–సీబీఐతో విచారణ : తమిళనాడు సీఎం
చెన్నై : తమిళనాడులోని తూత్తుకూడి సమీపాన సాతాంకుళంలో పోలీసుల కస్టడీలోని తండ్రీ కొడుకుల హత్య కేసు విచారణను కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ)కి అప్పగిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదివారం ప్రకటించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ తమ మొబైల్ దుకాణాన్ని తెరిచిఉంచారనే ఆరోపణలతో ఈ నెల 19న అరెస్టయిన వీరు నాలుగురోజుల తరువాత మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు కక్షపూరితంగానే అక్రమ కేసులు బనాయించి వీరిని అమానవీయ రీతిలో హింసించి చంపేశారని వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి. ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టిన పోలీసులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పౌర హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే..
జున్ 19 సాయింత్రం 62 ఏండ్ల పి జయరాజ్ తన మొబైల్ షాప్లో పని చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. నిర్ధేశించిన సమయం కంటే ముందుగానే దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారంటూ మాటమాత్రంగా వాపోవడమే జయరాజ్ చేసిన నేరం. తండ్రిని పొలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్తుంటే 32 ఏండ్ల జె బెన్సిక్స్ వారి వెంట వెళ్లారు. పోలీస్స్టేషన్లోకి వెళ్లివెళ్లగానే జయరాజ్ను పోలీసులు చితకబాదారు. తన తండ్రిపై దాడి చేస్తున్న ఒక పోలీసు అధికారిని
బెన్నిక్స్ అడ్డుకున్నాడు. ఆ ఆఫీసర్ను వెనక్కి తోశాడు. ఇది పోలీసులను రెచ్చగొట్టింది. ఈ తరువాత తండ్రీకొడుకులను గంటల తరబడి కొట్టారు. ఇందులో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు కానిస్టేబుళ్లుతో సహా 13 మంది పాల్గొన్నారు. వీరిలో ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్గా పేర్కొనే వాలంటీర్లు కూడా ఉన్నారు.
తరువాత రోజున జయరాజ్, బెన్నిక్స్ను చూడటం కోసం వారి బంధువులు పోలీస్స్టేషన్ బయట అర్థరాత్రి వరకూ వేచి ఉన్నారు. చివరికి తెల్లవారుజామున ‘దారుణమైన స్థితి’లో తండ్రి కొడుకులు కనిపించారు. జయరాజ్ పంచె, బెన్నిక్స్ ప్యాంటు పూర్తిగా రక్తంతో తడిచిపోయి వున్నాయి. సాతాంకుళం ప్రభుత్వాస్పత్రికి తండ్రికొడుకులను తరలించారు. వీరికి విపరీతంగా రక్త స్రావం అవుతుంటంతో లుంగీలు మారుస్తునే ఉన్నారు. వీరి కోసం ‘డార్క్ కలర్ లుంగీలు’ తీసుకుని రావాలని బంధువులను పోలీసులు అడిగారు. ఆస్పత్రిలో మూడు గంటల ఉన్న తరువాత వీరిని సాతాంకుళం మేజిస్ట్రేట్ కోర్టుకు తీసుకుని వెళ్లారు. అక్కడ భవనం బయట పోలీసుల బృందం నులుచుండగా, మొదటి అంతస్తు నుంచి మేజిస్ట్రేట్ చేయి ఊపారు. ( ఈ దృశ్యానికి జయరాజ్ బావమరిది జోసెఫ్ సాక్షి) కొన్ని క్షణాల తరువాత అక్కడి నుంచి వారిని కోవిల్పట్టి సబ్ జైల్కు రిమాండ్కు తీసుకుని వెళ్లారు. ఈ తరువాత నుంచి కుటుంబ సభ్యులకు వారి జాడ తెలియదు.
జూన్ 22న సాయింత్రం వీరిని సమీపంలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొన్ని గంటల తరువాత బెన్నిక్స్ మృతి చెందగా, జూన్ 23 తెల్లవారు జామున జయరాజ్ మృతి చెందాడు. ఆగకుండా రక్తస్రావం కావడం, అంతర్గత, బహిర్గత అవయావాలకు గాయాలతోనే వీరు మృతి చెందినట్టు చెబుతున్నారు. బాధిత కుటుంబానికి తమిళనాడు భ్రుత్వం రూ. 20 లక్ష పరిహారం ప్రకటించింది. తూతుకుడి ఎంపీ కనిమొళి రూ 25 లక్షలు పరిహారం ప్రకటించారు.
తండ్రికొడుకుల మృతికి మతకోణం ఏమీ లేదని చెబుతున్నారు. పోలీస్ పెట్రోల్ టీమ్పై జయరాజ్ విమర్శలు చేయడం, తండ్రిని కొట్టవద్దంటూ పోలీసు అధికారిని బెన్నిక్స్ తోయడమే వారి మృతికి కారణమని భావిస్తున్నారు. అసలే బ్రిటీష్ కాలం నుంచి లాక్అప్ హింసలకు తమిళనాడు పోలీసులు అపఖ్యాతి పాలయ్యారు. అనేక సందర్భాల్లో పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తుల ఫోటోలు విడుదల చేసినప్పుడు వారి కాళ్లు, చేతులు విరిగి ఉంటాయి. ‘బాత్రూమ్లో జారిపడ్డారు’ అని వివరణ ఇస్తుంటారు.
తండ్రికొడుకుల మృతికి న్యాయవ్యవస్థ వైఫల్యం కూడా కారణంగా చెబుతున్నారు. గాయాలు, రక్తస్రావం గురించి మేజిస్ట్రేట్ తనిఖీ చేయాలని, అది అతని పని అనీ, నిందితులను రిమాండ్ చేయడానికి బదులు పోలీసులను ప్రశ్నించాలని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కేసులో మేజిస్ట్ట్రేట్ను బాధ్యతల నుంచి తొలగించాలని అంటున్నారు.
ఐలూ ఖండన
లాకప్ హింసతో తండ్రికొడుకులు మృతి చెందిన ఘటనను అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలూ) తీవ్రంగా ఖండించింది. మానవ హక్కులను ఉల్లంఘించే హక్కులను కోవిడ్ లాక్డౌన్ నిబంధనలు, విపత్తు నివారణ చట్టం పోలీసులకు ఇవ్వలేదని తీవ్రంగా వ్యాఖ్యానించింది. బాధితుల గాయాల గురించి విచారించడం మేజిస్ట్రేట్, వైద్యుల విధి అని పేర్కొంది.
మానవ హక్కులను ఉల్లంఘించడం తమిళనాడు పోలీసులకు కొత్త కాదని తెలిపింది. స్టెర్లిట్కు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నవారిపై కాల్పులు జరిపారనీ, 2018లో తమిళనాడులో 76 లాకప్ మరణాలు సంభవించాయని గుర్తు చేసింది. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు
తండ్రీకొడుకులు మృతి ఘటనపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన ఆర్మీ రిజర్వ్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. చెన్నై జిల్లాకు చెందిన సతీష్ ముత్తు అనే కానిస్టేబుల్ ‘పోలీసులు సమయనం పాటించాలి, ప్రజల్ని కొట్టకూడదు’ అని వ్యాఖ్యలు చేశారు. దీంతో విచారణ కోసం సమన్లు జారీ చేశారు.
Courtesy: NT