవరన్న కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని తన చెరలో ఉంచుకుని ఏదైనా డ్రామా ఆడాడా.. అని అనుమానిస్తున్నారు. యువతి ఫిర్యాదు చేయడానికి సహకరించిన సోమాజిగూడలోని గాడ్పవర్ అనే స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో పోలీసులు ఆదివారం సోదాలు జరిపారు. ఇందులో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాన్ని సీజ్ చేశారు. అయితే డాలర్ భాయ్కి సంబంధించిన వివరాలు మాత్రం లభించలేదు. ఈ పేరు గురించి స్పష్టమైన సమాచారం లేకపోయినా.. అతని పూర్తి పేరు రాజా శ్రీకర్రెడ్డి అని తెలుస్తోంది. ఇటీవల అతనిపై అతని భార్య కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అతనిపై నగరంలోనే కాకుండా ఇతర జిల్లాల్లోనూ బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్ కేసులు ఉన్నాయి. కాగా, ఉద్యోగం కోసం నగరానికి వచ్చిన యువతిని ట్రాప్ చేసి, ఆమె విద్యార్హత పత్రాలను తన వద్ద ఉంచుకుని బ్లాక్మెయిలింగ్కు పాల్పడినట్లు సమాచారం. ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తూ డబ్బు, బంగారం తీసుకుని రావాలంటూ చిత్రహింసలకు గురి చేసినట్లు తెలిసింది. కన్సల్టెన్సీ, యాడ్ ఏజెన్సీల పేరుతో మరికొందరు మహిళలకూ ఉద్యోగాల ఆశ చూపి, వారి సర్టిఫికెట్లను తన వద్ద పెట్టుకొని బ్లాక్ మెయిల్కు పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సర్టిఫికెట్ల ఆధారంగా యువతుల గురించి ఆరా తీస్తున్నారు. వారి వాంగ్మూలాలు సేకరిస్తే డాలర్భాయ్ అరాచకాలు మరిన్ని వెలుగుచూసే అవకాశముంది. అతని కార్యాలయంలో కొన్ని ఆడియో టేపులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అతణ్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
ఫిర్యాదుకు ముందు నిందితులకు ఫోన్లు
అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్నవారికి బాధితురాలి ఫిర్యాదుకు ముందే డాలర్భాయ్ ఫోన్లు చేసి బెదిరించినట్లు ఆడియో రికార్డింగ్లు బయటపడ్డాయి. వారి నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేశాడు. ఇందులో నిందితులుగా ఉన్నవారు.. తాము బాధితులమని, ఫిర్యాదుకు మూడు రోజుల ముందు తమను డబ్బులు డిమాండ్ చేశారంటూ కాల్ రికార్డులను వైరల్ చేశారు. వీరిలో కొందరు.. సీసీఎస్ పోలీసుల ముందు వివరణ ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా.. మరి కొందరు జిల్లాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బాధితురాలిని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందాలనే ప్రయత్నాలు జరిగాయా అన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. ఫిర్యాదు తరువాత కూడా బాధితురాలు అనుమానిత వ్యక్తి ఆధీనంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కాల్ రికార్డింగ్లు వెల్లడయ్యాక అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని చెర నుంచి యువతి బయటపడటంతో కులసంఘం పెద్దలు ఆమెను తన తల్లి వద్దకు చేర్చారు. మరోవైపు డాలర్భాయ్ అరాచకాల గురించి వస్తున్న వరుస కథనాలపై తెలంగాణ యూత్ ఫోర్స్ స్పందించింది. యువతుల జీవితాలతో ఆటలాడుతూ బ్లాక్ మెయిల్ రాకెట్ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ అరుణ్కుమార్ కోరారు. ఈ విషయంపై ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.
Courtesy Andhrajyothi