- హైదరాబాద్ అతలాకుతలం
- దఫదఫాలుగా ముంచెత్తిన కుండపోత
- 111 ఏళ్లలో సెప్టెంబరులో ఇంత వాన పడడం ఇదే మొదటిసారి
- ట్రాఫిక్ నరకం
- తిరుమలగిరిలో అత్యధికంగా 12.1
- ఉప్పల్లో 12 సెంటీమీటర్ల వర్షం
- 1908 తర్వాత ఇదే అత్యధికం
- వరద గోదావరిలా మారిన రోడ్లు
- చెరువులను తలపించిన కాలనీలు
- పలు ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లు
హైదరాబాద్ సిటీ: మంగళవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకూ.. దఫదఫాలుగా కుండపోత! రాత్రి పది గంటల తర్వాత దాదాపు గంటపాటు నగరమంతా ఒకేసారి కుంభవృష్టి! సెప్టెంబరు నెలలో 111 ఏళ్లలో పడని వర్షం మంగళవారం పడింది. రాత్రి 11 గంటల వరకూ సికింద్రాబాద్ తిరుమలగిరిలో అత్యధికంగా 12.1, ఉప్పల్లో 12 సెం.మీల వర్షం కురిసింది. 1908 తర్వాత సెప్టెంబరులో అత్యధిక వర్షపాతం ఇదే! ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు ఇంతింత లావుపాటి చినుకులు ధారాపాతంగా కురిశాయి. అవీ ఏకబిగిన గంటలకొద్దీ పడ్డాయి. వరుణుడి దెబ్బకు హైదరాబాద్ వణికింది. రికార్డు స్థాయి వర్షానికి నీట మునిగింది. కాలనీ, బస్తీ అన్న తేడా లేకుండా ఇళ్లు నీటమునిగాయి. చెరువులు, నాలాలు పొంగిపొర్లాయి. రహదారులు వరద గోదారుల్లా మారాయి. ఎప్పట్లాగే కిలోమీటర్లకొద్దీ వాహనాల రాకపోకలు స్తంభించాయి.
ఈసారి సమస్య అంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ!! నడుంలోతు నీళ్లు చేరడంతో రోడ్లు చెరువులను తలపించాయి. ఆ నీళ్లలో మునిగిన స్కూటీలు.. అద్దాలదాకా మునిగిన కార్లతో వాహనదారులు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కిలోమీటర్ ప్రయాణానికి గంటకుపైగా సమయం పట్టింది. మొత్తంగా, ఎలాగోలా ఇళ్లకు చేరితే చాలు దేవుడా అని మొక్కుకోని వాహనదారుడు లేడు. అల్వాల్, కాప్రా, కూకట్పల్లి, మల్కాజిగిరి, జూబ్లీహిల్స్, యూసు్ఫగూడ, మెహిదీపట్నం, చార్మినార్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, గోషామహల్, అంబర్పేట్, బేగంపేట్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ముసాపేట్, ఉప్పల్ ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. సగటున 1 సెం.మీ నుంచి 12 సెం.మీ వరకు వాన కురిసింది. కాప్రా, అల్వాల్, కూకట్పల్లి సర్కిళ్లలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లాలోని మంఖాల్లో అత్యధికంగా 14.1 సెం.మీ. వర్షం కురిసింది. 1908లో సెప్టెంబరు 27న ఒకేరోజు హైదరాబాద్లో 15.3 సెం.మీల వర్షపాతం నమోదైంది. దాదాపు 111 ఏళ్ల తర్వాత మంగళవారం 24 గంటల్లో కురిసిన 12.1 సెం.మీల వర్షమే అత్యధికం. 2017 సెప్టెంబరు 6న 9 సెం.మీల వర్షపాతం నమోదైంది. సెప్టెంబరులో గత 111 ఏళ్లలో ఇదే రికార్డు స్థాయి వర్షపాతమని వాతావరణ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
నగరం అతలాకుతలం
భారీ వర్షానికి రాజధాని నగరం అతలాకుతలమైంది. యూసు్ఫగూడలో ఓ ద్విచక్ర వాహనం కొట్టుకుపోయింది. శ్రీనగర్ కాలనీలో చెట్లు కూలాయి. బేగంపేటలో ఓ రెస్టారెంట్లోకి నీళ్లు వచ్చాయి. ఉస్మానియా యూనివ ర్సిటీలోని ఈ-2 హాస్టల్ గదుల్లోకి వర్షపు నీరు చేరింది. ఏఎ్సరావు నగర్లోని షిరిడి సాయినగర్ కాలనీలో ఇళ్లు నీట మునిగాయి. ఉప్పల్లోని ఆదర్శ్ నగర్లో 40 ఇళ్లలోకి నీరు చేరింది. ఎర్రగడ్డ ప్రేంనగర్లో నడుము లోతు నీరు చేరింది. ముషీరాబాద్లోని నాగమయ్యకుంట, ఎంఎస్ మక్తా, కూకట్పల్లి సఫ్దార్నగర్, కవాడిగూడలోని పద్మశాలి కాలనీ, గాంధీనగర్, పాత రామంతాపూర్, ఎన్ఎండీసీ కాలనీల్లోని ఇళ్లు నీట మునిగాయి. సైదాబాద్ ఐఎస్ సదన్ వద్ద నీళ్లు నిలిచాయి. గచ్చిబౌలి కేర్ ఆస్పత్రి వద్ద రోడ్డుపై నడుం లోతు నీళ్లు నిలవడంతో రెండు గంటలపాటు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. దిల్సుఖ్నగర్ పరిసరాల్లో రోడ్లు చెరువులను తలపించాయి. మూసారాంబాగ్-అంబర్పేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విశాల్ మెగా మార్ట్ వద్ద రోడ్డు చెరువును తలపించింది. మల్కాజిగిరిలోని ఈస్ట్ ఆనంద్బాగ్, ఎన్ఎండీసీ కాలనీ, రాజానగర్లో నాలాలు పొంగి పొర్లాయి. ఇళ్లల్లోకి నాలా నీళ్లు చేరాయి.
ఉప్పొంగిన నాలాలు
వర్షంతో నగరంలోని పలు ప్రాంతాల్లో చెరువులు ఉప్పొంగాయి. మాదాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, మల్కాజ్గిరి తదితర ప్రాంతాల్లో చెరువులు నిండి దిగువకు వరద నీటి ప్రవాహం పెరిగింది. హుస్సేన్ సాగర్లో కూడా నీటిమట్టం భారీగా పెరగడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. సాగర్ గరిష్ఠ నీటిమట్టం 513 మీటర్లు కాగా.. ఆ మేరకు నీళ్లు చేరాయి. బండ చెరువు పూర్తిగా నిండిపోవడంతో లోతట్టు ప్రాంతాలకు ముంపు ముప్పు పొంచి ఉంది. కాగా, మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. చెరువులు అలుగుపోశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. పంటలు నీట మునిగాయి. స్తంభాలు , చెట్లు కూలిపోయాయి. పిడుగులూ పడ్డాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారుల లెక్కల ప్రకారం.. ఈ ఒక్కరోజే 177 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లాలో 13.2 సెం.మీ, సిరిసిల్ల జిల్లాలో 9.55 సెం.మీ వర్షం పడింది. సిరిసిల్ల జిల్లా నీలోజుపల్లిలో పిడుగుపాటుకు ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు.
కిలోమీటర్లకొద్దీ క్యూలు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు గ్రేటర్ స్తంభించింది. రోడ్లపై కిలోమీటర్లకొద్దీ క్యూలు కనిపిస్తున్నాయి. ఐటీ కారిడార్లో రోడ్లన్నీ వాహనాలు, వరద నీటితో నిండిపోయాయి. మైండ్స్పేస్ జంక్షన్ వద్ద వంతెనపై రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. రాంనగర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, రాజ్భవన్ రోడ్, మల్కాజ్గిరి తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై మోకాలి కంటే ఎక్కువ ఎత్తుకు వరద నీరు నిలిచింది. పలువురు వాహనదారులు గాయపడ్డారు.
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో..
వర్షం కురుస్తున్న సమయంలో జీహెచ్ఎంసీలో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న మంత్రి కేటీఆర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వెంటనే మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను రంగంలోకి దించాలని సూచించారు. పలు ప్రాంతాల్లో రోడ్లపై నిలిచిన నీటిని ఆ బృందాలు తొలగించాయి. అర్ధరాత్రి వరకు జీహెచ్ఎంసీలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న మేయర్ బొంతు రామ్మోహన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు.
Courtesy AndhraJyothy…