కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలో వైక్కోమ్ అనే పట్టణం ఉంది. అక్కడి శివాలయం ముందు నాలుగు వీధుల్లో అంటరాని వారు నడవగూడదని, ఆ చుట్టుపక్కల కనిపించగూడదని ఆంక్షలుండేవి. వాటిని ఎత్తివేయాలని అక్కడి సామాజిక కార్యకర్తలు కొందరు సత్యాగ్రహం చేశారు. ప్రభుత్వం వారినందరినీ జైల్లో పెట్టింది. మరికొంత మంది కార్యకర్తలు పెరియార్ దగ్గరికి వెళ్లి విషయం వివరించారు. కేరళకు వచ్చి, తమ సత్యాగ్రహాన్ని కొనసాగించమని అభ్యర్థించారు. విషయం గ్రహించిన పెరియార్ అక్కడికి వెళ్లి సత్యాగ్రహం కొనసాగించారు. అప్పుడు ఆయన సత్యాగ్రహానికి దేశవ్యాప్తంగా గుర్తింపూ, పెద్ద ఎత్తున మద్దతు లభించాయి. పైగా విరాళాలు కూడా వచ్చాయి. పెరియార్ సత్యాగ్రహానికి వస్తున్న స్పందన చూసి, అక్కడి పాలకులు తట్టుకోలేకపోయారు. వారు వెళ్లి గాంధీజీని అభ్యర్థించారు. ఎలాగైనా ఆ సత్యాగ్రహాన్ని ఆపించమని కోరారు. వారి కోరిక మేరకు గాంధీజీ 9 మార్చి 1925న వైక్కోమ్ చేరుకుని పెరియార్ని కలిశారు. సత్యాగ్రహాన్ని విడిచి వెళ్లాలని కోరారు. దానికి పెరియార్ గాంధీజీని ఈ విధంగా ప్రశ్నించారు. ”గాంధీగారూ! సత్యాగ్రహం వదలి వెళ్లమంటున్నారు సరే – నాకు ఒక్క విషయం చెప్పండి. ఈ వైక్కోమ్ వీధుల్లో కుక్కలు వెళుతున్నాయి. పందులు, పశువులూ వెళుతున్నాయి. గాడిదలూ వెళుతున్నాయి. ఇవేవీ సత్యాగ్రహం చేసే వాటి హక్కుల్ని పరిరక్షించుకోలేదే? కానీ, మన సాటి మనుషులు మాత్రం వీధుల్లో నడవడానికి సత్యాగ్రహాలు చేయాలా? పైగా సత్యాగ్రహం వదిలేసి వెళ్లమని మీ లాంటివారు చెప్పాలా? ఇదేమైనా బావుందా? కొంచెం ఆలోచించండి!” జవాబు చెప్పలేని గాంధీజీ కొంతసేపు మాట్లాడలేదు. తర్వాత మళ్లీ అన్నారు. ”ఇవ్వాళ వీధుల్లో తిరగనిస్తే, రేపు గుళ్లోకే వస్తామంటారేమో – అప్పుడెలా?” అని! మహాత్ముడిగా పిలవబడుతున్న గాంధీజీ కచ్చితంగా దళితవ్యతిరేకి అనే విషయం పెరియార్కి స్పష్టమైంది. అదే విషయం బహిరంగంగా కూడా ప్రకటించారు. చివరికి ఎలాగైతేనేం? వైక్కోమ్ వీధుల్లో శూద్రులు, దళితులు స్వేచ్ఛగా తిరిగే హక్కును పెరియార్ సాధించి పెట్టారు. అది దక్షిణ భారతదేశంలో తొలి మానవ హక్కుల విజయంగా చరిత్ర పుటలకెక్కింది.
దేశంలో అధిక సంఖ్యాకులైన బహుజనుల పట్ల కాంగ్రెస్ పార్టీకి సరైన విధానమేదీ లేదని, దానితో విభేదించి పెరియార్ బయటికి వచ్చారు. ‘ద్రావిడార్ కజగం’ స్థాపించారు. ద్రవిడ ఉద్యమానికి బీజం వేశారు. అది ‘స్వాభిమాన ఉద్యమ’మని (SELF RESPECT MOVEMENT) ప్రకటించారు. అందువల్ల ఆయనకు ద్రవిడ ఉద్యమ పితామహుడిగా గుర్తింపు లభించింది. స్వాభిమాన ఉద్యమంలో భాగంగా కొన్ని వేల కులవ్యతిరేక వివాహాలు జరిపించారు. ఈ ఉద్యమం విజయవంతం కావాలంటే మహిళల తోడ్పాటు చాలా అవసరమని పిలుపునిచ్చారు. సమాజంలో సగభాగమైన మహిళలకు పురుషులతో సమానమైన స్థాయిలో అవకాశాలుండా లన్నారు. స్త్రీలు స్వేచ్ఛ కోల్పోవడం, అణచివేతకు గురికావడం.. వంటి వాటికి ముఖ్యకారణం మత విశ్వాసాలు, దైవభక్తి అనీ.. వాటిని వారు వదులుకుంటే భర్తలు దైవస్వరూపులుగా కాక, తోటి మనుషులుగా కనపడతారనీ అన్నారు. బానిస మనస్తత్వం వదిలినప్పుడే పురుషాహంకారాన్ని ఎదుర్కోగలరని పెరియార్ కుటుంబ సభ్యులతో ఆచరణాత్మకంగా ఉద్యమం సాగించారు. అందుకాయన ఒక సులభమైన వివరణ ఇచ్చారు. అది ఇలా ఉంది. ”పిల్లి నుంచి ఎలుకకు స్వాతంత్య్రం దొరుకుతుందా? యజమాని నుంచి పనివాడికి – బ్రాహ్మణుల నుంచి బ్రాహ్మణేతులకు ఎక్కడైనా సమానత్వం దొరుకుతుందా? అలాగే – పురుషుల నుంచి స్త్రీలకు ఎప్పటికీ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు దొరకవు. అవి సంఘర్షించి సాధించుకోవాల్సిందే! తన పురుషుడు లేకుండా తను బతకలేనని – తను లేకుండా కూడా అతను బతకగలడనీ – ప్రతి స్త్రీ అనుకున్నంత కాలం స్త్రీ పురుష సమానత్వం సాధ్యం కాదు” అని అన్నారు పెరియార్. బ్రాహ్మణులను దైవాంశ సంభూతులుగా భావించకుండా, మామూలు మనుషులుగా భావిస్తే మనుషులంతా ఒక్కటే అనే భావనకు బలం చేకూరుతుంది. అటు బ్రాహ్మణేతరులు, ఇటు స్త్రీలు తమ తమ బానిస మనస్తత్వం విడనాడినప్పుడే సమాజంలో సమానత్వం సాధించగలం అని తన ఉపన్యాసాల ద్వారా, రచనల ద్వారా ఉద్బోధించారు – పెరియార్! స్త్రీ సమానత్వం కోసం ఇ.వి.రామసామి చేసిన పోరాటానికి 12 నవంబర్ 1938న ఐదువేల మంది మహిళలు మదరాసు (చెన్నై)లో పెద్ద ఊరేగింపుగా ఆయనను తీసుకువెళ్ళి, ఒక మహాసభలో ‘పెరియార్’ అనే బిరుదు ప్రదానం చేశారు. ‘పెరియార్ వర్థిల్లాలి’ అనే నినాదాలు ఇచ్చారు. అప్పటి నుంచి అందరూ రామసామిని ‘పెరియార్’గా వ్యవహరించాలని తీర్మానించారు. పెరియార్ అంటే ఎండిపోకుండా నిరంతరం సజీవంగా పారుతూ ఉండే నదీ ప్రవాహం – అని అర్థం. మహాత్ముడనే భావన కూడా అందులో ఉంది. ఇరోడ్ వెంకటప్ప రామసామి నాయకర్గా పుట్టి పెరిగిన వ్యక్తి – కుల నిర్మూలనలో భాగంగా ‘నాయకర్’ అనే కుల సూచికను ఆయనే వదిలేశారు. మిగిలిన ఇ.వి.రామసామిని ప్రజలు పెరియార్గా గుర్తించుకున్నారు. గుర్తు ఉంచుకున్నారు.
‘వైజ్ఞానిక అవగాహన తప్పనిసరి’ అని ఉద్బోధించిన పెరియార్, యూరోప్, రష్యా, మలేసియా దేశాలు పర్యటించి తన భావజాలాన్ని ప్రచారం చేశారు. 1938లో హిందీ వ్యతిరేకోద్యమం నడిపారు. 1939-44 మధ్యకాలంలో జస్టిస్ పార్టీ అధినేతగా ఉన్నారు. పలురంగాలలో పెరియార్ నిరాడంబర, నిస్వార్థ సేవలను ఐక్యరాజ్యసమితి గుర్తించి, భారత ప్రభుత్వం ద్వారా ఒక ప్రశంసాపత్రాన్ని అందించింది. అది చాలా విలువైనది. ఎందుకంటే అందులో ఉన్న విశేషణాలు చాలా గొప్పవి. ”ఆగేయాసియా దేశాల సోక్రటీస్ అని, నూతన యుగానికి ప్రవక్త అని, సంఘ సంస్కరణోద్యమానికి పితామహుడని, మూఢనమ్మకాలకీ, అర్థరహిత సంప్రదాయాలకి, బద్దశత్రువని, అజ్ఞాన విచ్ఛేదకుడని” ఆ ప్రశంసాపత్రంలో యునెస్కో కీర్తించింది. అంటే ఆయన నడిపిన ఉద్యమాల ప్రభావం ప్రపంచవ్యాప్తమైంది. ఈ దేశంలో సమానత్వం రావాలంటే దోపిడీ వర్గ నిర్మూలన జరగాలి. అది జరగాలంటే కుల నిర్మూలన జరగాలి. సాంస్కృతిక విప్లవం విజయవంతమైతే కుల నిర్మూలన సాధ్యమౌతుంది. అందుకోసం సామాజిక ఉద్యమకారులు పెరియార్ని ఆదర్శంగా తీసుకుని, నాస్తికత్వాన్ని ఆయుధంగా వాడుకుంటూ వైజ్ఞానిక అవగాహనతో ఉద్యమాలు చేయాల్సి ఉంది. మొదటిసారి రాజ్యాంగ సవరణ చేయించి రిజర్వేషన్లు కొనసాగే విధంగా పెరియార్ చేసిన కృషి ఈ దేశంలోని బహుజనులకు స్ఫూర్తిదాయకం. నవంబర్ 26ను ”కుల నిర్మూలన దినం”గా ప్రకటించి బ్రాహ్మణ హౌటళ్ళ బోర్డులపై నుంచి ‘బ్రాహ్మణ’ అనే పేరును తొలగించే ఉద్యమం చేసి సమానత్వ భావనను తీసుకొచ్చారు. కుల వ్యవస్థను, అంటరానితనాన్ని ప్రబోధిస్తున్న రామాయణం, మనుస్మృతి ప్రతులను తగులబెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలచేత రాముని చిత్ర పటాలను దగ్ధం చేయించారు. రాముడు, సీత, లక్ష్మణుల దిష్టిబొమ్మల్ని తగులబెట్టించారు. వినాయక విగ్రహాలు పగులగొట్టించారు. వినాయక విగ్రహాల విషయమై ఒకరు కోర్టుకెక్కారు. న్యాయమూర్తి ముందు పెరియార్ ధైర్యంగా తన అభిప్రాయం వెల్లడించారు. నిమజ్ఞనం పేర వినాయకుడి విగ్రహాల్ని మంచినీటి సరస్సుల్లో వేసి జనం కాలుష్యం పెంచుతున్నారనీ, అందుకు విరుద్ధంగా పర్యావరణాన్ని రక్షించే విధంగా తాను విగ్రహాల్ని పగుల గొట్టిస్తున్నానని – నీటిలో వేసినా, పగులగొట్టినా ఫలితం ఒకటేనని చెప్పారు. సంతృప్తి చెందిన న్యాయమూర్తి కేసు కొట్టేశాడు. ప్రజలు తాకితేనే విగ్రహాలు మైలపడితే అలాంటి దేవుళ్ళు మనకెందుకూ? అని ప్రశ్నించిన పెరియార్, అలాంటి విగ్రహాల్ని రోడ్ల నిర్మాణంలో ఉపయోగించాలి. లేదా చెరువుగట్టున పడేస్తే, అది బట్టలు ఉతుక్కోవడానికైనా పనికొస్తుంది – అనే సూచన చేశారు.
పెరియార్ ఉద్యమ కృషి ఫలితంగా 1967లో తమిళనాడులో బహుజనుల రాజ్యం ఏర్పడింది. ‘దేవుడు లేడు – లేనేలేడు’ అనే నినాదాలు సభల్లో తమిళనాడు అంతటా విరివిగా వినిపించేవి. ఆ విషయం మీద ధైర్యంగా మాట్లాడగలిగేవారు. అంటే పెరియార్ బోధనల ప్రభావం ఎంత బలంగా పడిందో అర్థం చేసుకోవాలి. తర్వాత కాలంలో వచ్చిన వారు పెరియార్ విధానాలను కొనసాగించక పోవడం వల్ల మళ్లీ అక్కడ మనువాదులు బలపడ్డారు. పెరియార్ కాలంలోనే స్వాభిమాన్ పెళ్ళి చట్టం అమలయ్యింది. నాస్తిక, హేతువాద, వైజ్ఞానిక ఉద్యమాల స్ఫూర్తితో పెరియార్, ఫూలే, అంబేద్కర్ల బోధనల ప్రభావంతో జీవిస్తున్న నేటితరం, ఇప్పటికీ సామాజిక న్యాయంకోసం తల్లడిల్లి పోతోంది. అయితే నిరాశపడకుండా మరో ముందడుగు వేసి తన గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంది. దేశానికి స్వాతంత్య్రం లభించి ఏడు దశాబ్దాలు దాటినా, ఇంకా మనువాద వారసులు పరిపాలనా యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో ఉంచుకుని, వ్యవస్థల్ని, మానవీయ విలువల్ని ధ్వంసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. పెరియార్ ఆలోచనా విధానాన్ని ఆదర్శంగా తీసుకుని, సమ సమాజ స్థాపన కోసం ఉద్యమిస్తూనే ఉండాలి. సంఘర్షణ ఆగిపోగూడదు. యుద్ధం ఆగిపోగూడదు. మనువాద అనాలోచిత, అహంకార పూరిత అసమర్థ ప్రభుత్వాల నుంచి ప్రజలు తమని తామే రక్షించుకుంటూ ఉండాలి. మానవీయ విలువల్ని పరిరక్షించే, వైజ్ఞానిక దృక్పథం గల ప్రభుత్వాల కోసం ప్రజలు కృషి చేస్తూనే ఉండాలి!
(17 సెప్టెంబర్ పెరియార్ జన్మదినం)
– డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్.
Courtesy Nava telangana..