- ఎట్టకేలకు చర్యలు, పోస్టింగ్ వెయిటింగ్
- ఇంటర్ ఫలితాల గందరగోళమే కారణం
- కొత్త కార్యదర్శిగా ఉమర్ జలీల్
హైదరాబాద్: ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎ. అశోక్పై ప్రభుత్వం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పిదాలు, గందరగోళం బదిలీకి ప్రధాన కారణంగా తెలుస్తోంది. నూతన కార్యదర్శిగా ఉమర్ జలీల్ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అశోక్కు పోస్టింగ్ సైతం ఇవ్వలేదు. 2018-19 విద్యాసంవత్సరంలో ఇంటర్ ఫలితాల్లో గందరగోళం, తప్పిదాల ప్రభావం లక్షలాదిమంది విద్యార్థులపై పడింది. మనస్తాపంతో రాష్ట్రవ్యాప్తంగా 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి. ఫలితాల నిర్వహణ బాధ్యతను సాఫ్ట్వేర్ సంస్థ గ్లోబరీనాకు అప్పగించడంపై బోర్డు కార్యదర్శి అశోక్పై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. అర్హత, అనుభవంలేని ఈ సంస్థ మూల్యాంకనంలో, ఫలితాల వెల్లడిలో ఘోరంగా విఫలమయ్యిందనే ఆరోపణలు వచ్చాయి. ఇంటర్ ఫలితాల వెల్లడిలో గందరగోళంతో రాష్ట్రవ్యాప్తంగా అట్టుడికిపోవడంతో ప్రభుత్వం స్పందించింది. దీనిపై విచారణ జరిపేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. టెండర్ల నుంచి ఫలితాలు వెల్లడి దాకా జరిగిన అన్ని ఘటనలపై ఈ కమిటీ సమగ్ర విచారణ జరిపింది. ఫలితాల్లో జరిగిన పొరబాట్లలో, ఇంటర్ బోర్డులో జరిగిన తప్పులలో గ్లోబరీనాకు బాధ్యత ఉందని తేల్చింది.గ్లోబరీనా సంస్థకు సరైన అర్హతలు, అనుభవం లేవని కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో గతంలోనే ఫలితాల్లో జరిగిన తప్పిదాలకు ఇంటర్ బోర్డు కార్యదర్శిపై, గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకుంటారని భావించారు. కానీ, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో దీనిపై సైతం విమర్శలు వెల్లువెత్తాయి. కమిటీ నివేదికను ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని, బాధ్యులపట్ల ఉదాసీనతతో వ్యవహరించిందని విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ఆరోపించారు. అశోక్ బదిలీకి ఫలితాల్లో జరిగిన పొరబాట్లే కాకుండా ఇతర కారణాలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ కాలేజీలకు అఫిలియేషన్ విషయంలో అనేక అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. ఏటా నిబంధనలు పాటించని కాలేజీలకు సైతం అనుబంధ గుర్తింపు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ఫ్యాకల్టీ నియామకంలోనూ జరిగిన రాద్ధాంతం బదిలీకి ఒక కారణంగా కనిపిస్తోంది. దీనిపై కొంతమంది కోర్టులో కేసులు వేయడం, ఇంటర్బోర్డు తీరును కోర్టు తప్పుబట్టడంతో ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించినట్టు తెలిసింది. అశోక్ 2020 మార్చి చివరికి రిటైర్ కానున్నారు. వచ్చే ఏడాది మార్చిలో జరగాల్సిన ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణ పనులు ఇప్పటి నుంచే ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అశోక్ను తప్పించినట్లు సమాచారం. కాగా.. ఇంటర్బోర్డు కొత్త కార్యదర్శిగా నియమితులైన ఉమర్ జలీల్ ఇంతకు ముందు వికారాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో.. వికారాబాద్ అసెంబ్లీ స్థానం ఎన్నికపై కోర్టులో వ్యాజ్యం కొనసాగుతుండగానే.. అందుకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను ఆయన తెరిచారు. దాంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.
Courtesy Andhra Jyothy..