- వారంలో ముగియనున్న ఖరీఫ్ సీజన్
- ఈ యేడు లక్ష్యంలో
- 50 శాతం మాత్రమే పంపిణీ
- సర్కార్ కారణమన్న బ్యాంకర్లు
జూన్లో ఖరీఫ్ సీజన్ మొదలైంది. మరొక్క వారంలో ముగియనుంది! సీజన్ ముగింపు దశకు వచ్చినా రైతులకు అందిన పంట రుణాలు కేవలం 50 శాతమే! మిగిలిన వారంతా ఎప్పట్లాగే ప్రైవేటు రుణాలను ఆశ్రయించాల్సి వచ్చింది! ఇందుకు కారణం ప్రభుత్వం బ్యాంకులకు బకాయిలు చెల్లించకపోవడమే. దాంతో, రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు కొర్రీలు పెట్టడమే! ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రూ.29 వేల కోట్ల పంట రుణాలను రైతులకు పంపిణీ చేస్తామని బ్యాంకర్లు టార్గెట్ ప్రకటించారు. జూన్ ఒకటో తేదీ నుంచి వానాకాలం పంట సీజన్ ప్రారంభం కాగా.. నాలుగు నెలల్లో లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉంది. అంటే, సెప్టెంబరు నెలాఖరుకు మొత్తం రుణాలు పంపిణీ చేయాలి. కానీ, ఇంతవరకూ రూ.14,588 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. ఖరీఫ్ సీజన్ ముగియడానికి మరో వారం మాత్రమే మిగిలి ఉంది. ఈ వారంలో మిగిలిన 50ు లక్ష్యం పూర్తి చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే, పంట రుణాల లక్ష్యం నెరవేరకపోవడానికి ప్రభుత్వ వైఖరే కారణమని బ్యాంకర్లు ఆరోపిస్తున్నారు. పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలకు సంబంధించి ప్రభుత్వం రూ.770 కోట్లను బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. ఈ నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని బ్యాంకర్లు ఆరోపిస్తున్నారు.
రుణ మాఫీ మార్గదర్శకాలూ కరువు
పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాల బకాయిలకు తోడు రుణ మాఫీ పథకానికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలూ ప్రభుత్వం నుంచి బ్యాంకర్లకు అందలేదు. లక్ష వరకూ రుణాలను మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో, మార్గదర్శకాల కోసం రైతులు, బ్యాంకర్లు రుణాలు రెన్యువల్ చేసుకోకుండా ఎదురు చూశారు. దీంతో వారికి బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. రుణాలను రైతులే రెన్యువల్ చేసుకోవాలని, గతంలో ప్రకటించినట్లు దశలవారీగానే మాఫీ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి ఈ మాత్రం స్పష్టత రావడానికి తాము ఖరీఫ్ సీజన్ను నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా, తాజా నిర్ణయానికి సంబంఽధించి కూడా ఎలాంటి మార్గదర్శకాలూ విడుదల కాలేదు. అయినా, మిగిలి ఉన్న వారం రోజుల్లో సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులకు పంట రుణాలు ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Courtesy AndhraJyothy..