- ఏడాదిగా స్తంభించిన సర్కారు..
- సీఎం ఆమోదం కోసం కుప్పలు తెప్పలుగా ఫైళ్లు
- కలెక్టర్ల వినతులు సైతం వెనక్కి
- మంత్రుల స్థాయిలోనే ఆగిపోతున్న ఫైళ్లు
- గత ప్రభుత్వంలో రోజుకు సగటున 50 జీవోలు
- తొమ్మిది నెలలుగా సగటున 8 మాత్రమే
- పోస్టింగుల ఫైళ్లన్నీ నెలల తరబడి పెండింగ్
- తాత్కాలిక సచివాలయంలో ఇద్దరే మంత్రులు
- అరణ్య భవన్లో ఆర్థికం.. రవీంద్ర భారతిలో ఎక్సైజ్
భూముల క్రమబద్ధీకరణ కోసం తెచ్చిన పలు జీవోల కింద కుప్పలు తెప్పలుగా ఫైళ్లు జిల్లా కలెక్టరేట్లలో పడి ఉన్నాయి. 2014 డిసెంబరు 31న భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీవోలు 58, 59 తెచ్చింది. ఇందుకోసం పలువురు లక్షలాది రూపాయలను ప్రభుత్వానికి చెల్లించారు. అయినా, ఎన్నో దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. వాటి పరిశీలన పూర్తి చేసేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్లు విన్నవించారు. ఈ మేరకు ఆ ఫైళ్లను సీఎం కార్యాలయానికి పంపించారు. అదే వేగంతో అవి వెనక్కి వచ్చాయి. దాంతో, కలెక్టర్లు చేసుకున్న విజ్ఞప్తులను కూడా పరిశీలించలేని దయనీయ పరిస్థితి సర్కారులో ఉందని అధికార వర్గాలు వాపోతున్నాయి.
హైదరాబాద్, సెప్టెంబరు 29 : టీఆర్ఎస్ సర్కారు తొలి విడతలో రోజుకు సగటున 50 జీవోలు జారీ అయ్యేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ సంఖ్య 70కిపైనే! కానీ, గత తొమ్మిది నెలలుగా రోజుకు జారీ అయ్యే జీవోల సంఖ్య సగటున 8 దాటడం లేదు. ఈనెల ఒకటి నుంచి 28వ తేదీ వరకూ సచివాలయంలో వెలువడిన జీవోలు 191 మాత్రమే! తెలంగాణలో ప్రస్తుత పాలన తీరుకు నిదర్శనమిది! టీఆర్ఎస్ సర్కారు రెండోసారి కొలువుదీరిన తర్వాత పాలన ఇంకా పట్టాలపైకి ఎక్కలేదు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కారణంగా గత ఏడాది సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకూ పాలన సాగలేదు! గత ఏడాది డిసెంబరులోనే సర్కారు కొలువుదీరింది. ఇప్పటికే తొమ్మిది నెలలు పూర్తయినా పాలన గాడిన పడలేదు. వెరసి, ఏకంగా 13 నెలలుగా రాష్ట్రంలో పాలన పడకేసింది! ఆదిలో మంత్రులు లేరు. ఇప్పుడు మంత్రులున్నా కీలక శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. కీలక ఫైళ్లకు కూడా ఆయన ఆమోదం పడడం లేదు. తాజాగా సచివాలయ తరలింపుతో పాలనలో స్తబ్ధత నెలకొంది. ఆగస్టు తర్వాత పాలన పరుగులు పెట్టిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
మంత్రివర్గ విస్తరణ జరిపినా.. రెవెన్యూ వంటి కీలక శాఖలు సీఎం వద్దే ఉండడంతో పాలన ముందుకు కదలడం లేదు. కుప్పలకొద్దీ ఫైళ్లు సీఎం ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. రొటీన్గా జరగాల్సిన అంశాలను కూడా పరిశీలించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఏ ఫైలు ఆమోదం పొందాలన్నా అంతిమంగా ముఖ్యమంత్రి గ్రీన్సిగ్నల్ ప్రామాణికం. అయితే, సీఎంవో అసలు ఫైళ్లే తీసుకోకపోవడంతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు కూడా ఫైళ్లు తీసుకోవడం లేదు. అంతిమంగా ఫైళ్లన్నీ మంత్రుల స్థాయి దాకా వెళ్లి ఆగిపోతున్నాయి. విధానాల (పాలసీ) రూపకల్పన అంతా సచివాలయంలోనే జరుగుతుంది. వాటి అమలుకు కమిషనరేట్/డైరెక్టరేట్లకు జీవోలు వెళతాయి. వాటి అమలు బాధ్యత క్షేత్రస్థాయి యంత్రాంగానిది! ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు కమిషనరేట్/డైరెక్టరేట్లు ఇవ్వాలి. ప్రస్తుతం పాలసీలేవీ రూపొందించకపోవడంతో అటు రాష్ట్ర పాలనా కేంద్రంలోనూ, ఇటు జిల్లాల్లోనూ నిస్తేజం అలముకుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఈ పోస్టింగులు ఎప్పుడు!?
- ఏడాది కిందట 2017 బ్యాచ్కు చెందిన 8 మంది ఐఏఎస్లు ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. వారికి పోస్టింగుకు సంబంధించిన ఫైలు సీఎం వద్దకు వెళ్లింది. అది ఇంకా ఆమోదం పొందలేదు.
- ఆరు నెలల కిందట రిజిస్ట్రేషన్ల శాఖలో ఒకరికి డీఐజీ, ఆరుగురికి జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతులు లభించాయి. దీనికి సంబంధించి రెండు నెలల కిందట జీవో ఇచ్చారు. అప్పటి నుంచి వీరంతా పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్నారు. వీరు కాక ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లు పోస్టింగు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఫైళ్లన్నీ సీఎం వద్దే పెండింగ్లో ఉన్నాయి.
- అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా 400 మందికిపైగా తహసీల్దార్లను వివిధ జిల్లాలకు బదిలీ చేశారు. ఎన్నికలు కాగానే వీరిని పూర్వ జిల్లాలకు బదిలీ చేయాల్సి ఉంది. తొమ్మిది నెలలు పూర్తవుతున్నా భార్య ఒకచోట.. భర్త మరోచోట ఉండాల్సిన పరిస్థితి. భార్యాభర్తలిద్దరూ ఒకేచోట ఉండాలని పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా సీఎం ఈ సమస్యను పెండింగ్లో పెట్టేశారు.
- చివరికి, ఏసీబీకి పట్టుబడిన వారిపై ప్రాసిక్యూషన్ అనుమతుల ఫైళ్లను కూడా సీఎం ఆమోదించడం లేదు. ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల ఫైళ్లు కూడా పెండింగ్లోనే ఉన్నాయి.
- విద్యుత్తు చార్జీలపై నిర్ణయం తీసుకునే అధికారం ఈఆర్సీదే. 9 నెలలుగా దీనికి చైర్మన్, సభ్యులు లేక కార్యకలాపాలు స్తంభించాయి.
- కీలకమైన సీసీఎల్ఏ పోస్టు మూడున్నరేళ్లుగా ఖాళీగా ఉంది. భూ రికార్డుల నవీకరణ జరుగుతున్నప్పుడూ ఈ పోస్టును ఖాళీగానే ఉంచేశారు.
సచివాలయంలో ఇద్దరే మంత్రులు
సచివాలయ తరలింపుతో పాలన పూర్తిగా మందగించింది. బీఆర్కేఆర్ భవన్లో చాంబర్లు ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. మరో రెండు నెలలైతే తప్ప శాఖలు పని చేసే అవకాశాల్లేవు. బీఆర్కేఆర్ భవన్లో 12 మంది మంత్రులకు ఇద్దరే ఉంటున్నారు. మిగతా మంత్రులంతా తలో దారి చూసుకున్నారు. తాజాగా, మంత్రి శ్రీనివాస్గౌడ్ ఏకంగా రవీంద్ర భారతిలో మకాం పెట్టారు.
Courtesy Andhrajyothi…