ఏడుగురు చిన్నారులపై ఉపాధ్యాయుల వికృత చేష్టలు
నిందితులకు 14 రోజుల రిమాండ్
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే.. అభంశుభం తెలియని చిన్నారుల పట్ల పైశాచికంగా ప్రవర్తించారు. పవిత్రమైన వృత్తికి కళంకం తెచ్చారు. విశాఖపట్నం పరిధి పెద్దిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులపై ఉపాధ్యాయుల అసభ్య ప్రవర్తనకు సంబంధించి గురువారం పోలీసులు లోతుగా విచారించారు. ఈ క్రమంలో మరో అయిదుగురు బాలికలపైనా వీరు వికృత చేష్టలకు పాల్పడినట్లు తేలింది. 3, 4 తరగతులు చదువుతున్న ఇద్దరు బాలికలపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుడే వెంకటేశ్వరరావు, సహ ఉపాధ్యాయుడు సూడి సుందరరావు బుధవారం పాఠశాలలో అసభ్యంగా ప్రవర్తించిన విషయం వైద్య బృందం ద్వారా వెలుగుచూసింది. ఈ మేరకు నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేయగా డీఈవో లింగేశ్వరరెడ్డి వీరిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఘటనపై గురువారం పోలీసులు దర్యాప్తు చేయగా మరో అయిదుగురు విద్యార్థినులపైనా వీరు దాష్టీకం ప్రదర్శించినట్లు వెలుగులోకి వచ్చింది.
మాటల్లో చెప్పలేనంతగా…
దారుణానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ సెల్ ఏసీపీ-1 టి.త్రినాథ్ మాట్లాడుతూ.. బాధిత విద్యార్థినులను విచారించినపుడు మాటల్లో చెప్పలేని విధంగా వారు వేధింపులకు గురైనట్లు తేలిందన్నారు. చిన్నారులకు సంబంధించి అసభ్యకర చిత్రాలు, వీడియోలు తీసినందున నిందితులు ఇద్దరి ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, వాటిని అమరావతిలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తామని చెప్పారు. వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, చిన్నారులపై లైంగిక వేధింపులు(పోక్సో చట్టం), బెదిరింపులకు సంబంధించిన సెక్షన్లు నమోదుచేసి, భీమిలి కోర్టులో గురువారం ప్రవేశపెట్టగా.. నిందితులిద్దరికీ ఈనెల 29 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించిందన్నారు.
మరోవంక.. జరిగిన ఘటనపై పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పందిస్తూ ఇదెంతో శోచనీయమంటూ దిగ్భ్రాంతి ప్రకటించారు. నిందితులపై శాఖాపరంగా కఠిన చర్యలు మొదలయ్యాయన్నారు.
(Courtacy Eenadu)