520 మంది కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి
హైదరాబాద్: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ జైలు జీవితం గడుపుతున్న ప్రముఖ కవి వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాల విడుదలకు అత్యవసర జోక్యం చేసుకోవాలని తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కవులు, రచయితలు, కళాకారులు మహారాష్ట్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. జయధీర్ తిరుమలరావు, అల్లం నారాయణ, నందిని సిధారెడ్డి తదితర 520 మందితో కూడిన బృందం.. భారత ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్డే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్ దత్తాలకు లేఖలు రాశారు.
‘భీమా కోరేగావ్ కుట్ర కేసులో 22 నెలలుగా ముంబయి జైల్లో ఉన్న 80 ఏళ్ల వరవరరావు ఆరోగ్యం క్షీణిస్తున్న దశలో కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. తెలుగు సమాజంలోనే కాదు, దేశంలోనే ఆయన సుప్రసిద్ధ కవి. ఆయన రచనలు ఎన్నో దేశ, విదేశీ భాషల్లోకి అనువాదమయ్యాయి. అలాంటి వ్యక్తి సొంత పనులు చేసుకోలేని స్థితిలో ఉన్నా నిర్బంధంలో ఉంచడం అమానవీయం. కిక్కిరిసిన జైల్లో కొవిడ్ తీవ్రంగా వ్యాపిస్తున్నందున ఆయన్ని విడుదల చేయాలని పలుమార్లు విజ్ఞప్తులు, ఆందోళనలు చేసినా ప్రయోజనం లేకపోయింది.
మానవీయ దృష్టితో ఆలోచించినా ఆ వయసులో, అంతటి అనారోగ్యంలో ఆయనకు కుటుంబసభ్యుల తోడు అవసరం కాబట్టి వెంటనే విడుదల చేయాలి. అలాగే 90 శాతం అంగవైకల్యంతో, 19 రకాల ప్రాణాంతక వ్యాధులతో సతమతమవుతూ నాగ్పూర్ జైల్లో ఉన్న మరో కవి, ప్రొఫెసర్ సాయిబాబాను కూడా వెంటనే పెరోల్పై లేదా బెయిల్పై విడుదల చేయాలి’అని పేర్కొన్నారు.
Courtesy Eenadu