ఒత్తిడిలో ఉపాధ్యాయ వృత్తి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

నాగటి నారాయణ ( రచయిత విద్యారంగ విశ్లేషకులు.

మార్కెట్‌ యుగంలో, పోటీ ప్రపంచంలో విద్యారంగం, ఉపాధ్యాయ వృత్తి అనేక సవాళ్ళను, ఒత్తిళ్ళను ఎదుర్కొంటున్నవి. ఉపాధ్యాయుల పని హాయిగా, జాలీగా వుంటుందని, త్వరగా ఇంటికి వస్తారని, సెలవులు ఎక్కువగా వుంటాయని చెప్పుకుంటారు. కానీ ఇటీవల నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌అనే సంస్థ ఓ.ఈ.సి.డి దేశాల్లో చేసిన సర్వేలో ఉపాధ్యాయులే అధిక ఒత్తిడికి గురవుతున్నారని తేల్చింది. ప్రతి వంద మంది ఉపాధ్యాయుల్లో ఇరవై మంది వృత్తిపరమైన ఒత్తిడితో వున్నట్లు, ఇతర వృత్తుల వారిలో పదమూడు మందే అలా ఫీలవుతున్నట్లు చెప్పారు.
అక్టోబర్‌ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా జగమెరిగిన ఉపాధ్యాయ వృత్తిని, వివిధ దేశాల్లో ఉపాధ్యాయుల పరిస్థితిని పరామర్శించడం పరిపాటి. ‘ఏం చదువుతున్నావ్‌? చదువుకుని ఏం కావాలను కుంటున్నావ్‌?’ అని పిల్లలను పెద్దలు అడగడం, విద్యార్థులను అధికారులు ప్రశ్నించడం ఆనవాయితీ. ‘కలెక్టర్‌ అవుతా, డాక్టర్‌ అవుతా, లాయర్‌ అవుతా, టీచర్‌ అవుతా’ అని పిల్లలు జవాబు చెబుతుంటే ‘శభాష్‌, వెరీ గుడ్‌’ అని ప్రోత్సహించడం షరా మాములే. కాగా ‘వర్కీ ఫౌండేషన్‌’ అనే అంతర్జాతీయ సంస్థ అధిక జనాభా గల 35 దేశాలలో 2013లో, 2018లో ఓ సర్వే చేసింది. సమాజానికి ఉపయోగపడుతున్న 14 రకాల వృత్తులలో దేనికి ఏ ర్యాంక్‌ ఇస్తారో చెప్పాలని ప్రతి దేశంలో వెయ్యి మంది సాధారణ ప్రజల అభిప్రాయాలను సేకరించింది. హైయస్ట్‌ ర్యాంక్‌ 14 నుండి లోయస్ట్‌ ర్యాంక్‌ 1 వరకు వివిధ వృత్తుల వారి యావరేజ్‌ ర్యాంకులలో మూడు స్థాయిల (హెడ్మాస్టర్‌, సెకండరీ, ప్రైమరీ) ఉపాధ్యాయులకు కలిపి చూస్తే మధ్యస్తంగా 7 వ ర్యాంక్‌ లభిస్తుంది. మొదటిగా డాక్టరు వృత్తికి సగటు ర్యాంక్‌ 11.6గా వుంది. లాయర్‌కు 9.5, ఇంజనీరుకు 9.1, హెడ్‌ టీచరుకు 8.1, పోలీస్‌ ఆఫీసర్‌కు 7.8, నర్స్‌కు 7.4, ఎకౌంటెంట్‌కు 7.3, స్థానిక ప్రభుత్వ అధికారికి 7.3, మేనేజిమెంట్‌ కన్సల్టెంట్‌కు 7.1, సెకండరీ స్కూల్‌ టీచర్‌కు 7.0, ప్రైమరీ స్కూల్‌ టీచర్‌కు 6.4, వెబ్‌ డిజైనర్‌కు 5.9, సోషల్‌ వర్కర్‌కు 5.8, లైబ్రేరియన్‌ 4.6 గా సగటు ర్యాంకులు వున్నాయి.
ప్రజాభిప్రాయం మేరకు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కంటే సెకండరీ స్కూల్‌ టీచర్లకు, వారికంటే హెడ్మాస్టర్లకు ఎక్కువ గౌరవం లభిస్తున్నట్లు సర్వే పేర్కొన్నది. ఇతర వృత్తులతో పోల్చితే డాక్టర్లతో సమానమని చైనా, మలేషియా, రష్యా, దేశాల వారు చెబితే, లైబ్రేరియన్లతో సమానమని ఇండియాతో సహా అమెరికా, స్పెయిన్‌, టర్కీ, కెనడా, ఫ్రాన్స్‌ దేశాల్లో చెప్పారట. ఉపాధ్యాయులు బుక్కిష్‌ నాలెడ్జి మాత్రమే ఇస్తారని వారి అభిప్రాయం కావచ్చు. ఎక్కువ దేశాల్లో సోషల్‌ వర్కర్లతో సమానమని కూడా చెప్పినట్లు సర్వేలో నమోదు చేశారు. సంపద, ఆదాయం, ఆర్థిక హోదాను బట్టి సామాజిక హోదా వుంటుందనే విషయం తెలిసిందే. పనికి తగిన వేతనం కావాలనే డిమాండ్‌ సర్వే సర్వత్రా వుంటుంది. కాగా సింగపూర్‌, స్పెయిన్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌, తదితర కొన్ని దేశాల్లో ఉపాధ్యాయులకు అధిక జీతాలు లభిస్తున్నా చాలా దేశాల్లో తక్కువ జీతాలే చెల్లిస్తున్నారు. ‘ప్రోగ్రామ్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ అసెస్మెంట్‌ (పిఐఎస్‌ఏ)’ ద్వారా వివిధ దేశాల్లోని పదిహేను సంవత్సరాల వయసు గల విద్యార్థులకు మూడేళ్లకోసారి చదవడం, లెక్కలు చేయడం, సైన్స్‌ పరిజ్ఞానంలో అంతర్జాతీయ పరీక్ష నిర్వహించబడుతోంది. అందులో అధికంగా అభ్యసన సామర్ధ్యాలు సాధించిన విద్యార్థులు వుండే దేశాల్లోని ఉపాధ్యాయులకు జీతాలు కూడా అధికంగా వున్నట్లు తెలుస్తోంది.
చైనా, ఇండియా, మలేషియా, ఘనా మరో నాలుగు దేశాల్లోని తల్లిదండ్రుల్లో దాదాపు సగం మంది తమ బిడ్డలు ఉపాధ్యాయులు కావాలని కోరుకుంటున్నట్లు సర్వే తెలిపింది. ప్రజల అభిప్రాయాలు, తల్లిదండ్రుల ఆకాంక్షలు, అధిక జీతాలు, వృత్తిలో నైపుణ్యత, బోధనా సామర్ధ్యం, విద్యార్థుల అభ్యసన స్థాయి మున్నగు ప్రాతిపదికల ఆధారంగా ఉపాధ్యాయులకు లభిస్తున్న గౌరవాన్ని బట్టి ‘గ్లోబల్‌ టీచర్‌ స్టేటస్‌ ఇండెక్స్‌ 2018’ రూపొందించబడింది. ఒకటి నుండి వంద ర్యాంకుల ఇండెక్సులో చైనా టీచర్లకు మొదటి ర్యాంక్‌ లభించగా, భారత దేశ ఉపాధ్యాయులకు ఎనిమిదో ర్యాంక్‌ వచ్చింది.
అభివృద్ధి చెందిన దేశాలైన బ్రిటన్‌ 13, అమెరికా 16, ఫిన్లాండ్‌ 17 మరియు జపాన్‌ 18 స్థానాల్లో వున్నాయి.
జన్మనిచ్చేది తల్లిదండ్రులే అయినా జీవితాన్నిచేది ఉపాధ్యాయులే అంటారు. గురువులు తల్లిదండ్రులతో సమానం అనే నానుడి వుంది. అయినా ప్రపంచంలో సమాజానికి ఉపయోగపడే వృత్తుల్లో మొదటి స్థానంలో ఉండాల్సిన ఉపాధ్యాయులు ఏడో స్థానంలో ఎందుకున్నారు? గురువును దైవంతో సమానంగా భావించి గురుపూజోత్సవాలు నిర్వహించే భారత దేశంలో ఎనిమిదో స్థానమే దక్కడమేంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పి పరిష్కార మార్గాలను అనుసరించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైనే వుంది. ‘వర్కీ ఫౌండేషన్‌’ సర్వేలో ఉపాధ్యాయుల హోదాను పరిశీలించడానికి ఎంచుకున్న ప్రాతిపాదికల కంటే మౌలికమైనది విద్యారంగం. ఏ దేశంలో విద్యారంగానికి ఎంత ప్రాధాన్యత వుంటుందో ఆ దేశంలో ఉపాధ్యాయులకు అంతటి గౌరవం, హోదా లభిస్తుందనేది అసలు ప్రాతిపదిక.
మార్కెట్‌ యుగంలో, పోటీ ప్రపంచంలో విద్యారంగం, ఉపాధ్యాయ వృత్తి అనేక సవాళ్ళను, ఒత్తిళ్ళను ఎదుర్కొంటున్నవి. ఉపాధ్యాయుల పని హాయిగా, జాలీగా వుంటుందని, త్వరగా ఇంటికి వస్తారని, సెలవులు ఎక్కువగా వుంటాయని చెప్పుకుంటారు. కానీ ఇటీవల ‘నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌’ అనే సంస్థ ఓ.ఈ.సి.డి దేశాల్లో చేసిన సర్వేలో ఉపాధ్యాయులే అధిక ఒత్తిడికి గురవుతున్నారని తేల్చింది. ప్రతి వంద మంది ఉపాధ్యాయుల్లో ఇరవై మంది వృత్తిపరమైన ఒత్తిడితో వున్నట్లు, ఇతర వృత్తుల వారిలో పదమూడు మందే అలా ఫీలవుతున్నట్లు చెప్పారు. సెలవుల్లో కూడా వృత్తికి సంబంధించిన పని చేయాల్సి వస్తుందని ప్రతి ఐదుగురిలో ఇద్దరు (40 శాతం) టీచర్లు చెబితే ఇతర వృత్తుల వారిలో 32 శాతం మందే చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయుల్లో చాలామంది దసరా, సంక్రాంతి సెలవుల్లో పరీక్ష పేపర్లు దిద్దడం, సీసీఈ రికార్డులు రాసుకోవడం తెలిసిందే. ఢిల్లీలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏడాదికి 310 గంటలు పరీక్షల కోసమే వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. అలాంటి అదనపు పని ఒత్తిడిని తగ్గించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది. అన్ని దేశాల్లోని, రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా ఉపాధ్యాయుల పని ఒత్తిడి తగ్గించేందుకు కృషి చేయాలి. రికార్డులు, రిపోర్టులు, పరీక్షలు మున్నగు పనులకు డిజిటల్‌ సదుపాయాలు, బోధనేతర సిబ్బందిని వినియోగించాలి. సమీక్షలు, మీటింగులు, సర్వేలు వంటి బోధనేతర పనులు తగ్గించాలి. వృత్తి ఒత్తిళ్ళను తట్టుకుంటూ ఆధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటేనే బోధనా సామర్ధ్యం పెరిగేది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో విద్యారంగ వికాసానికి తోడ్పడుతూ వృత్తి గౌరవాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయుల స్వయంకృషి ఇనుమడించాలి. ‘ఏ వృత్తి అయినా ‘అప్‌ డేట్‌’ అవుతుంటూనే సమాజంలో తన అవసరాన్ని, హోదాని నిలబెట్టుకుంటుంద’నే ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య సందేశం సత్యం. ఈ గురుతర బాధ్యతను ఈ తరం యువతరం ఉపాధ్యాయులు స్వీకరించాలని 2019 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ సందేశం.

RELATED ARTICLES

Latest Updates