రుణ సదుపాయాన్ని కల్పించి.. నిలబెట్టాలి
– సంస్థ ఆస్తులను విక్రయించే నిర్ణయాన్ని విరమించుకోవాలి
– కార్మిక సంఘాల డిమాండ్
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ టెలికాం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్)కు రుణ సదుపాయం కల్పించి సంస్థను ఆదుకోవాలని కార్మిక సంఘాలు మోడీ సర్కారును డిమాండ్ చేశాయి. సంస్థ ఆస్తులను విక్రయించే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలియ జేశాయి. బీఎస్ఎన్ఎల్ ఆస్తులు అమ్మడమంటే ప్రజా ధనాన్ని కొల్లగొట్టడమేనని, గతంలో విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ విషయంలో అప్పటి సర్కారు అనుసరించిన పంథానే బీఎస్ఎన్ఎల్ విషయంలో నేటి సర్కారు కొనసా గిస్తున్నదని విమర్శించాయి. బీఎస్ఎన్ఎల్కు రుణాన్ని కల్పిం చడం కోసం ప్రత్యేకంగా ఒక మెకానిజం ఉండాలని సూచిస్తూ.. సంస్థను పునరుజ్జీవనం చేసేందుకు కార్మిక సంఘాలు ఒక ప్రణాళికను రూపొందించాయి.
బీఎస్ఎన్ ఎల్పట్ల మోడీ సర్కారు అవలంబిస్తున్న ఉదాసీన వైఖరిని నిరసిస్తూ బుధవారం బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూని యన్ (బీఎస్ఎన్ఎల్ఈయూ) నేతృత్వంలో కార్మికులు ప్రదర్శన నిర్వహించారు.
బీఎస్ఎన్ఎల్ సొంతంగా నిర్వహణ వ్యయం, కేటగిరీ ఖర్చులను భరించే స్థాయిలో లేదు కాబట్టి.. సంస్థకు రుణం సులువుగా లభించేందుకు ప్రత్యేక నిర్మాణం ఉండాలని బీఎస్ఎన్ఎల్ఈయూ డిప్యూటీ సెక్రెటరీ స్వపన్ చక్రవర్తి అన్నారు. కంపెనీకి అవసరమైనవాటిని కొనుగోలు చేసేం దుకు మేనేజ్మెంట్ అనుమతినివ్వడం లేదని తెలి పారు. దీంతో మంచి ప్రదర్శన కనబరిచే సర్కిళ్లూ నష్టాల్లో కూరుకు పోతున్నాయని వివరించారు. 19ఏండ్లుగా లాభాల్లో దూసు కెళ్లిన కేరళ సర్కిల్ నేడు కార్మికులకు వేతనాలిచ్చేందుకు నిధు ల్లేక సతమతమవుతున్నదని తెలిపారు. అందుకే బీఎస్ ఎన్ఎల్ను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. 2000లో కేంద్ర మంత్రివర్గం బీఎస్ఎన్ఎల్ను ఆర్థికంగా ఆదుకుంటామని రాతపూర్వక హామీనిచ్చిందని గుర్తు చేస్తూ.. ఆ హామీని కేంద్రం నిలబెట్టుకోవాలని చెప్పారు.
వేతనాలను కారణంగా చూపడం సరికాదు
ఖర్చులు తగ్గించుకునే పేరుతో ఇప్పటికే 30శాతం కాంట్రాక్టు కార్మికులను తొలగించాలని మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. స్వచ్ఛంద రాజీనామా పథకం(వీఆర్ఎస్)ను కేంద్రం ప్రతిపాదించింది. వీఆర్ఎస్ పేరిట కార్మికుల బెనిఫిట్లకు కోత పెడుతున్నదని, అదీగాక, రాజీనామా వయసును 60 ఏండ్ల నుంచి 58కు తగ్గించిందని సపన్ చెప్పారు. ఇవన్నీ బీఎస్ఎన్ఎల్ను ‘ప్రయివేటు’కు కట్టబెట్టే వ్యూహంలో భాగమేనని విమర్శించారు. ఖర్చులు తగ్గించే పేరుతో ఉద్యోగులను తొలగించడాన్ని నిరసిస్తూ.. వేతనాలకు కేటాయింపులు పెరగడం కాదు.. తగ్గాయి అని చెప్పారు. అదీ ప్రభుత్వ విధానాల వల్లనే రాబడి తగ్గిందన్నది సుస్పష్టమని తెలిపారు. బీఎస్ఎన్ఎల్ ప్రభుత్వ శాఖ నుంచి కంపెనీగా మార్చినప్పుడు 3.5లక్షల ఉద్యోగులుండగా.. ఇప్పుడు 1.68 లక్షల ఉద్యోగులున్నారని వివరించారు. కాబట్టి, కార్మికుల వేతనాలను కారణంగా చూపడం తప్పుదారి పట్టించడమేనని అన్నారు. కార్మికులతోపాటు.. సంస్థ ఆస్తులపైనా సర్కారు కన్నేసింది. బీఎస్ఎన్ఎల్కు చెందిన 23 స్థలాలను గుర్తించి అమ్మేందుకు నిర్ణయించారని, కార్పొరేట్ లెక్కల ప్రకారం భూవిలువనూ గణించారని సపన్ అన్నారు. అసలు విలువ కంటే ఈ ధరలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు.
బీఎస్ఎన్ఎల్ను అమ్మేసే ప్యాకేజీ
బీఎస్ఎన్ఎల్ను సంస్కరించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికను రచిస్తున్నామని కేంద్రం చెబుతూ వస్తున్నది. బీఎస్ఎన్ఎల్ కార్మిక యూనియన్లూ సంస్థను కాపాడుకునేందుకు అనేక ప్రణాళికలను సూచించాయి. అందులో 4జీ స్పెక్ట్రం కేటాయించాలనే ప్రతిపాదనా ఉన్నది. కానీ, ఇప్పటివరకు కేంద్రం అటువైపుగా అడుగులు వేయలేదు. కాగా, దీనిపై గతనెల 24న కేంద్ర సమాచార మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. బీఎస్ఎన్ఎల్ నుంచి ఈ ప్రతిపాదన అందిందని, టెలికమ్యూనికేషన్ శాఖ పరిశీలిస్తున్నదని తెలిపారు. ప్రయివేటు కంపెనీలు 5జీకి మారుతున్న నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ 4జీ ప్రతిపాదనను కేవలం పరిగణనలోకి తీసుకున్నదని మంత్రి చెప్పడం గమనార్హం. సంస్థను సంస్కరించే ప్యాకేజీపై స్వపన్ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ, ఏమిటా ప్యాకేజీ? సర్కారు తీసుకొచ్చే ప్యాకేజీ బీఎస్ఎన్ఎల్ను ఉద్దరించేందుకు కాదు.. దాన్ని అమ్మేందుకే’నని అన్నారు.
Courtesy navatelangana