దిల్లీ: టెన్నిస్ ఆడి శరీరం రంగు మారిపోతే నిన్నెవరూ పెళ్లి చేసుకోరంటూ తనను ఒకప్పుడు భయ పెట్టారని భారత టెన్నిస్ స్టార్ సానియామీర్జా చెప్పింది. గురువారం దిల్లీలో ప్రపంచ ఆర్థిక వేదికలో ప్రసంగిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. “మా తల్లిదండ్రులతో పాటు చుట్టాలందరూ చిన్నప్పుడు ‘టెన్నిస్ ఆడితే ఎంత నల్లగా అవుతావో తెలుసా… అలా యితే ఎవరు నిన్ను పెళ్లి చేసుకుంటారు’ అనే వాళ్లు. అప్పుడు నా వయసు కేవలం ఎనిమిదేళ్లు మాత్రమే. ఒంటి రంగు మారడం వల్ల పెళ్లి కాదని వాళ్లు అప్పుడే ఆలోచించేవాళ్లు. నేను మాత్రం ఇంకా చిన్న పిల్లనే కాదా ఇప్పుడే పెళ్లేంటి అనుకునేదాన్ని. ఒక అమ్మాయి తెల్లగా ఉంటేనే
బాగుంటుంది అనుకునే సంస్కృతి మన దగ్గర ఉంది. ఇది మారాలి. నేను క్రీడల్లో రావడాన్ని గర్వంగా భావిస్తున్నా. సింధు, సైనా నెహ్వాల్, దీపా కర్మాకర్ లాంటి ఎంతోమంది తారలు అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇప్పటికీ పురుషులతో సమానంగా మాకు అవకాశాలు రావట్లేదు. వస్తే ఇంకెంత ఎత్తుకు ఎదుగుతామో ఆలోచించండి” అని సానియా చెప్పింది.
క్రికెటర్లతో వాళ్లు వెళ్తే తప్పేంటి? : క్రికెటర్లు విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు భార్యలు, ప్రియురాళ్లను తీసుకు వెళ్లకూడదనే నిబంధనను సానియా తప్పుబట్టింది. “క్రికెటర్లు విదేశీ పర్యటనల సమయంలో భార్యలను, ప్రియురాళ్లను తీసుకెళ్లే వాళ్ల ఏకాగ్రత దెబ్బతింటుందని అంటున్నారు. ఇందులో ఏమైనా అర్ధం ఉందా? పురుషుల ఏకాగ్రత దెబ్బ తినడానికి అమ్మాయిలే కారణమా. వాళ్లు వస్తే తప్పేంటి. కోహ్లి త్వరగా ఔట్ అయితే అనుష్కశర్మను నిందిస్తున్నారు.. ఏమైనా భావ్యమా” అని సానియా ప్రశ్నించింది.
Courtesy Eenadu…