చిట్యాలలో పొలంలోనే ఉరి వేసుకున్న వైనం
వ్యవసాయం చేయడానికి అప్పులు చేశాడు. పంట దిగుబడి ఆశించినంత రాలేదు. అప్పులు తీర్చలేని పరిస్థితి. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఓ రైతు శుక్రవారం ఉదయాన్నే వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ మండలం చిట్యాలలో చోటు చేసుకుంది. చాకలి రాములు(49)కు ఒకటిన్నర ఎకరాల వ్యవసాయ భూమిలో పంటలు పండించడానికి అప్పులు చేశాడు. రాములుకు భార్య సత్తమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా, ఐకేపీ కేంద్రాల్లో అన్ని రకాల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూర్యాపేట జిల్లా రైతులు డిమాండ్ చేశారు. నూతనకల్, ఎడవెల్లి గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం నూతనకల్ మండలంలోని సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై గంటసేపు రాస్తారోకో చేశారు. మరోవైపు, మద్దతు ధర చెల్లించకుండా తక్కువ ధరకు సన్నరకం ధాన్యం కొనుగోలు చేస్తున్న నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంలోని రాఘవేంద్ర రైస్మిల్లు యాజమాన్యంపై శుక్రవారం క్రిమినల్ కేసు నమోదైంది. రైతులు జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేయటంతో సివిల్ సప్లయిస్ డీటీ, మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ పరమేశ్, దామరచర్ల ఏవో కల్యాణ చక్రవర్తి తనిఖీలు చేసి చర్యలు తీసుకున్నారు.
Courtesy Andhrajyothi