- రెవెన్యూ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
- సాదా బైనామాలకు మరో అవకాశం
- జీవో 58, 59లను పొడిగిస్తాం
- ఆర్ఓఎఫ్ఆర్ భూములకు ప్రత్యేక కాలమ్
- అసైన్డ్ భూములపై సముచిత నిర్ణయం
- అధికారి తప్పుచేస్తే సర్వీసు నుంచి డిస్మిస్
- కౌలుదారీ వ్యవస్థకు మేం వ్యతిరేకం
- అవసరంలేని చట్టాలను వెంటనే తొలగిస్తాం
- విప్లవాత్మక, చరిత్రాత్మక బిల్లు ఇది
- భూముల సర్వే పూర్తయితే వివాదాలుండవు
- అయినా ఎదురైతే.. సివిల్ కోర్టులకే వెళ్లాలి
- వీఆర్ఏలు కోరితే కుటుంబసభ్యులకు ఉద్యోగాలు
- అటవీప్రాంతాల్లోని గిరిజనేతరులకూ రైతుబంధు
- రెవెన్యూ చట్టంపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ వివరణ
సాదాబైనామాకు మరో చాన్స్
సాదాబైనామాలకు మరోసారి అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ‘ఒక్క రూపాయి తీసుకోకుండా సాదాబైనామాలను పట్టాలు చేశాం. గత ప్రభుత్వాలు డబ్బులు వసూలు చేశాయి. 1,19,000 దరఖాస్తులను స్వీకరించి.. 6.18 లక్షల ఎకరాలను ఉచితంగా క్రమబద్ధీకరించాం. గతంలో మూడుసార్లు సాదాబైనామాల స్వీకరణను పొడిగించాం. అవసరమైతే 15 రోజుల సమయం ఇస్తాం. కేబినేట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అన్నారు.
జీవో 58, 59 పొడిగిస్తాం
పేద ప్రజల ఆధీనంలో ఉన్న భూములను క్రమబద్దీకరించడానికి ఉద్దేశించిన జీవోలు 58, 59 పొడిగిస్తామని సీఎం అన్నారు. వాటి కింద 1,40,328 మంది పేదలకు పట్టాలిచ్చామని, 100 గజాలలోపుంటే ఉచితంగా, ఆ తర్వాత కొంత ఫీజుతో క్రమబద్ధీకరించామని తెలిపారు. కేబినేట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్ అంశం హైకోర్టు పరిధిలో ఉందన్నారు.
హైదరాబాద్ : భూపరిరక్షణ చర్యల్లో భాగంగా శనివారం నుంచి వక్ఫ్, దేవాదాయ భూముల్లో లావాదేవీలను పూర్తిగా నిషేధిస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ భూములు అమ్మడానికి వీల్లేదని, వాటికి మునిసిపల్, గ్రామపంచాయతీ అనుమతి, ఎన్వోసీ ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేస్తానని అన్నారు. రిజిస్ట్రేషన్ చట్టంలోని 22ఏ కింద లావాదేవీలను నిషేధించే అధికారం తమకు ఉందన్నారు. శుక్రవారం శాసనసభలో నూతన రెవెన్యూ చట్టంపై చర్చ జరిగిన అనంతరం.. సీఎం వివరణ ఇస్తూ ఈ ప్రకటన చేశారు..
‘‘రాష్ట్రంలో ఆక్రమణకు గురైన వక్ఫ్ భూములను రక్షిస్తాం. 1962 నుంచి 2003 వరకు వక్ఫ్భూముల సర్వే చేశారు. అందుకు 62 గెజిట్లను విడుదల చేశారు. మొత్తం 77,588 ఎకరాల వక్ఫ్భూమి ఉంది. అందులో 57,423 ఎకరాలు ఆక్రమణకు గురైంది. మరో 6 వేల ఎకరాలపై 2వేల కేసులు నడుస్తున్నాయి. అలాగే 87,235 ఎకరాల దేవాదాయ భూముల్లోనూ ఆక్రమణలున్నాయి. వాటిలో లీజుకు 21 వేల ఎకరాలు, అర్చకుల అధీనంలో 23 వేల ఎకరాలు, ఆక్రమణలో 22,535 ఎకరాలు ఉన్నాయి’ అని ముఖ్యమంత్రి వివరించారు. సర్వే పూర్తి చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న నూతన రెవెన్యూ చట్టం చిట్టచివరిది కాదని, ఇది ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు. రెవెన్యూ వ్యవస్థను సంస్కరించడంలో ఈ చట్టం ద్వారా తొలి అడుగు వేశామన్నారు. రెవెన్యూలో దాదాపు 160 నుంచి 170 చట్టాలు ఉన్నాయని, వాటిలో బ్రిటిష్ కాలానికి అనుగుణంగా ఉన్నవి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన చట్టాలను తొలగించినట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 87 రెవెన్యూ చట్టాలు మనుగడలో ఉన్నాయని, వీటిలో అవసరం లేని రెండు, మూడు చట్టాలు తొలగిస్తామని అన్నారు.
అయితే ఒక్క ధరణి మాత్రమే ఉండదని, ధరణి, ఆర్వోఆర్ చట్టంతోపాటు ఇతర చట్టాలు కూడా అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలకు బాగా ఇబ్బంది కలిగించేవి, అవినీతికి ఆస్కారం ఉన్న చట్టాలను, పెడదోవకు దారితీసే అంశాలను మాత్రమే తొలగించినట్లు పేర్కొన్నారు. సమగ్ర భూ సర్వేకు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, టెక్నాలజీ పెరిగిందని, చాలా సర్వే సంస్థలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. అక్షాంశ, రేఖాంశాల(గూగుల్ కో ఆర్డినేట్స్) ఆధారంగా, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సమర్థంగా నిర్వహిస్తామన్నారు. దీని ఖర్చుకు కేంద్రంపై ఆధారపడబోమన్నారు.
కొన్ని గ్రామాలకు రికార్డులే లేవు..
తన నియోజకవర్గం గజ్వేల్లోని ముస్త్యాల, కొత్తపేట గ్రామాల్లో ప్రయోగాత్మకంగా 576 ఎకరాల భూమిని డిజిటల్ సర్వే చేయించి, బహిరంగ ప్రకటన చేయగా.. చాలా తక్కువ ఫిర్యాదులు వచ్చాయని సీఎం తెలిపారు. అవి ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలోనే పరిష్కరించినట్లు పేర్కొన్నారు.
‘శామీర్పేట మండలం లక్ష్మాపూర్లో ఊరు మొత్తానికి పట్టా లేదు. సీసీఎల్ఏ కార్యదర్శి సొంత గ్రామం చిగురుమామిడి మండలం రేగొండలో కూడా భూ సమస్యలు పరిష్కారం కాలేదు. పీటముడులతో రకరకాల అరాచకాలు జరుగుతున్నాయి. రాష్ట్రాన్ని పాలించేవారు ప్రేక్షక పాత్రకు పరిమితం కాకూడదు. అందుకే ధైర్యం చేసి రంగంలోకి దిగాం. గ్రామాల్లో భూ వివాదాలు పెద్దగా ఏమీ లేవు. లిటిగేషన్ సమస్య చాలా చిన్నది. టెక్నాలజీ యుగంలో అసాధ్యమనేది ఉండదు. రైతుబంధులో 1,45,58,000 ఎకరాలకుగాను 57.90 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 48 గంటల్లో రూ.7,279 కోట్లు జమ చేశాం’ అని అన్నారు.
ట్రైబ్యునల్స్ శాశ్వతం కాదు..
ట్రైబ్యునల్స్ శాశ్వతం కాదని, 16 వేల పైచిలుకు కేసులు రెవెన్యూ కోర్టులో, మరో 2 వేల కేసులు హైకోర్టులో ఉన్నాయని తెలిపారు. ఇంతమాత్రాన లిటిగేషన్లు ఎక్కువగా ఉన్నాయని భావించటం ప్రతిపక్షాలకు సరైందికాదని సీఎం అన్నారు. ‘మార్పును జీర్ణించుకోవటానికి కాస్త సమయం పడుతుంది. దశాబ్దాలుగా ఉన్న వ్యవస్థను మరిచిపోవడం సులభంకాదు. కోటిన్నర ఎకరాలకు సంబంధించిన వ్యవహారంలో కొన్ని కొన్ని లోపాలు ఉంటాయి.
నాకు కూడా 20 ఏళ్ల క్రితం ఓ అనుభవం ఎదురైంది. కాగితాలపై ఎక్కువ, మోఖాలో తక్కువ భూమి ఉండటంతో భూ రికార్డులన్నీ స్టడీ చేయిస్తే పొరుగున ఉన్న రైతుల ఆధీనంలో ఉన్నట్లు తేలింది’ అని కేసీఆర్ చెప్పారు. అన్ని సమస్యల పరిష్కారానికి సమగ్ర సర్వే శాశ్వత పరిష్కారమన్నారు. రెవెన్యూ చట్టంలో సేవింగ్ యాక్టు, ట్రబుల్ షూటర్, డిఫికల్టీ యాక్ట్ అనుబంధంగా ఉంటాయని తెలిపారు. ఒకవేళ పెద్ద సమస్యలు ఎదురైతే ఆర్గినెన్స్లు జారీ చేసుకొని ముందుకుసాగుతామన్నారు. భూమి వివాదాల పరిష్కారం కోసం నిజాయితీ, నిబద్ధత కలిగిన ఐఏఎ్సలు, పదవీ విరమణ పొందినవారితో తాత్కాలిక ట్రైబ్యునల్ను ఏర్పాటు చేస్తామన్నారు.
శ్రీధర్బాబే కాదు.. నేనూ తెలివైనోడినే
అసైన్మెంట్ భూముల పంపిణీలో గతంలో అవలంబించిన విధానాలన్నీ అశాస్త్రీయంగా ఉన్నాయని సీఎం ఆరోపించారు. ‘సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో 1,500 నుంచి 1,600 ఎకరాల భూమి ఉంటే 9 వేల ఎకరాలకు పట్టాలిచ్చారు. మా ఊరిలో కూడా 90 ఎకరాల భూమి ఉంటే 136 ఎకరాలు పంపిణీ చేసినట్లు పట్టాలిచ్చారు. పంచిన భూమి కంటే పంచిన కాగితాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికీ ఆ వివాదాలు కొనసాగుతున్నాయి’ అని అన్నారు.
కంక్లూజింగ్ టైటిల్ ఇస్తేనే శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఎమ్మెల్యే శ్రీధర్బాబు అన్న మాటలను గుర్తుచేస్తూ… శ్రీధర్బాబు కొన్ని విషయాలు ఇంటెలిజెంట్గా చెప్పాడని, అయితే శ్రీధర్బాబే కాదు. తాను కూడా ఇంటెలిజెంట్నేనని కేసీఆర్ చమత్కరించారు. కంక్లూజివ్ టైటిల్ ఇచ్చిన తర్వాత కోర్టులో అది కొట్టుడుపోతే.. ప్రభుత్వం జరిమానా చెల్లించాల్సి వస్తుందని, ఇంత అర్జెంటుగా ఇవ్వాలని, రేపటి నుంచి జరిమానాలు చెల్లించాలనే ఆసక్తి తమకేమీలేదని అన్నారు.
పంచడానికి ప్రభుత్వ భూములు లేవు…
రాష్ట్రంలో పేదలకు పంచేందుకు ప్రభుత్వ భూములు లేవని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దళితులు, గిరిజనులకు మూడెకరాల పథకం కింద భూమి కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నామని, ఖమ్మం జిల్లాలో గరిష్ఠంగా ఎకరానికి రూ. 7.5 లక్షల చొప్పున కొనుగోలు చేసి పంచామని తెలిపారు. రాష్ట్రంలోని అసైన్డ్ భూముల విషయమై త్వరలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు భేటీ కావాలని సూచించారు. అభిప్రాయాలను సేకరించి తెలియజేస్తే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
రాష్ట్రంలో 89 లక్షల వ్యవసాయేతర ఆస్తులకు కూడా పాస్ పుస్తకాలు అందజేస్తామన్నారు. ఈ పుస్తకాలకు మెరున్ రంగు ఉంటుందన్నారు. మత పరమైన, అటవీ భూములను ఆటో లాక్ చేస్తామన్నారు.
Courtesy Andhrajyothi