సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసును సుప్రీంకోర్టు సీబీఐకి బదిలీచేసింది. ఈకేసులో సేకరించిన సాక్ష్యాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను ఆదేశించింది. సుశాంత్ కేసు విచారణలో భాగంగా బిహార్ పోలీసుల తీరును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన సుశాంత్ తండ్రి న్యాయం కోసం పట్నాలో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం కూడా సరైన చర్యేనని సమర్థించింది. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలన్న బిహార్ డిమాండ్ సమంజసమేనని అభిప్రాయపడింది.
‘‘ఎలాంటి ఊహాగానాలకు ఆస్కారంలేకుండా నిష్పాక్షికమైన, సమర్థవంతమైన విచారణ జరపడం ఎంతైనా అవసరం’’ అని పేర్కొంది. తనపై పట్నాలో దాఖలైన ఎఫ్ఐఆర్ను ముంబైకి బదిలీచేయాలన్న సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి వ్యాజ్యంపై వాదనలు విన్న జస్టిస్ హృషికేశ్ రాయ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం 35 పేజీల తీర్పును వెలువరించింది కాగా, కేసును సీబీఐకి అప్పగించాలన్న బిహార్ పోలీసుల అభ్యర్థనను సుప్రీం సమర్థించడం ద్వారా న్యాయం గెలిచినట్టయిందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు. తీర్పుతో సుశాంత్ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో కలుగుతుందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ చెప్పారు.
Courtesy Andhrajyothi