బిడ్డ పుట్టే వరకూ ఆ సంగతి తెలియలేదు
విగన్(ఇంగ్లాండ్) : ఇదో చిత్రమైన సంఘటన. ప్రసవానికి సరిగ్గా గంట ముందు గానీ గర్భం దాల్చిన విషయం ఆమెకు తెలియలేదు. అయితే.. దీని వెనుక లాక్డౌన్, చిరుతిళ్ల పాత్రే ప్రధానమైనది. అదెలా.. అనుకుంటున్నారా? ఇలా. టాషాడేవిస్, మార్టిన్ హెర్న్ దంపతులు ఇంగ్లండ్లోని విగన్లో నివాసం ఉంటున్నారు. వారికి మూడున్నరేళ్ల క్రితం పెళ్లైంది. ఇదిలా ఉండగా.. లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉండడంతో అదే పనిగా చిరుతిళ్లను టాషా తినేది. దీంతో ఆమె బరువు పెరగడం మొదలైంది.
ఒక రోజున ఆమె బొడ్డు ఉబ్బిపోయి, విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. బిడ్డ ప్రసవానికి ఇంకా గంట మాత్రమే సమయం ఉందని చెప్పారు. అంతే, ఆ దంపతులు అవాక్కయ్యారు. గర్భం దాల్చిన విషయం వారికి అప్పటి వరకూ తెలియలేదట. చిరుతిళ్లను ఇష్టానుసారం తినేయడం వల్ల బరువు పెరుగుతున్నాననే తలపులోనే ఆమె ఉండిపోయింది. దీంతో నెలలు నిండడాన్నీ గుర్తించలేదట. కానీ, శిశువు మాత్రం గర్భంలో రూపు దాల్చుతూనే ఉంది. చివరికి.. సుమారు నాలుగన్నర కిలోల బరువున్న ఆరోగ్యవంతమైన పండంటి మగబిడ్డకు టాషా జన్మనిచ్చింది.