– రేకా చంద్ర శేఖర రావు
బ్రాహ్మణులు ఏ వృత్తి అయినా చేయవచ్చును కానీ ఉపాధ్యాయ వృత్తి మాత్రం చేయరాదు. ఈ మాట మహాత్మా ఫూలే ఎందుకన్నారు?
ఇది తెలుసుకునే ముందు బ్రాహ్మణులతో ఆయన వ్యక్తిగత సంబంధాలు ఎలా వుండేయో చూద్దాం!
ఫూలేకు బ్రాహ్మణ స్నేహితులు అనేకమంది వుండే వారు, అందులో ఆయన సహాధ్యాయులైన ఇతర మితృలు వున్నట్లుగానే బ్రాహ్మణ మితృలు కూడా ఎక్కువ మందే వున్నారు, వారిలో కొందరు తన స్నేహితులు ద్వారా తన సామాజిక కార్యక్రమాలకు ప్రత్యక్ష , పరోక్ష సహకారాలు పొందేటంత స్నేహాన్ని కలిగి వున్నారు. తన సత్యశోధక సమాజానికి విరాళ మిచ్చిన మొదటి దాత కూడా బ్రాహ్మణుడే.
తాను, సావిత్రీబాయి ఫూలే నిర్వహించిన అనాధ స్త్రీల రక్షణ సంస్తలలో బ్రాహ్మణ స్త్రీలు కూడా వచ్చి వారి ఆశ్రయాన్ని పొందేవారు, అలా ఆశ్రయం పొందిన ఒక స్త్రీ , ఈ సమాజం చేసిన మోసానికి గురయిన ఒక బ్రాహ్మణ స్తీకి రక్షణ ఇచ్చి, ఆమెకు పురుడు పోసి బిడ్డను కాపాడారు. ఆ బిడ్డను ఆ స్త్రీ పెంచుకోలేని అశక్తతను చూసి వారే ఆ బిడ్డను దత్తత తీసుకుని, ఆబిడ్డకు యశ్వంత్ అని పేరు పెట్టి , పెంచి పెద్ద చేసి డాక్టరును చేశారు. ఆ డాక్టరు యశ్వంత్ ఆ తర్వాత కాలంలో తన తల్లి సావిత్రి బాయి ఫూలే తో పాటు ప్లేగు వ్యాధి బాధితులకు సేవచేస్తూ
మొదట తల్లి, తర్వాత యశ్వంత్ ఆ ప్లేగు వ్యాధి బాధితులయి మరణించారు.
ఇంకా బ్రాహ్మణులతో వివిధ సందర్భాలలో అనేక అవమానాలకు ఫూలే గురయినప్పటికీ ఎప్పుడూ ఫూలే బ్రాహ్మణ ద్వేషాన్ని ప్రకటించలేదు.
పైన చెప్పిన ఆచరణ కలిగిన ఫూలే మరి బ్రాహ్మణులు ఎందుకు ఉపాధ్యాయులుగా వుండరాదు అన్నారు.
కొత్త జాతిని, మానవీయ భారత జాతిని తయారు చేసే అత్యంత గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి.
అలాటి వృత్తిలో చిన్నప్పటి నుంచి వేదాధ్యయనం పేరుతో, జంధ్యం పేరుతో మడి- దడిని పాటిస్తూ పెరిగిన లేక పెరగవలసి వచ్చిన వారు, వారి మానసిక స్తితి- భావజాల స్తితి అంతా వాటి చుట్టూతానే వుంటుంది.
అందుకని అలాటి వారు ఉపాధ్యాయులు అయితే వారిలో ఇమిడి పోయిన బ్రహ్మణీయ మనువాద భావజాలాన్ని, చెప్ప వద్దని , చెప్పకూడదని ఎంత నిగ్రహించుకున్నా కూడా ఆ భావజాలాన్ని చెబుతారు. కొంత మంది అరుదయిన గొప్పవారు వ్యక్తులుగా మినహాయింపుగా వుంటారు , ఇక ఉద్దేశ పూరితంగా చెప్పాలను కునేవారు అదే పనిగా విద్యార్ధులకు అమానవీయ భావజాలాన్ని గొప్పవని చెబుతారు, చెబుతూ విద్యార్ధులను మూఢులుగా తయారు చేస్తారు.
ఎలా అంటే!
శూద్ర శంబూకుడి తల రాముడు నరకడం వీరోచిత చర్యగాను, పరశురాముడు రాజులనందరనీ చంపడం శాంతి కోసమని, ఏకలవ్యుడి బొటన వేలును ఖండించడం గొప్ప విషయంగా గురుదక్షిణ కోసం ప్రాణాలయినా ఇవ్వాలని, అహల్యను మోసం చేయడం, తాటకిని చంపడం , శూర్పణఖ ముక్కు – చెవులు కోయడం, గర్భిణీ అయిన సీతను అడవికి పంపడం తప్పని సరి గొప్ప పనులని; బలి చక్రవర్తిని మోసం చేసి అణచి వేయడం, రావణుడు, వాలి వంటి మహా బలవంతులను అక్రమంగా చంపడం గొప్ప వీరోచిత చర్యగాను చెబుతారు.
సంభవామి యుగే యుగే పేరుతో దేవుడే అనార్యులను, ద్రావిడులను , అసురులను చంపడం లోక కళ్యాణం కోసం తప్పనిసరి అవసరమని పాఠాలు బోధిస్తారని మన జాతిని నిర్వీర్యులుగా చేస్తారని భావించి బ్రాహ్మణులు ఉపాధ్యాయ వృత్తి తప్ప ఏదయినా ఇతర వృత్తి చేయాలని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని ఫూలే చెప్పారు, నిజంగా ఆయన చెప్పిన గొప్ప విషయాన్ని ఆనాటి పాలకులు తీసుకుని వుంటే మన జాతి ఈనాడు ఇంత పతన స్తితి వుండేది కాదనేది వాస్తవం.
ఎంత పతనస్తితి అంటే !
సమాజంలో అత్యంత తీవ్ర అణచి వేతకు గురవుతున్న ప్రజలే మనువాదాన్ని పాటిస్తూ, నిచ్చెన మెట్ల కుల వ్యవస్తలో తమ కింది వారికంటే తాము చాలా గొప్ప వారమని, పైనున్న వారు తమ కంటే గొప్పవారు అని భావించేటంత, గొప్పగా ఆ అన్యాయాలను న్యాయం అని పాటించేటంత.
జేజేలు!
మహాత్మా ఫూలేకి! జేజేలు!