ఎస్సీ రిజర్వేషన్లలో 50 శాతాన్ని వాల్మీకి, మజ్బీ కులస్థులకు కేటాయిస్తూ 2006లో పంజాబ్ ప్రభుత్వం చట్టం చేయగా దాన్ని అక్కడి హైకోర్టు కొట్టేసింది. దాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకెక్కింది. గత పదేళ్లుగా ఈ కేసు తేలలేదు.
2004 నాటి తీర్పును పునఃపరిశీలించాలి.. చీఫ్ జస్టిస్కు సుప్రీం ధర్మాసనం నివేదన
ఏ వెనుకబడ్డ వర్గానికైనా ప్రాధాన్యం ఇవ్వొచ్చు.. మిగిలిన కులాలకు నష్టం జరగరాదు
రిజర్వేషన్ ఫలాలు దిగువకు చేరట్లేదు.. ఫలితంగా సామాజిక అసమానతలు
ప్రయోజనం దక్కని కులాలు జీవితాంతం అలానే మిగిలిపోవాలా?
క్రీమీ లేయర్పై సమీక్ష జరగాలి.. ఐదుగురు సభ్యుల బెంచ్ తాజా తీర్పు
ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడ్డ వర్గాల్లో చాలా అసమానతలు ఉన్నాయి. రిజర్వేషన్ ఫలాలు కిందిస్థాయి వారి వరకూ చేరట్లేదు. అట్లాంటి వారికి రిజర్వేషన్లు కల్పించి పైకి తీసుకురావడానికి రాష్ట్రప్రభుత్వాలకు ఉన్న అధికారాన్ని కాదనలేం. సమానత్వం తీసుకువచ్చేందుకు ఉపవర్గీకరణ జరపవచ్చన్నది మా అభిప్రాయం. ఎస్సీల్లోని కొన్ని సంపన్న శ్రేణి కులాలు మొత్తం రిజర్వేషన్లను ఎగరేసుకుపోయి తామే అనుభవిస్తుంటే అది సామాజిక అసమానతకు దారితీస్తున్నట్లే. ఆకలితో ఉన్న ప్రతి మనిషికీ అన్నం పెట్టాల్సిందే. ఏకజాతి వారన్న నెపంతో బలవంతులు, సంపన్న శ్రేణి వారికి మాత్రమే మొత్తం రిజరేషన్ ఫలాలు అందివ్వరాదు.
రిజర్వేషన్లలోనే అసమానతలా?
- రిజర్వేషన్ల లక్ష్యం అసమానతలు తొలగించడమే. అలాంటిది కల్పించిన రిజర్వేషన్లలోనే అసమానతలా?
- రాజ్యాంగం ఈ అసమానతలను తొలగించి అందరి కన్నీళ్లు తుడవాలి.
- రిజర్వేషన్ ఫలాలు జాబితాలోని అతి పేద వర్గాలకు ఇంకా తీరని కలే.
- జాబితాలో ఉన్న వారి మధ్యే డిమాండ్లు, ఘర్షణలు సాగుతున్నాయి. రిజర్వేషన్లు వారసత్వంగా కొందరికే లభిస్తున్నాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
- పారిశుద్ధ్య పని చేసే కులాల వారు రిజర్వేషన్ల జాబితాలో ఉన్నా వారికి నేటికీ ఫలితాలు అందడం లేదు.
న్యూఢిల్లీ : విద్యా ప్రవేశాలు, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి ఎస్సీ ఎస్టీలను ఉపవర్గీకరించరాదంటూ 2004లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అంతేకాక.. దేశ సమాఖ్య వ్యవస్థ దృష్ట్యా.. ఎస్సీ ఎస్టీలను వర్గీకరించి, వారిలో వెనుకబడ్డ కులాల వారికి రిజర్వేషన్ కల్పించే అధికారం రాష్ట్రాలకు ఉందని తాజాగా తేల్చిచెప్పింది. ఇన్నాళ్లూ ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించిన వర్గీకరణ అధికారం పార్లమెంట్కు మాత్రమే ఉండేది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ అధికారం లేదని 2004లో ‘ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ’ కేసులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది.
తాజాగా… పంజాబ్కు చెందిన ఓ కేసు విషయంలో – జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని మరో ఐదుగురు సభ్యుల ఽధర్మాసనం ఆనాటి తీర్పుతో విభేదించింది. రెండూ ఐదుగురు సభ్యుల బెంచ్లే కాబట్టి తాజాగా బెంచ్ ఇచ్చిన తీర్పు తక్షణం అమలు కాదు. ఈ కీలకాంశ పరిశీలనను విస్తృత ధర్మాసనం చేపట్టాలని కోరుతూ- కేసును చీఫ్ జస్టిస్ బోబ్డేకు నివేదించింది. బహుశా ఏడు లేదా తొమ్మిది మంది సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం త్వరలోనే దీనిని చేపట్టవచ్చని న్యాయవాద వర్గాలు అంటున్నాయి. దీనిపై తీర్పిచ్చిన బెంచ్- రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు జరిగిన ప్రయత్నాలకు ఊపిరులూదింది. క్రీమీ లేయర్ అంశాన్ని చర్చలోకి తీసుకొచ్చింది.
‘రాజ్యాంగంలోని 14, 15, 16, 338, 341, 342, 342ఎ అధికరణాలు ఎంతో ప్రాధాన్యం ఉన్నవి. వీటిని సరైన రీతిలో విడమర్చి చెప్పాలి. ఇందిరా సహానీ సహా ఇతర కేసుల సమయంలో ఇది జరిగింది. 2004లో చిన్నయ్య కేసును చూసిన బెంచ్ ఇచ్చిన తీర్పు సరికాదు. వాస్తవాలను గుర్తెరగకపోతే పోతే సామాజిక మార్పు జరగాలన్న రాజ్యాంగ లక్ష్యం నెరవేరదు’ అని బెంచ్ స్పష్టం చేసింది.
‘జనాభా ప్రాతిపదికన షెడ్యూల్డ్ కులాల వారికి రిజర్వేషన్లు కల్పించారు. ఈ ఎస్సీల్లో కొంత శాతం మందికి వారి వెనుకబాటుతనం కారణంగా రిజర్వేషన్లు చేరడం లేదు. ఆర్టికల్ 341(2)లో ఉన్న ఎస్సీ కులాలన్నింటికీ రిజర్వేషన్ వర్తిస్తుంది. కొన్ని కులాలకు ప్రాధాన్యం ఇచ్చి మిగిలినవాటిని విస్మరించడం తగదు. జీవితాంతం ఆ వెనుకబడిన కులాలు అలానే వెనుకబాటుతనంతోనే మిగిలిపోవాలా? ఈ రిజర్వేషన్లు అందనివారు నిరుపేదలు. కులం అంటే ఓ తరగతి ప్రజానీకం. జాబితాలోని మిగిలిన కులాలకు నష్టం జరగకుండా నిమ్నవర్గాల్లో అతి వెనుకబడ్డ కులాలను ఉపవర్గీకరించి- వారికి రిజర్వేషన్లను (పంజాబ్) కల్పించింది. ఇది సరైనదే. 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రాతిపదికగా చేసుకుని పంజాబ్ హైకోర్టు ఈ కేసును కొట్టేయడం తగదు’ అని తీర్పులో పేర్కొంది.
‘‘సామాజికంగా, విద్యా విషయకంగా వెనుకబడ్డ వర్గాల్లో వర్గీకరణ జరిపి రిజర్వేషన్లను అందించవచ్చని ఇందిరా సహానీ కేసులో ఆనాటి బెంచ్ తీర్పిచ్చింది. ఎస్సీ ఎస్టీల వ్యవహారం కూడా ఆర్టికల్ 16 కిందకే వస్తుంది కాబట్టి ఆ వర్గీకరణ అనుమతి వీరికి కూడా వర్తిస్తుంది కదా…. అన్న చర్చ జరపొచ్చు’’ అని బెంచ్ వివరించింది.
‘కొన్ని నిర్దిష్ట కులాల వారు మాత్రమే రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నట్లు అనేక నివేదికలు చెబుతున్నాయి. అస్పృశ్యత, వెనుకబాటుతనాల నుంచి బయటపడిన కులాల వారు ఇంకా రిజర్వేషన్లను పొందుతున్నారు. మరి మిగిలిన అట్టడుగు కులాల వారికి రిజర్వేషన్లు ఎలా చేరేది? ఇది వేయి వరహాల ప్రశ్న. కులం, వృత్తి (ఉద్యోగం), దారిద్య్రం.. ఇవన్నీ ఒకదానితో మరొకటి ముడివేసుకుని ఉన్నవి. రిజర్వేషన్లు అందరికీ చెందాలి. సంఖ్యాపరంగా, జీవన స్థితిగతుల ఆధారంగా కులాలను ఉపవర్గీకరించి, తగిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్రాలకున్న అధికారాన్ని కాదనలేం’’ అని స్పష్టం చేసింది.
‘‘సమానత్వం తీసుకువచ్చేందుకు ఉపవర్గీకరణ జరపవచ్చన్నది మా అభిప్రాయం. ఈ వర్గీకరణ అనేది హేతుబద్ధంగా జరగాలి. ఏ వర్గానికీ రిజర్వేషన్ సౌకర్యం అందకుండా పోరాదు. ఎస్సీల్లోని కొన్ని సంపన్న శ్రేణి (క్రీమీ లేయర్) కులాలు మొత్తం రిజర్వేషన్లను ఎగరేసుకుపోయి తామే అనుభవిస్తుంటే అది సామాజిక అసమానతకు దారితీస్తున్నట్లే. ఏకజాతి వారన్న నెపంతో బలవంతులు, సంపన్న శ్రేణి వారికి మాత్రమే మొత్తం రిజరేషన్ ఫలాలు అందివ్వరాదు’’ అని బెంచ్ తేల్చిచెప్పింది.
వెనుకబడ్డ వర్గాల రిజర్వేషన్లకు సంబంధించిన 2018లో చేసిన 102వ రాజ్యాంగ సవరణను కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ‘‘341, 342, 342ఎ అధికరణాలు ఒకే అంశానికి సంబంధించినవి. సామాజికంగా, విద్యావిషయకంగా వెనుకబడ్డ వర్గాల రిజర్వేషన్లకు సంబంధించి ఇందిరా సహానీ కేసు సమయంలో పరిశీలించినవే. అలాంటపుడు ఎస్సీ ఎస్టీల వర్గీకరణ విషయంలో విభిన్న వాదనలెలా చేస్తారు? ఆర్టికల్ 16(4), ఆర్టికల్ 342ఎ ప్రకారం- వెనుకబడ్డ వర్గాలకు ఓ పద్ధతి, ఎస్సీ ఎస్టీలకు మరో పద్ధతి అనుసరించడం సమ్మతం కాదు. ఇందిరా సహానీ కేసును పరిశీలించాక, 342ఎను 366 (24, 25, 26సీ)లను చదివాక… 2004లో ఈవీ చిన్నయ్య కేసులో నాటి రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై సమీక్ష జరగాలని భావిస్తున్నాం. దీనిని విస్తృత ధర్మాసనానికి పంపుతున్నాం’ అని జస్టిస్ మిశ్రా విశదీకరించారు.
‘‘నిరాదరణకు గురైన వర్గాలను గుర్తించి, వారి అభ్యున్నతికి తగిన చర్యలు తీసుకుని, అసమానతలు తొలగించే క్షేత్రస్థాయి బాధ్యత ప్రభుత్వాలదే. ఇందుకోసం ‘పంపిణీ న్యాయ విధానం’ ద్వారా ఉపవర్గీకరణ చేయాలి. ఉన్న రిజర్వేషన్ శాతంలోనే కొంత కేటాయించి సమన్యాయం చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది. జాబితాలోని మిగిలిన కులాలకు అన్యాయం జరగకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో వర్గీకరణ జరపొచ్చు. ఏ కులం లేదా వర్గం వివక్షకు లోనవుతోందో గుర్తించే అసలైన జడ్జి రాష్ట్ర ప్రభుత్వమే. సమాఖ్య వ్యవస్థలో పార్లమెంటు లేదా ప్రభుత్వం సామాజికంగా, విద్యాపరంగా వెనకబడ్డ వర్గాల అభ్యున్నతికి కృషిచేయాలి. రిజర్వేషన్లను కల్పించే అధికారం నిర్ద్వంద్వంగా రాష్ట్ర ప్రభుత్వాలదే’’ అని బెంచ్ విస్పష్టంగా పేర్కొంది.
Courtesy Andhrajyothi