తుంపర్ల ద్వారా వ్యాపించే కొవిడ్-19.. 4 నుంచి 14 రోజుల్లో బయటపడొచ్చు
శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి ప్రమాదం.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ముప్పు
గర్భిణులు, పిల్లలు, వృద్ధులు జర భద్రం
హైదరాబాద్ సిటీ : ప్రస్తుతం మనకు వేసవి సీజన్ వచ్చేసినట్టే. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానురానూ ఎండలు ఇంకా ముదురుతాయి. ఉష్ణ వాతావరణంలో వైర్సలు మనుగడ సాగించలేవని చాలామంది నమ్మకం. కానీ, ఇది గాలిలో స్వైరవిహారం చేసే తరహా వైరస్ కాదని.. డ్రాప్లెట్ వైరస్ అని.. వాతావరణంతో సంబంధం లేకుండా బాధితులు తుమ్మినా, దగ్గినా వారి ముక్కు నుంచి వచ్చే స్రావాల తుంపర్ల ద్వారా, లాలాజలం ద్వారా వ్యాపిస్తుందని ఛాతీ ఆస్పత్రి సూపరింటెండెంట్, సీనియర్ పల్మనాలజిస్టు డాక్టర్ మహబూబ్ఖాన్ తెలిపారు. బాధితులు తుమ్మినా, దగ్గినా.. వారికి అర మీటరు నుంచి 2 మీటర్ల దూరంలోపు ఉన్నవారికి ఈ వైరస్ సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఒకరి నుంచి మరొకరికి త్వరగా విస్తరిస్తుంది. బాధితులు ఎంత మందిని కలిస్తే అంత మందిలో వైరస్ లక్షణాలు ఉండే అవకాశముంది.
ఇతర వ్యాధులుంటే..
న్యూమోనియా, టీబీ, హెచ్ఐవీ, ఆస్తమా, మధుమేహం, రక్తహీనత వంటివాటితో బాధపడేవారికి, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి కొవిడ్-19 సోకితే ముప్పు ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు, గర్భిణులు, వృద్ధుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి.. వారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
వెంటనే పరీక్షలు..
ఈ వైరస్ సోకిన తరువాత లక్షణాలు బయట పడడానికి 4 నుంచి 14 రోజుల సమయం పడుతుంది. ఆ సమయంలో వ్యాధి లక్షణాలు బయట పడకపోవచ్చు. కానీ.. అప్పుడు ఆ వైరస్ మరొకరికి వ్యాపిస్తుంది. కాబట్టి.. దగ్గు, జలుబు, జ్వరం, ఆయాసం వంటి లక్షణాలు ఉంటే ఎవరికి వారే ఇతరులకు దూరంగా ఉండాలని, బయట తిరగొద్దని వైద్యులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులను కూడా కలవకుండా ఒక గదిలో గృహ నిర్బంధం తరహాలో ఉండడం మంచిదని చెబుతున్నారు. వైరస్ సోకినవారికి దగ్గరగా మసలినట్టు అనుమానం ఉంటే ముందే జాగ్రత్త పడాలని, వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. వైరస్ సోకినట్టు నిర్ధారణ అయినప్పటికీ భయపడాల్సిన పని లేదని.. తగిన చికిత్సతో నయం చేయవచ్చని భరోసా ఇస్తున్నారు.
తుంపర్లు పడిన వస్తువులను తాకినా..
కరోనా వైర్సకు ఏ కాలంలోనైనా వ్యాపించే గుణం కనిపిస్తోంది. బాధితులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వారి నుంచి వెలువడిన తుంపర్లు.. అక్కడ ఉండే వస్తువులపై పడితే ఆ వస్తువులను తాకినవారికి కూడా వైరస్ సోకుతుంది. ఎవరికైనా ఈ వైరస్ సోకిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వారికి రోగ నిరోధక శక్తిని పెంచే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆయాసం, న్యుమోనియా, ఊపిరితిత్తుల జబ్బులు ఉంటే వాటిని నయం చేసే చికిత్స అందించాలి. ఇతర అవయవాలపై వైరస్ ప్రభావం పడకుండా చూడాలి.
డాక్టర్ శ్యామలా
అయ్యంగార్, అపోలో ఆస్పత్రి
Courtesy ANdhrajyothi