ముంబై: బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ఫుత్ (34) ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయి లోని బాంద్రాలో తన నివాసంలో ఆదివారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించపోవడంతో ఆత్మహత్యకు సరైన కారణాలు ఏమిటో తెలియరాలేదు. అయితే గత కొన్ని నెలలుగా తీవ్ర మానసిక వేదనకు గురైనట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. సుశాంత్ ఆకాల మరణం పట్ల యావత్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
సుశాంత్సింగ్ రాజ్ఫుత్ పాట్నాలో జన్మించారు. ఆయన సోదరి మిథు సింగ్ రాష్ట్ర స్థాయిలో క్రికెటర్. మరో ముగ్గురు అక్కలున్నారు. 2002లో సుశాంత్ తల్లి చనిపోవడంతో ఆయన కుటుంబం ఢిల్లీకి షిప్ట్ అయ్యారు. ‘ఎఐఇఇఇ’లో 7వ ర్యాంక్ సాధించారు. ఢిల్లీ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. కానీ నటనపై ఉన్న ఆసక్తితో ఇంజనీరింగ్ చివరి ఏడాది చదువు మానేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ షియామాక్ ధావర్ దగ్గర సుశాంత్ డాన్స్లో శిక్షణ తీసుకున్నారు. ఆ శిక్షణలో భాగంగానే నటుడిగానూ అవకాశాల కోసం ప్రయత్నించారు. తొలి అవకాశంగా వచ్చిన ‘మంచ్’ ప్రకటనతో సుశాంత్కి మంచి గుర్తింపు వచ్చింది. అలాగే 2008లో బాలాజీ టెలీ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ‘కిసీ దేశ్ మై హై మేరా దిల్’ సీరియల్లోనూ ప్రధాన భూమిక పోషించే అవకాశం వచ్చింది. 2009లో ‘పవిత్ర రిస్తా’తో ఉత్తమ నటుడిగా బుల్లితెర అవార్డును సొంతం చేసుకున్నారు. అలాగే పలు డాన్స్ షోల్లో కూడా తనదైన శైలిలో వీక్షకుల్ని మెప్పించారు.
బుల్లితెర నటుడిగా కెరీర్ని ఆరంభించిన సుశాంత్ 2013లో విడుదలైన ‘కై పో చీ’ చిత్రంతో బాలీవుడ్ వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘పీకే’, ‘డిటెక్టివ్ బైకేశ్ భక్షి’ తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎం.ఎస్.ధోని జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఎం.ఎస్.ధోని : ది అన్టోల్డ్ స్టోరీ’ చిత్రంతో ఒక్కసారిగా యావత్ దేశాన్ని ఆకర్షించారు. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత నటించిన ‘రాబ్తా’, ‘వెల్కమ్ న్యూయార్క్’, ‘కేదార్నాథ్’, ‘సొంచిరియా’, ‘చిచ్చోరే’, ‘డ్రైవ్’ చిత్రాల్లోని విలక్షణ పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘దిల్ బేచారా’ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. మంచి సినిమాలతో కెరీర్ ఇప్పుడిప్పుడే సక్సెస్ బాటలో పడుతున్న తరుణంలో సుశాంత్ తన జీవితానికి అర్థంతరంగా ముగింపు పలకడం విచారకరం.
ఇదిలా ఉంటే, ఈ నెల 3వ తేదీన తన తల్లితో తనకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఓ భావోద్వేగభరిత వ్యాఖ్యను జత చేశారు. ‘కన్నీళ్ళతో తన గతాన్ని మరిచి.. చిరునవ్వుతో కలలను సాకారం చేసుకోవాలనుకుంటూ.. ఇలా ఈ రెండింటి మధ్య చిన్న జీవితాన్ని గడిపింది. ఆమె మా అమ్మ’ అని ట్వీట్లో పేర్కొన్నారు. సుశాంత్ సింగ్ రాజ్ఫుత్ మృతిపట్ల ఆయన అభిమానులే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న చిత్ర పరిశ్రమ ప్రముఖులు, రాజకీయనాయకుడు, క్రీడాకారులు సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేస్తూ సంతాపాలు ప్రకటించారు.
‘అద్భుతమైన యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ఫుత్ త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. టెలివిజన్, సినిమాల్లో ఆయన నటన అద్భుతం. వినోద ప్రపంచంలో ఆయన ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకం. మరిచిపోలేని చక్కని ప్రదర్శనలను మనకు విడిచి ఆయన వెళ్ళిపోయారు. ఆయన చనిపోయారన్న వార్త విని షాకయ్యా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓంశాంతి’ అని సుశాంత్ సింగ్ రాజ్ఫుత్ మృతి పట్ల దేశ ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.