కుట్ర అన్నింటిలోనూ వుంటుంది, కులం అనే కుట్ర తినే కూడునీ వదిలిపెట్టదు. అది పసిపిల్లల మెదళ్లనీ, శరీరాలనీ ఎలా కునారిల్లింపజేస్తుందో చూద్దాం!
అక్షయపాత్ర. అది ప్రపంచానికి వైష్ణవమతాన్ని ప్రచారం చేయడంకోసం ఉద్దేశించిన ఒక మతసంస్థకు అనుబంధ సంస్థ. ఇండియాలో ముఖ్యంగా అమెరికాలో కళ్లుచెదిరే భవనాలు, సుఖభోగాలతో, నేతివంటలతో పెరిగిన ప్రచారకులతో ఈ సంస్థ ఎలా స్థాపించడమైనది, దీనివెనక కనిపించని అంతర్జాతీయ అదృశ్య శక్తులు ఇప్పుడు అనవసరం గానీ, కనిపించే స్థాపకుడు, నడిపించే భావజాలాలు మాత్రం అవసరం. ఈ అక్షయపాత్ర స్కూలుపిల్లలకు మధ్యాహ్న భోజనం అందించడానికి ప్రభుత్వం నుండి డబ్బు తీసుకుని కాంట్రాక్టు తీసుకుంటూనే, దీన్ని ప్రచారంలో మరోరకంగా చూపుకుంటూ అనాధాలకు ఆహారం అందించే పేరుతో చందాలు వసూలు చేయడం, సినిమాకొక కొత్త మారణాయుధాన్ని సమాజానికి అందించి, అదనుదొరికినప్పుడల్లా బానిసభావజాలం జనాల మెదళ్లలో కూరే రాజమౌళి లాంటి సినిమావాళ్లు ఈ సంస్థతరపున చేసే ప్రచారాదుల్ని, మీరు అదేసంస్థ వెబ్-సైట్లో సైటేసుకోవచ్చు.
ఈ సంస్థ రాష్ట్రాలలో ముఖ్యంగా కేంద్రంలో తమ మత ప్రభుత్వం అండగా వున్నందున, ఇతర పోటీ సంస్థల్ని అవతలికి నెట్టి కాంట్రాక్టు చేజిక్కించుకోవడమూ గమనించాలి. అసలు పిల్లలకు ఆహారం అందించడం ప్రధమ కర్తవ్యంగా ఏర్పడిన పధకం, అక్షపాత్ర రాకతో తాననుకున్న ఆహారపద్దతుల్లో మత భావాల్ని అమలుపరచడమే పరమోద్దేశంగా ఎలా తయారైందో గమనిస్తే-
ఒక పెద్ద సంస్థగా, అక్షయపాత్ర అంతకుముందున్న అనేకమంది వంటపనిచేసుకుని బ్రతుకులీడుస్తోన్న చిన్నాచితక పనివారి పొట్టకొట్టి ఈ కాంట్రాక్టు దక్కించుకుందని ముందు గుర్తించాలి. దానికి అర్థదశాబ్దం పైగా వివిధరాష్ట్రాలలో ముఖ్యంగా కేంద్రంలో తమ మత ప్రభుత్వం అండగా వున్నందున, ఇతర పోటీ సంస్థల్ని అవతలికి నెట్టి కాంట్రాక్టు చేజిక్కిచుకోవడమూ గమనించాలి. అసలు పిల్లలకు ఆహారం అందించడం ప్రధమ కర్తవ్యంగా ఏర్పడిన పధకం, అక్ష్యపాత్ర రాకతో తాననుకున్న ఆహారపద్దతుల్లో మత భావాల్ని అమలుపరచడమే పరమోద్దేశంగా ఎలా తయారైందో గమనిస్తే-
అక్షయపాత్ర ఒక హిందూ మతసంస్థగా, అగ్రకుల తిండిపద్దతుల్ని అమలుపరచాలని నిర్ణయించింది. దానికి వారు పెట్టుకున్న పేరు సాత్వికాహారం అందజేయడం. దానికి అదనపు హంగు శుచి, శుభ్రత అనే పదాలు. తిండి పరమోద్దేశం ఆకలితీర్చడం, శక్తినివ్వడం, వికాసం కలగజేయడం. కానీ ఇవి ఇక్కడ చెల్లవు. ఎందుకంటే మాంసపదార్థాలు, గుడ్డుతో సహా తామస పదార్థాలట! తమ నమ్మకాలలొంచి వెనక్కి తగ్గేదిలేదట! ఈ విషయంలో పతాకస్థాయి ఏమంటే తామసాన్ని కలుగజేస్తాయి కాబట్టి ఉల్లి, వెల్లుల్లి కూడా నిషిద్ధం వండిన వంటలో. అంటే ఉప్పు, కారం తక్కువైన చప్పిడిమెతుకుల చప్పన్నం అందించడం. పస్తులైనా వుంటాంకానీ ఈ తిండితినలేమనే పిల్లలు, ఆకలికి ఆగలేక పళ్లెంలో అన్నం వేయించుకున్నా తినలేక దాన్ని కాలువల్లో పారబోసే పిల్లలు, కారియర్లో సద్దిదైనా బొద్దిదైనా ఫర్లేదని, ఇంటినుండి ఆహారం తెచ్చుకునే పిల్లల్లలతో… పొరుగునున్న కర్ణాటకలో అలజడి మొదలైంది.
2814 పాఠశాలలకు చెందిన 4.43 లక్షల బడిపిల్లలకు ఆహారం అందించే కాంట్రాక్టు దక్కించుకున్న అక్షయపాత్ర సంస్థ మీద ఉద్యమిస్తోన్న బడిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు జన్ స్వాస్థ్ అభియాన్, రైట్ టు ఫుడ్ కాంపెయిన్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ అహ్మదాబాద్ మరియు బెంగళురు, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, పీపుల్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వంటి 10 కి పైగా సంస్థలు 94మంది వివిధరంగాల నిపుణులు స్కూలుపిల్లలకు, వారి తల్లిదండ్రులకు మద్దతుగా నిలబడ్డారు. స్టేట్ ఫుడ్ కమీషన్, కేంద్ర ఆహార సంస్థ, సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వంటి ప్రభుత్వ సంస్థలు, గతంలో అధికారంలోవున్న బీజేపీ ప్రభుత్వపు అండతోనూ, పత్రికా, మీడియాలూ, అధికారగణంలోని అగ్రకులస్తులు ఎంతగా అలజడిని తొక్కిపెట్టినా ఆగకుండా ప్రస్తుతం ఆందోళన కొనసాగుతోంది.
కేవలం మూఢనమ్మకాల కారణంగా సమతులమైన పోషకవిలువలు గల ఆహారాన్ని పిల్లలకు నిరాకరించడం మీద, ఒక్క మాటలో చెప్పాలంటే పసిపిల్లల కడుపునిండా తిండికి దూరం చేయడమ్మీద అక్కడ నిరసనలు వెల్లువెత్తుతోంటే ఇక్కడ కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం, కొలువుదీరిన మర్నాడే అదే సంస్థకు అదనపు నిధుల్ని చేతిలో పోస్తూ నిర్ణయాలు తీసుకొంటున్న తరుణంలో ఈ విషయాల్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. పిల్లలకు తామందించే తిండి తినేటప్పుడు తమ మత ప్రార్థన చేయించడం మీద ఇతర మతాల నిరసనల్ని వెంటనే పరిగణనలోకి తీసుకోవాలి. అన్నిటికన్నా ఉపాధీవకాశాలు విస్తరించాలని ప్రయత్నించే ప్రభుత్వాలు ఇటువంటి స్థానిక విషయాల్ని ఇలాంటి బడా సంస్థలకు గాకుండా అయా ప్రాంతాల వారికి అప్పజెప్పడంవల్ల అటు స్థానిక రుచికర ఆహారం, ఇటు ఉద్యోగ కల్పన రెండూ ఒనగూడుతాయని గ్రహించాలి.
పొలాల్లో సత్తుగిన్నెలోని సద్దిలోని బువ్వకు తోడు కారంపొడిలేకుంటే పక్కనే పండిన ఉల్లిగడ్డనో, పచ్చిమిరపకాయనో తెంపుకుని, నంజుకుని కడుపునింపుకునే 90శాతం కూలి జనాలకి పుట్టిన పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారని, వారికి, శరీరకష్టమేకాదు, కనీసం మెదడుకూడా వాడకుండా పూజలు చేసుకుంటూ చల్లపొద్దులో కాలం వెళ్లబుచ్చేవారి తిండిని నిర్దేశనం ఏ రకంగానూ అక్కరకు రాదని గుర్తించాలి. చనిపోయిన దినాన కూడా పందిమాంసం తిన్న బుద్దుడికన్నా దయామయుడు భూమ్మీదలేరని, అన్ని జంతువుల్నీ తినే పాశ్చాత్యులు తమ తేలివితేటల్తో ప్రపంచాన్ని అన్ని రంగాల్లో శాశిస్తున్నారని గమనించాలి.
Sidhharthi Subhash Chandrabose