అందుకు మీడియాను అనుమతించాలా?
విభజిత ఎజెండాతో దేశానికి చేటు
సుదర్శన్ టీవీ కేసులో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
దిల్లీ: ప్రభుత్వ సర్వీసుల్లో ముస్లింల చొరబాటు వెనుక పెద్ద కుట్ర ఉందంటూ ‘బిందాస్ బోల్’ కార్యక్రమాన్ని రూపొందించిన ‘సుదర్శన్’ ఛానల్పై సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఆ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఉందని పేర్కొంది. కథనాలను ప్రసారం చేసే అధికారం ఛానల్కు ఉందని.. కానీ వాటి ద్వారా ఒక వర్గం మొత్తానికి ఒక ముద్ర వేసి..వారిని సమాజానికి దూరం చేసే అధికారం లేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. తదుపరి ఉత్తర్వులిచ్చేవరకు కార్యక్రమంలోని మిగతా భాగాలను ప్రసారం చేయొద్దని సెప్టెంబర్ 15న ఉత్తర్వులిచ్చిన జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.
దీనిపై శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుదర్శన్ ఛానల్ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సివిల్ సర్వీసులోకి చేరిన ముస్లింలను చూపిస్తూ.. పక్కనే ఐసిస్ వీడియోలను చూపించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘‘సివిల్ సర్వీసులో ముస్లింలు చేరడమే ఒక కుట్రగా మీరు చెబుతున్నారు. ఇలా వర్గాలను లక్ష్యంగా చేసుకునేందుకు మీడియాకు అనుమతివ్వాలా’’ అని ధర్మాసనం.. సుదర్శన్ ఛానల్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ను ప్రశ్నించింది. ‘‘ఒక ఎజెండాతో సివిల్ సర్వీసుల్లో చేరుతున్నారనడంలోనే ఎంత ద్వేషం ఉందో అర్థమవుతోంది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ఒక వర్గంలోని ప్రతి సభ్యుడిపైన మీరు ముద్ర వేయలేరు. ఈ విబ¡జిత ఎజెండాతో ఆ వర్గంలోని మంచి సభ్యులను మీరు సమాజానికి దూరం చేస్తున్నారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఉగ్రవాద సంస్థల నిధులు అందుతున్నాయంటూ చేసిన కథనంపై కోర్టుకు ఎలాంటి అభ్యంతరం లేదని.. ఆ పేరుతో ముస్లింలంతా ఒక ఎజెండాతో సివిల్ సర్వీసుల్లో చేరుతున్నారడనం సహేతుకం కాదంది. అత్యయిక స్థితి రోజులను ధర్మాసనం గుర్తుచేసింది. ‘‘ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోకూడదన్న సందేశం మీడియాకు వెళ్లాలి. ఏకత్వమూ, భిన్నత్వమూ కలగలిసిన దేశ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. విద్వేష ఎజెండాతో దేశానికి నష్టమన్న సందేశం మీడియాకు వెళ్లాలి. అందుకు ఏం చేయాలో మీరే చెప్పండి. పాత్రికేయ అంశాల జోలికి మేం రావాలనుకోవడం లేదు. అత్యయిక స్థితిలో ఏం జరిగిందో మాకు తెలుసు. మేం వాక్స్వాతంత్య్రాన్ని, కొత్త ఆలోచనల వ్యక్తీకరణను కోరుకుంటాం.’’ అని ధర్మాసనం పేర్కొంది. ధర్మాసనం పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రమాణ పత్రం దాఖలు చేస్తామని సుదర్శన్ ఛానల్ న్యాయవాది దివాన్ చెప్పారు. సివిల్ సర్వీసు పరీక్షలకు సిద్ధమవుతున్న ముస్లిం అభ్యర్థులకు సాయం అందిస్తున్న జకత్ ఫౌండేషన్కు ఉగ్రవాద సంస్థల నుంచి నిధులు అందుతున్న విషయాన్ని దివాన్ కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు.దీన్ని ఆ ఫౌండేషన్ న్యాయవాది ఖండించారు. ముస్లింలకే కాకుండా, ఇతర వర్గాలకూ తాము సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు కోర్టు విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ సుదర్శన్ టీవీ మరో పిటిషన్ దాఖలు చేసింది.
Courtesy Eenadu