– కరోనా నేపథ్యంలో దక్షిణాసియాపై ఐరాస నివేదిక
యునైటెడ్ నేషన్స్ : కరోనా నేపథ్యంలో 2021లో దక్షిణాసియా మహిళల పేదరికం రేటు మరింత పెరగనుం దని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన తాజా నివేదిక పేర్కొంది. వచ్చే ఏడాది నాటికి అదనంగా దాదాపు 4.7 కోట్ల మంది మేర మహిళలు, బాలికలు తీవ్ర పేదరికాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించింది. కరోనాకు ముందు దక్షిణాసియాలో 2021 సంవత్సరంలో 10 శాతం ఉంటుందని అంచనా వేయగా, వైరస్ ప్రభావం నేపథ్యంలో అది 13 శాతానికి చేరే అవకాశముందని తెలిపింది. 25-34 వయసు గ్రూపు కలిగిన వారిలో తరువాతి దశాబ్దంలో పురుషుల కన్నా మహిళలే అధిక సంఖ్యలో పేదరికంలో కూరుకుపోతారని యుఎన్ వుమెన్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యున్డీపీ) తెలిపింది. దక్షిణాసియాలో లింగ పేదరికం అంతరం ఇంకా తీవ్రమవుతుందని ఫ్రమ్ ఇన్సైట్ టు యాక్షన్ జెండర్ ఈక్వాలిటీ నివేదిక పేర్కొంది.
ప్రపంచ పేదరికంలో 87 శాతం ఉన్న మధ్య, దక్షిణ ఆసియా, ఆఫ్రికా దేశాలు తీవ్ర పేదరికం పెరుగుదలను చవిచూడనున్నాయి. కరోనా వల్ల ఆయా దేశాల్లో అదనంగా వరుసగా 5.4 కోట్లు, 2.4 కోట్ల మంది ప్రజలు అంతర్జాతీయ దారిద్రరేఖకు దిగువకు దిగజారారని నివేదిక పేర్కొంది. తాజా ఆర్థిక సంక్షోభం కారణంగా పేదరికం నుంచి తప్పించుకునే అవకాశం ఉన్న కుటుంబాల్లోని మహిళలు, బాలికలు కూడా దారిద్య్రంలోకి వెళ్లే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని తెలిపింది. కరోనాకు ముందు పరిస్థితుల నేపథ్యంలో 2030 నాటికి ప్రపంచ పేద మహిళలు, బాలికల్లో 15.8 శాతం మందే దక్షిణాసియా ప్రాంతంలో నివసిస్తారని అంచనా వేయగా, వైరస్ తీవ్రత నేపథ్యంలో అది 18.6 శాతానికి చేరిందని ఐరాస నివేదిక వెల్లడించింది. 25-34 ఏళ్ల వయసు గ్రూపును పరిగణనలోకి తీసుకుంటే 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా వంద మంది పేద పురుషులతో పోల్చుకుంటే మహిళల్లో ఆ సంఖ్య 118 గా ఉంటుందని, 2030 నాటికి ఆ నిష్పత్తి పెరిగి 121కి పెరుగుతుందని తెలిపింది. దక్షిణాసియాలో ఆ సంఖ్య 129గా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. కరోనా ప్రభావం మొత్తం మీద 2021 నాటికి అదనంగా 9.6 కోట్లమందిని తీవ్ర పేదరికంలోకి నెట్టనుండగా, వారిలో 4.7 కోట్ల మంది మహిళలు, బాలికలే ఉంటారని నివేదిక అభిప్రాయపడింది. దీంతో పేదరికంలో ఉన్న మహిళలు, బాలికల సంఖ్య 43.5 కోట్లకు చేరుతుందని తెలిపింది. కరోనా నేపథ్యంలో పురుషుల కన్నా మహిళల ఉపాధి 19 శాతం అధికంగా ప్రమాదంలో పడిందని యూఎన్ వుమెన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పుంజిలే మ్లాంబో పేర్కొన్నారు.
Courtesy Nava telangana