బీజేపీ ద్వంద వైఖరిపై కుంతియా విమర్శ
మహాత్మాగాంధీ విషయంలో బీజేపీ ద్వంద వైఖరిని ప్రదర్శిస్తున్నదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి రామచంద్రకుంతియా విమర్శించారు. ఒకవైపు గాంధీపై పొగడ్తలు గుమ్మరిస్తూనే…మరోవైపు గాంధీని హత్య చేసిన గాడ్సేకు గుడి కడుతున్నారని చెప్పారు. గురువారం గాంధీభవన్లో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గాంధీ గురించి బీజేపీ నేతలు మాట్లాడుతూనే…గాడ్సేకు గుడి కట్టి, వారిద్దరినీ ఒకే గాటున కడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ తమ ప్రచారం కోసం గాంధీ కండ్ల అద్ధాలను, ఆయన పేరును వాడుకుంటున్నదన్నారు. హుజూర్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి గెలుపు కోసం నాయకులందరూ ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని చెప్పారు. ముందస్తు ఎన్నికల్లో ప్రభుత్వం కావాలనే కోదాడలో కక్ష పూరితంగా ఓడించిందన్నారు. పార్లమెంటు ఎన్నికలలో టీఆర్ఎస్ ఏడు సీట్లు ఓడిపోయిందనీ, హుజూర్నగర్ ఎన్నికల్లో ఆపార్టీ భయపడుతున్నదనీ, అందుకే సీపీఐ మద్దతు కోరుతున్నదన్నారు.
సచివాలయంలోని మసీదులను ప్రారంభించండి : హోంమంత్రికి వినతి
సాధారణ ప్రార్థనల కోసం సచివాలయ ప్రాంగణంలోని మసీదులను తిరిగి ప్రారంభించాలని కాంగ్రెస్ కోరింది. ఏడు దశాబ్దాలకు పైగా ఆ మసీదుల్లో ప్రార్థనలు జరుగుతున్నాయనీ, సెప్టెంబర్ 30న వాటిని మూసివేసిందని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్లో హోంమంత్రి మహమూద్ అలీకి టీపీసీసీ మైనారిటీల విభాగం చైర్మెన్ షేక్ అబ్దుల్లా సోహైల్, అధికార ప్రతినిధి నిజాముద్ధీన్ వినతిపత్రం సమర్పించారు. ఈ చర్య మత హక్కును ఉల్లంఘించినట్టుగా ఉందన్నారు. మసీదులు, దేవాలయాలు కార్యాలయాలు కావనీ, వెంటనే ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
Courtesy Nava telangana…