కరోనా.. కరోనా.. కరోనా.. అంతటా ఇదే చర్చ! ప్రతి ఒక్కరిలోనూ ఇదే భయం! కరోనా కారణంగా తెలంగాణలోనూ చాలామంది ఇల్లు కదలడం లేదు! దాంతో, రోడ్లపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గింది! మెట్రో రైళ్లలో 15 శాతం ప్రయాణికులు తగ్గితే.. బస్సులు, రైళ్లు, విమానాల్లోనూ ప్రయాణికుల సంఖ్య తగ్గింది. ఎప్పుడూ బస్సులు, ప్రయాణికులతో కిక్కిరిసిపోయే ఎంజీబీఎస్ బస్ స్టేషన్ కూడా నిర్మానుష్యంగా కనిపించడం కరోనా ప్రభావానికి నిలువెత్తు నిదర్శనం. ఇక, నిత్యం జనంతో కిక్కిరిసి ఉండే ఐటీ కారిడార్ అయితే వెలవెలబోతోంది. ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థపైనా పడుతోంది. ఎగుమతులు, దిగుమతులు పడిపోయాయి. రాష్ట్రంలోనే కాదు.. అంతర్జాతీయంగానూ ఇదే పరిస్థితి. ప్రపంచ కుబేరుల ఆదాయాలను కూడా కరోనా కుంగదీస్తోంది.
పుణె వైరాలజీ ల్యాబ్ నిర్ధారణ.. ఊపిరి పీల్చుకున్న సర్కారు, వైద్యులు
రాష్ట్రంలో ఇప్పుడు ఒక్కరికే కరోనా.. స్థానికంగా ఎవరికీ వైరస్ సోకలేదు
88 మందిలో 45 మందికి నెగెటివ్..
మిగిలిన 43 మంది హోం ఐసొలేషన్
తాజాగా 22 మందికి వైరస్ పరీక్షలు.. యువకుడి కుటుంబమంతా నెగెటివ్
అయినా ప్రభుత్వం విశ్రమించదు.. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు: ఈటల
వదంతులపై కఠిన చర్యలు.. ఐటీ కంపెనీ ప్రతినిధుల సమావేశంలో సజ్జనార్
ఫీవర్కు వెళ్లమంటున్న గాంధీ వైద్యులు.. ఎక్కడా సిద్ధం కాని ఐసొలేషన్ వార్డులు
ప్రైవేటులో ఫీజులపై నియంత్రణ.. నిర్ణయించిన ధరలకే చికిత్సకు సర్కారు ఆదేశం
రైల్వే, బస్ స్టేషన్లలోనూ స్ర్కీనింగ్.. కరోనాపై సర్కారుకు హైకోర్టు సూచన
రోడ్లు, బస్సులు, రైళ్లు ఖాళీ.. నిర్మానుష్యంగా కనిపిస్తున్న ఐటీ కారిడార్
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ : తెలంగాణకు భారీ ఊరట! రాష్ట్రం నుంచి పంపించిన రెండు కరోనా వైరస్ నమూనాల ఫలితాలు నెగెటివ్ వచ్చాయి. ఆ రెండు శాంపిల్స్లో కరోనా వైరస్ లేదని పుణె వైరాలజీ ల్యాబ్ గురువారం నివేదిక ఇచ్చింది. దాంతో, ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగంతోపాటు ప్రజల్లో నెలకొన్న ఉత్కంఠ వీడింది. తొలుత, 24 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అతడు చికిత్స పొందిన ఆస్పత్రిలో శానిటేషన్ విధులు నిర్వహించిన 36 ఏళ్ల మహిళకు కరోనా లక్షణాలు కనిపించాయి. ఆమె నమూనాల్లో తీవ్ర వైరల్ లోడ్ ఉన్నట్లు కేంద్రం బుధవారం ప్రకటించింది.
అలాగే, ఇటలీ నుంచి వచ్చిన 30 ఏళ్ల ఐటీ మహిళా ఉద్యోగికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తీవ్ర ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆమె శాంపిల్స్లో కూడా వైరల్ లోడ్ ఎక్కువగా ఉంది. కానీ, వాటిలో కూడా గురువారం నెగెటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో, తెలంగాణలో కేవలం ఒక్కటి మాత్రమే పాజిటివ్ కేసుగా ఉంది. కాగా, గాంధీ ఆస్పత్రిలోనే గురువారం మరో 22 మందికి కరోనా లక్షణాలు కనిపించాయి. దాంతో, వారికి పరీక్షలు నిర్వహించారు. ఫీవర్ ఆస్పత్రిలో కూడా 3 అనుమానిత కేసులు నమోదయ్యాయి.
ప్రభుత్వం విశ్రమించదని, కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని మంత్రి ఈటల ప్రకటించారు. అన్ని బోధనాస్పత్రుల్లో ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తామని, అవి సరిపోకపోతే, 40 వేల డబుల్ ఇళ్లను వినియోగిస్తామని తెలిపారు. కరోనాపై వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
స్థానికంగా ఎవరికీ సోకలేదు
దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు తొలిగా గుర్తించిన విషయం తెలిసిందే. అతను పలు ప్రాంతాల్లో తిరగడంతో వైరస్ మరింతమందికి సోకిందేమోననే ఆందోళన పెరిగింది. మొత్తంమీద 88 మందితో అతను కాంటాక్టు అయినట్లు గుర్తించిన విషయం తెలిసిందే. వీరిలో 43 మందికి ఎటువంటి లక్షణాలూ లేవు. దాంతో, వారిని హోం ఐసొలేషన్లో ఉంచారు. మిగిలిన 45 మందిలో కరోనా లక్షణాలు గుర్తించారు. వారి శాంపిల్స్ను పరీక్షలకు పంపించారు.
వారిలో ఆ యువకుడి కుటుంబ సభ్యులు నలుగురికీ నెగెటివ్ వచ్చింది. అతడు ప్రయాణించినబస్సు డ్రైవర్, క్లీనర్, ఇతర ప్రయాణికులకు కూడా నెగెటివే వచ్చింది. ప్రధానంగా, సికింద్రాబాద్లోని ఆస్పత్రిలో అతనికి చికిత్స అందించిన వైద్యుడు, ఇతర సిబ్బందికి కూడా కరోనా సోకలేదు. వారితోపాటు ఆ ఆస్పత్రిలో 50 మందిని పరీక్షించినా.. ఎవరికీ కరోనా పాజిటివ్ రాలేదు. దాంతో, కరోనా స్థానికంగా ఎవరికీ సోకలేదన్న నిర్ధారణకు ప్రభుత్వం వచ్చింది.
నిజానికి, కరోనా సోకితే 2 నుంచి 11 రోజుల మధ్య కానీ దాని లక్షణాలు బయటపడవు. వీరంతా ఆ యువకుడిని కలిసి వారం, పది రోజులైంది. దాంతో, వారంతా సురక్షితమేనన్న నిర్ధారణకు వైద్యులు వచ్చారు. ఇటలీ నుంచి వచ్చిన పర్యాటకులకు డ్రైవర్గా ఉన్న వ్యక్తికి ఢిల్లీలో కరోనా సోకిన విషయం తెలిసిందే. అదృష్టవశాత్తు మన దగ్గర సెకండ్ కాంటాక్టు నుంచి కరోనా వైరస్ ఎవరికీ సోకలేదు.
ఎక్కడికి వెళ్లాలి!?
విదేశాల నుంచి వస్తున్న వారిలో కొందరికి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. దాంతో, వారు పరీక్షలు చేయించుకోవాలని భావిస్తున్నారు. అక్కడి నుంచే గాంధీ ఆస్పత్రికి ఫోన్ చేస్తున్నారు. దాంతో, ఇక్కడ మంచాలు ఖాళీ లేవని డాక్టర్లు చెబుతున్నారు. ఫీవర్ ఆస్పత్రికి వెళ్లాలని చెబుతున్నారు. అయితే, ఫీవర్ ఆస్పత్రిలోనూ ఇంకా పూర్తిస్థాయిలో పడకలు అందుబాటులోకి రాలేదు.
అదే సమయంలో, ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కరోనా ఐసొలేషన్ వార్డులు ఇంకా అందుబాటులోకి రాలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు ఆస్పత్రులను ఎంపిక చేస్తే.. రెండు ఆస్పత్రుల్లో ప్రాథమిక ఏర్పాట్లు జరిగాయి. కానీ, పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కామినేనిలో మాత్రం నామ్కే వాస్తేగా ఐసొలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. దాంతో, గాంధీకి వెళ్లాలా? ఫీవర్ ఆస్పత్రికి వెళ్లాలా? లేక, ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలో తెలియక విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు అయోమయంలో పడుతున్నారు. ఇక, ఆస్పత్రిలో రోగులు భయపడుతున్నారని, కరోనా ఐసొలేషన్ వార్డులను గాంధీ నుంచి మరోచోటికి తరలించాలంటూ ప్రభుత్వ జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ లోహిత విజ్ఞప్తి చేశారు.
అంతటా హడావుడి..
పేట్బషీరాబాద్, ఖమ్మం: కరోనా వైరస్ పలు చోట్ల అలజడి రేపుతోంది. ఇటలీ నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కు కరోనా సోకిందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దాంతో, ఆమె బస చేసిన హోటళ్లలో ఆమెకు సేవలందించిన సిబ్బంది నమూనాలను పరీక్షలకు పంపారు. ఇక, జర్మనీ నుంచి ఖమ్మం వచ్చిన ఓ మహిళ ఎందుకైనా మంచిదని పరీక్షలు చేయించుకోవాలని భావించారు. ఓ ప్రైవేటు వైద్యుడిని సంప్రదించారు. కరోనా పరీక్షలు ఎక్కడ చేస్తారని ఆయన జిల్లా అధికారులను అడగడంతో అంతా అప్రమత్తమయ్యారు. ఆమెకు ఎటువంటి లక్షణాలూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Courtesy Andhrajyothi