కారుసాల వెంకటేశ్
పందొమ్మిదో శతాబ్ది భారతీయ పునరుజ్జీవనోద్యమ మూల పురుషులలో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఒకరు. స్త్రీ, పురుష సమానత్వమనే సమున్నత ప్రజాస్వామిక విలువే పునాదిగా ఆయన సంస్కరణోద్యమాన్ని నిర్మించారు. సైన్స్, హిస్టరీ, తర్కం పునాదులపై మానవతావాదాన్ని అభివృద్ధి పరిచేందుకు పరితపించిన నవ భావయోధుడు విద్యాసాగర్. ఆయన ఆలోచనలు, కార్యాచరణ వెనక వున్న తాత్విక భావశక్తిని వర్తమాన భారతీయ సమాజం ఆవాహన చేసుకోవలసిన అవసరం ఎంతైనా వున్నది.
గత తరాల మహనీయుల అడుగు జాడల్లో నడిచినప్పుడే మనం మరింత ముందుకు పురోగమించగలం. రెండు శతాబ్దాల క్రితం భారతీయ సమాజాన్ని అంధకారం నుంచి వెలుగు బాటకు మళ్లించిన ఒక మహోన్నత మానవతామూర్తిని మనం తప్పక స్మరించుకోవల్సిన సమయమాసన్నమయింది. ప్రజాస్వామిక, లౌకిక విలువలను అణువణువునా నింపుకొన్న ఆ మహా పురుషుడు తన కాలపు మూఢనమ్మకాలపై సాగించిన పోరు అనన్యసామాన్యం. అందుకు ఆయన అనుసరించిన మార్గం, ఆచరించిన పద్ధతి తరతరాలకు స్ఫూర్తి దాయకమైనది. ఆ మహావ్యక్తి సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ వైతాళికుడిగా సుప్రసిద్ధుడైన ఈశ్వర చంద్ర బందోపాధ్యాయ. ఈశ్వర చంద్ర విద్యాసాగర్గా లోకవిఖ్యాతుడైన ఈ జ్ఞానమూర్తి 1820 సెప్టెంబరు 26న పశ్చిమ బెంగాల్లోని మిద్నాపూర్ జిల్లా వీరసింఘ గ్రామంలో జన్మించాడు. సనాతన ధర్మానికి నిబద్ధమైన అత్యంత పేద కుటుంబం నుంచి ప్రభవించిన ఈశ్వరచంద్ర మత విశ్వాసాలకు అతీతంగా తననుతాను మలుచుకున్నారు.
చదువు అంటే సంస్కృత గ్రంథాలను పఠించడం మాత్రమే అనుకునే రోజుల్లో యూరోపియన్ వైజ్ఞానిక జ్ఞానం ఆవశ్యకతను గుర్తించి, కలకత్తా సంస్కృత కళాశాలలో ఆంగ్ల బోధనను ప్రవేశపెట్టిన ప్రగతిశీలి విద్యాసాగర్. సకల విజ్ఞాన శాస్త్రాల సారమంతా వేద, వేదాంగాలలో నిక్షిప్తమై ఉందనే వాదనను ఆయన తిరస్కరించారు. భౌతికవాదం, శాస్త్రీయ ఆలోచనల ద్వారా మాత్రమే నూతన జీవిత విలువలు జనిస్తాయని విద్యాసాగర్ విశ్వసించారు. తర్కబద్ధమైన వివేచనకు దోహదం చేసే ఆధునిక విద్యావాప్తికి ఆయన అవిరళ కృషి చేశారు. ‘ఆధునిక శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలన్నింటికీ భారత దేశ సంస్కృత ప్రాచీన గ్రంథాలే మూలం’ అని జబ్బలు చరుచుకునే ధోరణిపై ఆయన రాజీలేని పోరాటం చేశారు.
విద్యాసాగర్ను కేవలం ఒక సంఘసంస్కర్తగానో, మానవతావాదిగానో, మహిళల జీవితాలను ఉద్ధరించిన వ్యక్తిగానో మాత్రమే భావిస్తే, ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని అద్దంలో చంద్రున్ని చూసిన చందమే అవుతుంది. ఈశ్వరచంద్ర ఆలోచనలు, కార్యాచరణ వెనక వున్న తాత్వికతను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం నేటి సమాజానికి అవశ్యం. బ్రాహ్మణులకు మాత్రమే ప్రవేశమున్న కోల్కతా సంస్కృత కాలేజీలో కులప్రాతిపదికన అర్హత పొందే నిబంధనలను ఆయన తొలగించారు. బడుగుజీవులు సాకే లేగదూడ చిక్కం పొరపాటున తగిలితేనే సనాతనులు మైల పాటించే రోజులవి. అలాంటి సమయంలో బర్ద్వాన్ జిల్లాలో మలేరియాతో బాధపడుతున్న ముస్లిములకు సపర్యలు చేయడమేకాదు, కుల మతాలకు అతీతంగా మంచంపట్టిన చిన్నారులను గుండెలకు హత్తుకొని శుశ్రూష చేసిన మానవతా మూర్తి ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఒక సందర్భంలో అనారోగ్యంతో బాధపడుతున్న సాగర్కు కర్మతార్ ప్రాంతం వెళ్లి విశ్రాంతి తీసుకుంటే, ఆరోగ్యం కుదుటపడుతుందని ఆప్త మిత్రులు సూచించారు. ‘అక్కడకు వెళ్ళి నేను మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యం పొందుతుంటే, స్థానికులైన సంతాల్ గిరిజనుల ఆకలి చావులను చూస్తూ నేనెలా భరించగలను’ అని అంటూ మిత్రుల సలహాను ఆయన అంగీకరించలేదు. తర్వాత కాలంలో గిరిజనుల కోసం ఆయన ఒక ప్రత్యేక పాఠశాలను నెలకొల్పారు. 1866లో బెంగాల్ క్షామం దాపురించినప్పుడు మిద్నాపూర్, హుగ్లీ తదితర చోట్ల ఉచిత భోజనశాలలను ఆయన ఏర్పాటు చేశారు. కుల మతాలకు అతీతంగా అన్నార్తులందరినీ ఆయన ఆదుకున్నారు. ఒకనాడు కులం పేరుతో సమాజం వెలివేసిన కొంత మంది పిల్లలతో విద్యాసాగర్ మాట్లాడటం మహారాజా జతీంద్ర మోహన్ ఠాగూర్ కంటపడింది. ‘ఆ అలగా వారితో మీరెందుకు కలిసి తిరుగుతారని’ విద్యాసాగర్ను ఆ జమిందారు ప్రశ్నించాడు. ‘వారు నా కుటుంబంలో భాగం’ అని బదులిచ్చిన ఈశ్వరచంద్ర ఔన్నత్యం హిమశిఖరం కన్నా మిన్నగా తోచక మానదు! ‘మతం ఒక సంక్లిష్టమైన విషయం. దాని తల ఏదో, తోక ఏదో నాకు అంతుపట్టదు. పండితులు ప్రాచీన శాస్త్రాలలో ఆత్మను పలు విధాలుగా నిర్వచించినా, వాటి నుంచి నేను ఏమీ గ్రహించలేకపోయాను’ అని విద్యాసాగర్ మతం పట్ల తన అభిప్రాయాన్ని బాహాటంగానే ప్రకటించారు. మత స్ఫూర్తిని పూర్తిగా విడనాడని తన కాలపు నవజాగరణోద్యమాన్ని మత రహిత సెక్యులర్ మార్గం పట్టించిన ఆధునిక పథగామి ఈశ్వర చంద్ర విద్యాసాగర్. రాజకీయాలలో మత జోక్యం పెరిగిన ప్రస్తుత తరుణంలో లౌకిక విలువలను ఆయన అనుసరించిన తీరును మననం చేసుకోవడం మన కర్తవ్యం.
ఆనాటి సమాజాన్ని పట్టిపీడించిన బాల్యవివాహాలు, బహుభార్యత్వం, కన్యాశుల్కాన్ని నిర్మూలించేందుకు విద్యాసాగర్ సలిపిన పోరు అసామాన్యమైనది. వితంతు వివాహాలు జరిపేందుకు ఆయన చేసిన కృషి అంతాఇంతా కాదు. బాలికా విద్య, వితంతు వివాహాలను సమాజం అంగీకరించేందుకు భారతీయ సనాతన శాస్త్రాల ఆధారాలతో సనాతన వాదుల నోళ్లుమూయించిన చతురుడు విద్యాసాగర్. ఇందుకు ఆయన వేదాలు, ఉపనిషత్తులను సమగ్రంగా అధ్యయనం చేశారు. మనుసంహితలోని శ్లోకాన్ని ఉదహరించి బాలికా విద్య తప్పుకాదని ఆయన నిరూపించారు. మహిళ ఎలాంటి సందర్భాల్లో పునర్వివాహం చేసుకోవచ్చో వివరించిన పరాశర స్మృతి ఆధారంగా ఆనాటి హిందూ సమాజానికి బదులు చెప్పారు. 1850 దశకంలో బాలికలకు ఆయన 35 పాఠశాలలను నెలకొల్పాడు. ఆ పాఠశాలలోని విద్యార్థినుల సంఖ్య 1300 పైమాటే. 1855 నవంబర్ 17న బ్రిటీషు పార్లమెంటులో వితంతు వివాహ చట్టం బిల్లును ప్రవేశపెట్టడంలో విద్యాసాగర్ పాత్ర విశేషమైంది. ఆయన సలిపిన ఉద్యమ ఫలితంగానే వితంతు వివాహాలకు చట్టబద్ధత లభించింది. తన కుమారుడికి సైతం ఒక వితంతువుతో వివాహం జరిపించాడు. అందుకు బంధువుల నుంచి ఆక్షేపణ వస్తుందేమోనని సోదరుడు భయం వ్యక్తం చేయగా విద్యాసాగర్ నిర్మొహమాటంగా ఇలా సమాధానమిచ్చారు: ‘నా జీవితంలో నేను చేసిన మహోన్నత కార్యాలన్నింటిలో వితంతు వివాహోద్యమం మహోన్నతమైంది. సాంఘిక ఆచారానికి నేను బానిసను కాను. నాకూ సంఘానికీ ప్రయోజనకరమైందని నాకు తోచిన కార్యమేదైనా నేను చేస్తాను’.
అమ్మాయిల వివాహ వయసు పరిమితిని చట్టబద్ధం చేసేందుకై బ్రిటిష్ వలసపాలకులు విద్యాసాగర్ సలహా కోరారు. ‘రెండు హృదయాల ఐక్యతే ప్రేమకు పునాది. మనుసులు పరిణతి చెందని వయసులో పెళ్లి చేయడం వాళ్ల భవిష్యత్తుకు, తద్వారా కుటుంబ వ్యవస్థకు అనర్థదాయకం’ అని ఆయన వివరించాడు. రజస్వల కాని అమ్మాయితో శృంగారం శిక్షార్హంగా ప్రకటించాలని కూడా ప్రభుత్వానికి ఆయన విన్నవించాడు. సమాజంలో స్త్రీ, పురుషుల సమానత్వమనే సమున్నత ప్రజాస్వామిక విలువే పునాదిగా ఆయన సంస్కరణోద్యమాన్ని నిర్మించారు. ఎవరినైతే మూఢాచారాల నుంచి, సంప్రదాయాల కట్టుబాట్ల నుంచి విముక్తి చేయాలనుకున్నాడో, ఆ మహిళల్లో కొందరు విద్యాసాగర్ను దుమ్మెత్తిపోశారు. ఆయన ముఖంపై పేడనీళ్లు కొట్టారు. ఆ అవమానాలు, ఛీత్కారాలన్నీ ఆయన మనోనిబ్బరం ముందు పూర్వపక్షమయ్యాయి. చివరికి మహిళాలోకం ఆయనకు బ్రహ్మరథం పట్టింది. సామాజిక మార్పును స్వాగతించే వారి సంఖ్య పెరిగింది. విద్యాసాగరుడి ఉద్యమ స్ఫూర్తి దేశమంతా వ్యాప్తించింది. ఆయన స్ఫూర్తితో మన తెలుగునాట కందుకూరి వీరేశలింగం సంస్కరణోద్యమానికి శ్రీకారం చుట్టారు. నూతన విద్యావిధానం పేరుతో ప్రభుత్వాలు మూఢత్వాన్ని జొప్పించాలని ప్రయత్నిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆధునిక విద్యను వ్యాప్తిచేయడంలో విద్యాసాగర్ అనుసరించిన పంథాను మననం చేసుకోవడం ముఖ్యం. యూరోపియన్ ఫిలాసఫర్ బిషన్ బర్కిలీ భావవాద తత్వశాస్త్రాన్ని పాఠ్యాంశంగా బోధించాలన్న బెనారస్ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ బెలంటైన్ ప్రతిపాదనను విద్యాసాగర్ సున్నితంగా తిరస్కరించారు. ‘కొన్ని కారణాల వల్ల వేదాంతం, సంఖ్యాశాస్త్రాలను బోధనలో కొనసాగిస్తున్నాం. అవి అశాస్త్రీయ తాత్విక భావనలు అయినప్పటికీ హిందువుల విశ్వాసం మేరకు మాత్రమే పాఠ్య ప్రణాళికల్లో ఉంచాం. వాటితో పాటూ ఉత్తమ తత్వశాస్త్రం బోధించడం ద్వారా వాటిని నిరోధించవచ్చు. కనుక జె.ఎస్.మిల్ రాసిన ‘లాజిక్’ను సంస్కృత కళాశాల విద్యార్థులకు బోధించడం వల్ల భౌతికవాదం, శాస్త్రీయ ఆలోచనలు వారిలో పరిఢవిల్లుతాయని విద్యాసాగర్ వాదించారు. శాస్త్రీయత పునాదిగా భారతీయ విద్యా వ్యవస్థ కొనసాగాలని విద్యాసాగర్ ఆనాడే ఆకాంక్షించారు. 150ఏళ్ల క్రితమే మాతృభాషలో ప్రాథమిక విద్యాబోధన ఆవశ్యకతను ఆయన వివరించారు. తద్వారా విద్యావ్యాప్తికి తోడ్పడ్డారు. అందుకు కావాల్సిన భాషాశాస్త్ర నైపుణ్యాలను బెంగాలీ సమాజానికి ఆయన అందించారు. తన మాతృభాషలో పలు పాఠ్యగ్రంథాలను ఆయన రచించారు. ‘బెంగాలీ గద్యానికి సొబగులు అద్దిన తొలి వ్యక్తి విద్యాసాగర్’ అని మహాకవి మైకెల్ మధుసూదన్ దత్ కొనియాడారు. విద్యాసాగర్ జీవనశైలి, ఆలోచనలకు ఆంగ్లేయులు సైతం ముగ్ధులైన సందర్భాలున్నాయి. కానీ ఆయన ఏనాడూ పరాయి పాలకుల ఆధిపత్యాన్ని అంగీకరించలేదు. వాళ్లు ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంఫైర్’ బిరుదును విద్యాసాగర్ స్వీకరించలేదు. మనదేశ సంస్కృతే గొప్పదనే అభిజాత్యాన్ని కూడా ఆయన సహించలేదు. పాశ్చాత్యులే నాగరీకులనే వాదనను విద్యాసాగర్ సమ్మతించలేదు. యదార్థవాదిగా పరిస్థితులను అంచనా వేశారు. సమాజ పురోగమనానికి పనికొచ్చే వాస్తవిక, అభ్యుదయ విలువలను గుర్తించి, వాటిని చలామణీలోకి తెచ్చేందుకు ఆయన అహర్నిశలు శ్రమించారు. చివరికి తన యావదాస్తిని సైతం సమాజ సంక్షేమానికే వినియోగించారు. మహత్తరమైన విలువలను భావితరాలకు వారసత్వంగా విద్యాసాగర్ ఇచ్చివెళ్లారు. అందుకే ‘భారతీయ నవజాగరణోద్యమానికి విద్యాసాగర్ ఒక మూల పురుషుడు’ అని విశ్వకవి రవీంద్రుడు ప్రస్తుతించారు. సైన్స్, హిస్టరీ, తర్క శాస్త్రం పునాదులపై మానవతావాదాన్ని అభివృద్థి చేసేందుకు విద్యాసాగర్ పరితపించారని రవీంద్రుడు పలు సందర్భాల్లో ప్రస్తావించారు.
నేడు బుసలుకొడుతున్న మతతత్వ శక్తులకు ముకుతాడు వేసేందుకు అవసరమైన తాత్విక భావశక్తిని సమకూర్చుకునేందుకు విద్యాసాగరుడిని ఆవాహన చేసుకోవాలి. ఆయన్ని కేవలం బెంగాలీ సమాజానికో, బ్రాహ్మణ కులానికో పరిమితం చేయడం సంకుచితత్వానికి పరాకాష్ఠ. విశ్వ భారతీయుడు విద్యాసాగర్. మత ఛాందసాన్ని నిలువరించేందుకు, కుల మతాల పేరిట ప్రజలను విచ్ఛిన్నం చేస్తున్న పరిస్థితులను అడ్డుకునేందుకు… ప్రగతిశీల భావాలు, లౌకికవాదం, ఉన్నత మానవీయ విలువలు కలగలిపిన ప్రజా చైతన్యాన్ని పెల్లుబికించే సాంస్కృతికోద్యమాన్ని విద్యాసాగర్ స్ఫూర్తితో నిర్మించడమే ప్రజాస్వామిక వాదుల తక్షణ కర్తవ్యం.
(నేటి నుంచి ఈశ్వర చంద్ర విద్యాసాగర్ 200వ జయంత్యుత్సవాలు)