– నూతన రేట్ల ఒప్పందం చేసుకున్న సర్కారు
– పౌరసరఫరాల సంస్థ, జీసీసీ హమాలీల డిమాండ్లకు ఒకే
హైదరాబాద్ : హమాలీల పక్షానా వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ గత కొన్ని నెలలుగా చేసిన పోరాటం ఫలించింది. ఎట్టకేలకు సర్కారు దిగొచ్చింది. హమాలీల కష్టాలను కండ్లకు కట్టినట్టుగా పలు ఆంక్షల నడుమ వివిధ రూపాల్లో పోరాటాలను ముందుకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. పౌరసరఫరాల సంస్థ, గిరిజిన కార్పొరేషన్ పరిధిలోని హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, నూతన రేట్ల ఒప్పందం, ఇతర సౌకర్యాల కోసం ఉద్యమించిన వామపక్ష కార్మిక సంఘాల సంయుక్త ఉద్యమం సోమవారం కొలిక్కి వచ్చింది. పలు డిమాండ్లను వెంటనే అంగీకరించిన ప్రభుత్వం, ఒకట్రెండు డిమాండ్ల అమలుకు వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇవ్వడం హమాలీలకు నిజంగా శుభవార్తే. హమాలీ కార్మికుల ఎగుమతి, దిగుమతికి సంబంధించి నూతన రేట్లకు పెంపునకు సంబంధించి ప్రభుత్వంతో జరిపిన చర్చలు విజయవంతమైనట్టు తెలంగాణ పౌరసరఫరాల సంస్థ హమాలీ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) తెలిపింది. సోమవారం పౌరసరఫరాలభవన్లో పౌరసరఫరాల సంస్థ, కార్పొరేషన్ కమీషనర్ అనిల్ కుమార్, చైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డితో జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజ్, కార్యదర్శి పాలడుగు సుధాకర్ తదితర నాయకులు చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా నాయకులు హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యలను, ముఖ్యంగా కరోనా సమయంలో ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించడంలో వారు పోషించిన కీలకమైన పాత్ర, నూతన రేట్ల పెంపు జాప్యం వల్ల హమాలీల ఆర్థిక ఇబ్బందులను నాయకులు అధికారులకు విడమర్చి చెప్పారు. హమాలీ కార్మికుల పక్షాన గతంలో పలు ఉద్యమాలు చేసిన జేఏసీ నాయకులు చేసిన వాదనతో వాదన నేపథ్యంలో డిమాండ్ల పరిష్కారానికి వాదన నేపథ్యంలో డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 2021 జనవరి నుంచి వర్తించేలా నూతన రేట్లను వర్తింపజేస్తూ ప్రజా ఉద్యమానికి ప్రభుత్వం దిగివచ్చింది. ప్రస్తుతం ఉన్న రూ.18 నుంచి రూ.23కు పెంచుతూ జేఏసీ నాయకులతో నూతన ఒప్పందం కుదుర్చుకుంది. అదే సమయంలో మహిళా స్వీపర్లకు గోదాముల సామర్థ్యాన్ని బట్టి రూ.4000, రూ.4,500, రూ.5000లుగా పెంచారు. ప్రస్తుతం హమాలీ కార్మికులకే ఇస్తున్న బోనస్, యూనిఫాం ఇతర సౌకర్యాలన్ని మహిళా స్వీపర్లకు కల్పించేందుకు అంగీకరించింది. దసరా పండుగ సందర్భంగా ఇచ్చే స్వీట్ బాక్స్ రూ.700 కేటాయించేందుకు ఒప్పుకుంది. ప్రభుత్వ గోదాములలో మౌలిక సదుపాయాలను కల్పనకు, హామాలీలకు రిటైర్ మెంట్ బెనిఫిట్లు, పెన్షన్ సౌకర్యం ఇస్తామనీ, పెరిగిన రేట్లను గిరిజన కార్పొరేషన్ గోదాములలో పని చేస్తున్న హమాలీ కార్మికులకు యధావిధిగా అందే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఇఎస్ఐ అమలుకు తక్షణమే చర్యలు
గత ఒప్పందంలో అంగీకరించిన హమాలీలకు ఇఎస్ఐ అమలుకు తక్షణమే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరపున చర్చల్లో పాల్గొన్న అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చారు. అమలుకు ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు ఇఎస్ఐ బోర్డుతో చర్చించి అమలు చేస్తామని తెలిపారు. ఇది అమలయ్యే వరకు తాత్కాలికంగా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. చర్చల్లో పాల్గొన్న వారిలో జేఏసీ నాయకులు పాలడుగు భాస్కర్ (సీఐటీయూ), ఎన్.శ్రీనివాస్ (ఏఐటీయూసీ), వై.ఓమయ్య (ఏఐటీయూసీ), కె.సూర్యం (ఐఎఫ్ టియూ), బి.మొగిలి (జీసీసీ రాష్ట్ర అధ్యక్షులు), ఎస్.బాలయ్య (జీసీసీ రాష్ట్ర కార్యదర్శి) ఉన్నారు.
Courtesy Nava Telangana