- పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు
- కూలిన ఇళ్లు.. నీటమునిగిన పంటలు
- వేలాది ఎకరాల్లో పంట నష్టం
- వర్షాలతో స్తంభించిన జనజీవనం
- పలు చోట్ల రాకపోకలకు అంతరాయం
- వర్షబీభత్సం నుంచి కోలుకోని వరంగల్
- ఇంకా జలదిగ్బంధంలోనే కాలనీలు
- పలు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన
రాష్ట్రవ్యాప్తంగా వానలు, వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సోమవారం వర్షం కాస్త విరామం ఇచ్చినా.. వరద ఉధృతి మాత్రం తగ్గలేదు. పంటలు నీట మునిగాయి. కొన్ని చోట్ల ఇళ్లు కూలాయి. చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. చాలా చోట్ల వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వంతెనలు మునిగిపోవడం, కల్వర్టులు కోతకు గురవడం, రోడ్లు తెగిపోవడం, వాగులు రోడ్ల పైనుంచి ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో చెరువు కట్టలు, కాల్వ కట్టలు తెగిపోవడంతో పెద్దఎత్తున పంట నష్టం జరిగింది. కృష్ణా, గోదావరి నదులు పొంగి ప్రవహిస్తుండడంతో అధికారులు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
వరంగల్ నగరం వర్ష బీభత్సం నుంచి ఇంకా తేరుకోలేదు. గడిచిన 24 గంటల్లో నగరంలో సరాసరి 9.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. సోమవారం వర్షం జోరు తగ్గినా.. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేకపోతున్నారు. జలదిగ్బంధానికి గురైన కాలనీ వాసులు నిత్యావసరాలు అందక ఇబ్బంది పడుతున్నారు. రెండు మీటర్ల ఎత్తు వరకు వరద నీరు ప్రవహించడంతో ట్రాన్స్ఫార్మర్లు నీటమునిగి విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా కాలనీల్లో మూడు రోజులుగా విద్యుత్తు సరఫరా లేదు. రోడ్లమీద ఇప్పటికీ వరద నీరు పెద్ద ఎత్తున నిలిచే ఉంది. ఎన్డీఆర్ఎ్ఫ బృందాలు రెండో రోజు కూడా వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. పడవల సాయంతో మరో వెయ్యి మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కాలనీల్లో వరదనీరు తగ్గడానికి ఇంకా రెండు మూడు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ములుగు రోడ్డుపై వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. వరంగల్- హన్మకొండ ప్రధాన రహదారి కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. మంత్రి సత్యవతి రాథోడ్ వరంగల్లో నీట మునిగిన శివనగర్, మైసమ్మకుంట, అగర్తల, ఆర్.ఎ్స.నగర్, పెరకవాడలో పర్యటించారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని అన్ని మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. హసన్పర్తిలో అత్యధికంగా 108.4 మీమీ వర్షం పడింది. పలు గ్రామాలు ఇప్పటికీ వరదనీటిలోనే ఉన్నాయి. ములుగు జిల్లా ఏజెన్సీలోని లోతట్టు గ్రామాలు పదులసంఖ్యలో జలదిగ్బంధంలోనే మగ్గుతున్నాయి. మేడారం వద్ద జంపన్నవాగు ఉధృతి తగ్గినప్పటికీ భారీగా పంట నష్టం వాటిల్లింది. భూపాలపల్లి జిల్లాలో వర్షం తగ్గినా వరద తగ్గడం లేదు. పలిమెల మండలంలో ఏడు గ్రామాలను ముంపు ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం మధ్యాహ్నానికి తగ్గుముఖం పట్టింది. కలెక్టర్ వీపీ గౌతమ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఏజెన్సీ కొత్తగూడ, గంగారం మండలాలను సందర్శించి పరిస్థితులు సమీక్షించారు. వరంగల్ రూరల్ జిల్లాలో వర్షానికి బ్రేక్ పడినా వరద ఉధృతి తగ్గలేదు. పాకాల సరస్సు మత్తడి ఐదడుగులకు మించి వెళ్తుండడంతో నర్సంపేట- కొత్తగూడ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట జిల్లాలో సోమవారం కూడా ముసురు పడింది. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ముసురు పట్టడంతో పాత ఇళ్లు కూలిపోయాయి. 148 ఇళ్లు పూర్తిగా కూలిపోగా, 415 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నారాయణపేట జిల్లాలో మొత్తం 135 ఇళ్లు దెబ్బతిన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 175 ఇళ్లు కూలిపోయాయి. వనపర్తి జిల్లాలో 219 మట్టి ఇళ్లు కూలిపోయాయి. నాగర్కర్నూల్ జిల్లాలో 397 ఇళ్లు దెబ్బతిన్నాయి.
భారీగా పంట నష్టం
మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 12,764 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనావేశారు. నారాయణపేట జిల్లాలోనూ పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. జిల్లాలో 41,867 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. కృష్ణానదికి వరద పోటెత్తడంతో కృష్ణ మండలంలోని కృష్ణ, గుడేబల్లూరు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ తీర ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వనపర్తి జిల్లాలో 5249 ఎకరాల్లో వివిధ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జనగామ జిల్లాలో 7700 ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 5.79 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 15వేల ఎకరాలకు పైగా వరి, పత్తి పంటలు ముంపునకు గురయ్యాయి. కరీంనగర్తోపాటు రూరల్ మండలంలో మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ కె.శశాంక, అధికారులతో కలిసి లోతట్టు ప్రాంతాలను, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. హుజూరాబాద్, కమలాపూర్లో మంత్రి ఈటల రాజేందర్ పంట నష్టపోయిన ప్రాంతాలను, నీట మునిగిన గ్రామాలను సందర్శించి ప్రభుత్వం సాయం చేస్తుందని చెప్పారు. కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చిగురుమామిడి మండలంలో పర్యటించారు. జగిత్యాల జిల్లాలో గోదావరి తీర ప్రాంత మండలాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగినట్లు అధికారులు తెలిపారు.
రహదారులపై పడవలతో ప్రయాణం
భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు, అశ్వాపురం, పినపాకమండలాలలపై వరద ప్రభావం తీవ్రంగా చూపింది. ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల రహదారులపై పడవల ద్వారా ప్రయాణం సాగిస్తున్నారు. ఏజెన్సీలో తెలంగాణ ఆంధ్రాకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద తగ్గుముఖం పట్టింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వారం రోజుల అనంతరం వర్షం వెలిసి సాధారణ వాతావరణం నెలకొంది.
గౌరవెల్లి ప్రాజెక్ట్ ఎడమ కాల్వకు గండి
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి సమీపంలోని పెద్దతండా వద్ద గౌరవెల్లి ప్రాజెక్ట్ ఎడమ కాల్వకు సోమవారం గండి పడింది. సుమారు 250 ఎకరాల్లో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. నాణ్యత లేకుండా పనులు చేపట్టడం వల్లనే కాలువకు గండిపడిందని రైతులు ఆరోపిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా నిర్మితమవుతున్న కర్వెన రిజర్వాయర్ ప్రధాన కట్టకు గండిపడింది. దీంతో 70 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్లే గండి పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై డీఈ విజయేందర్రెడ్డిని వివరణ కోరగా కట్ట నిర్మాణంలో ఎలాంటి లోపం లేదని చెప్పారు.
- నిజామాబాద్ జిల్లాలో సోమవారం 44.7 మి.మీ. వర్షం పడింది. అత్యధికంగా ముప్కాల్, మెండోరా మండలాల్లో 84.5 మి.మీ. వర్షం పడింది. జిల్లాలో జూన్ నుంచి ఇప్పటి వరకు 603 మి.మీ. వర్షం పడాల్సి ఉండగా 617 మి.మీ. వర్షం పడింది. కామారెడ్డి జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పలు మండలాల్లోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి.
- నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని పల్సీకర్ రంగారావు ప్రాజెక్ట్లోకి వరద నీరు ఉదృతంగా రావడంతో గుండెగావ్ గ్రామం మరోసారి ముంపునకు గురైంది. దీంతో గ్రామస్థులకు ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక ఆశ్రయం కల్పించారు.
- హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలోకి వరద నీరు చేరడంతో చెరువును తలపిస్తోంది. హుస్సేన్సాగర్ నిండుకుండలా మారింది. ఇన్ఫ్లో 400 క్యూసెక్కులుండగా, అవుట్ ఫ్లో 1000 క్యూసెక్కులు ఉంది.
Courtesy Andhrajyothi