పారిశ్రామిక ఉత్పత్తీ తగ్గింది. 61,333 పరిశ్రమలు మూతపడ్డాయని, 2016 డిసెంబర్లో సీఐఐ చెప్పింది. లక్షల మంది ఉపాధి కోల్పోయారు. 12 భారీ పరిశ్రమలు చెల్లించలేని బాకీలలో కూరుకుపోయాయి. ఒక విధంగా పారిశ్రామిక రంగాన్ని పూర్తిగా ప్రభుత్వం కార్పోరేట్ల పరం చేయడానికి ఇది మంచి అవకాశంగా ఉంది. ఇప్పటి వరకు 12 సంస్థలను పూర్తిగా ప్రయివేటీకరించారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పూర్తికాలం బడ్జెట్ రూ.27,86,349 కోట్లుగా ప్రవేశపెట్టారు. అంతకు ముందు ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ 2019 జనవరి 1న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 27,84,200 కోట్లుగా ప్రవేశపెట్టారు. అంటే సీతారామన్ రూ.2,149 కోట్లు మాత్రమే పెంపుదల చేశారు. తన 100 డిపార్ట్మెంట్ శాఖలకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2018 డిసెంబర్ నాటికి విదేశీ రుణం రూ.36,43,937 కోట్లుగా ఉంది. ఈ రుణానికి రూ.6,60,471కోట్లు వడ్డీ చెల్లిస్తున్నాం. వడ్డీ చెల్లింపులు బడ్జెట్లో 23.70శాతానికి చేరుకున్నాయి. ఇక పాలనా బడ్జెట్కు మిగిలింది 77శాతం మాత్రమే. ఈ అప్పులు దేశస్థూల ఉత్పత్తిలో 5శాతం మాత్రమేననీ, ఇంకా అప్పులు తేవడానికి ఆస్కారం ఉందని ఆర్థిక మంత్రి పార్లమెంటుకు సెలవిచ్చారు. ప్రస్తుతం దేశ గ్రోత్ రేటు 7శాతంగా ఉందని, దీనిని 8శాతానికి పెంచడం ద్వారా ప్రస్తుతం ఉన్న స్థూల ఉత్పత్తిని 2.5లక్షల కోట్ల డాలర్ల నుంచి 2024 నాటికి 5లక్షల కోట్ల డాలర్లకు స్థూల ఉత్పత్తి పెంపు చేస్తామని ప్రకటించడం ఆర్థిక వేత్తలనే విస్మయ పరిచింది. 7శాతం గ్రోత్రేట్ వాస్తవం కాదని మాసం రోజుల క్రితం అరవింద సుబ్రమణియన్ (సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఎట్ ఫార్వర్డ్ యూనిర్సిటీ) వారు వర్కింగ్ పేపర్ 354లో జూన్ 2019న నివేదిక సమర్పించారు.
వ్యవసాయ గ్రోత్రేట్ 2శాతం కన్నా తక్కువ ఉన్నట్టు ఆ పత్రంలో చెప్పారు. ఆర్థికవేత్తలు సర్వే చేసి చెప్పిన గణాంకాలను సైతం త్రోసిరాజని మంత్రి నిర్మల ప్రస్తుతం 7 నుంచి 8శాతానికి గ్రోత్రేట్ పెంచుతామని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. కానీ బడ్జెట్కు ముందు రోజు ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే ప్రకారం 2017-18 ఆహార ధాన్యాల ఉత్పత్తి 28.45 కోట్ల టన్నులు కాగా, 2018-19లో 28.14 కోట్ల టన్నులు మాత్రమే ఉత్పత్తి అయ్యింది. అనగా 31 లక్షల టన్నులు ఉత్పత్తి తగ్గిపోయింది. అయినా వ్యవసాయ గ్రోత్రేట్ పెరిగిందని పేర్కొన్నారు. నేడు దేశానికి వంటనూనెలు, పత్తి, పంచదార, పప్పులు, మాంసం ఇతర దేశాల నుంచి సుమారు 2.80లక్షల కోట్లవిలువైనవి దిగుమతి చేసుకుంటున్నాం. 1990లో స్వయం పోషకత్వంగా ఉన్న దేశీయ వ్యవసాయ ఉత్పత్తులు తగ్గి దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2014 నుంచి ఈ దిగుమతులు 50శాతం అదనంగా పెరిగాయి. చివరికి గోధుమ ఉప ఉత్పత్తులు కూడా దిగుమతి చేసుకుంటున్నాం.
పారిశ్రామిక ఉత్పత్తీ తగ్గింది. 61,333 పరిశ్రమలు మూతపడ్డాయని, 2016 డిసెంబర్లో సీఐఐ చెప్పింది. లక్షల మంది ఉపాధి కోల్పోయారు. 12 భారీ పరిశ్రమలు చెల్లించలేని బాకీలలో కూరుకుపోయాయి. ఒక విధంగా పారిశ్రామిక రంగాన్ని పూర్తిగా ప్రభుత్వం కార్పోరేట్ల పరం చేయడానికి ఇది మంచి అవకాశంగా ఉంది. ఇప్పటి వరకు 12 సంస్థలను పూర్తిగా ప్రయివేటీకరించారు. 1 మారుతి సుజుకి, 2.భారత్ అల్యూమినియం, 3.సీఎంసీ లి., 4.హిందూస్థాన్ జింక్, 5. హౌటల్ కార్చ్, 6. హెచ్పిఎల్, లి. 7. ఐటీడీసీ(18 హౌటల్స్), 9.ఐబీపీ కంపెనీ, 10. ఇండియన్ పెట్రో కెమికల్ కార్ప్స్, 11. జగన్ జ్యూట్ మిషనరీ, 12. మోడ్రన్ ఫుడ్ ఇండిస్టీ, 13. విఎస్ఎస్ఎల్ సంస్థల్ని పూర్తిగా ప్రయివేటీ కరించారు. ప్రస్తుతం విమానయాన రంగం డ్రెడ్జింగ్ కార్పోరేషన్, ఐఎంపీఎల్, మెడిసిన్ ఫార్మా, ఐఆర్టిసి(రైల్వే) ఆర్సివోఎల్, మిశ్రమ ధాతునిగమ్, మజ్గల్ డాక్ సంస్థలను 51శాతం వాటాల విక్రయం (ప్రయివేటీకరణకు) తెరలేపింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014-15 నుంచి రూ. 2.08 లక్షల కోట్లు విలువైన వాటాలను విక్రయించింది. 1991 నుంచి 2014 వరకు గత ప్రభుత్వాలు రూ.1.23 లక్షల కోట్ల విలువైన వాటాలను విక్రయించాయి.
2019-20లో రూ.1.05 లక్షల కోట్ల విలువైన వాటాలను విక్రయిస్తామని నిర్మలా సీతారామన్ అతి ఉత్సాహంగా బీజేపీ ఎంపీల హర్షధ్వనాల మధ్య ప్రకటించారు. అదేకాకుండా మిగిలి ఉన్న 43 ప్రభుత్వ రంగ సంస్థలను అతి త్వరలో పూర్తిగా అమ్మకానికి పెడతామని బీజేపీ ఆర్థిక సహాయ మంత్రి ప్రకటించాడు. అంతేకాక బ్యాంకుల జాతీయకరణ రద్దుచేసి వాటిని కూడా ప్రయివేటురంగానికి హస్తగతం చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే బ్యాంకుల ఏకీకరణ చేస్తున్నారు. ఇప్పటికే ఎస్బీఐ 6 బ్రాంచీలను ఏకీకరణ చేశారు. మరో 3 బ్యాంకులను ఏకీకరణకకు (దేనా, విజయా, బ్యాంక్ ఆఫ్ బరోడా)లను కలుపబోతున్నారు. అదేవిధంగా మూడో ప్రయత్నంగా 2019 మే 22న పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లు కలువబోతున్నట్టు, నాలుగో ప్రయత్నంగా రెండు కెనరా బ్యాంకులను కలుపబోతున్నారు. బ్యాంకులకున్న రూ.9 లక్షల కోట్ల మొండి బాకీలలో లక్షల కోట్ల తగ్గింపునకు తమ ప్రభుత్వం తీవ్ర కృషి చేసిందని రూ.4 లక్షల కోట్ల వసూలుకు సహకరించామని ఆర్థిక మంత్రి వివరించారు. ఇంత వసూళ్ళకు సహకరించిన ప్రభుత్వం బ్యాంకులకు మూలధన సహాయంగా ఈ బడ్జెట్లో రూ.70 వేల కోట్లను ప్రకటించింది. నిజానికి బ్యాంకులు తమ ఎన్పీఎలను వసూలు చేస్తే మూలధన సహాయం అవసరమా? బ్యాంకుల ఏకీకరణ చేయడమంటే బ్యాంకులలో జరిగిన మోసాలనుంచి తప్పుకోవడానికే తప్ప మరొకటికాదు. 13రంగాలు బ్యాంకులను మోసాలు చేస్తున్నాయని ఆర్బీఐ ప్రకటించింది. అవి రత్నాలు. -ఆభరణాలు- తయారీ రంగం- వ్యవసాయం – విమానయానం – మీడియా – సేవలు – ప్రాజెక్టులు – వాణిజ్యం – ఐటీ ఎగుమతులు – ఎఫ్డీఐలు – లెటర్ ఆఫ్ కాంఫార్డ్ లాంటి సంస్థల ద్వారా బ్యాంకు మోసాలు జరిగాయి. 100 అతిపెద్ద కంపెనీలు మోసాలకు పాల్పడినట్టు అవినీతి నిరోధక శాఖ తెలిపింది.
ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులను కార్పోరేట్ సంస్థలకు అప్పగించడమే కాక బ్యాంకులను కూడా లూటీ చేసి కార్పొరేట్లకు బ్యాంకులు సహకరించే విధంగా ఏకీకరణకు పూనుకున్నారు. బ్యాంకులు ఒకటి కావడంతో తిరిగి బడా సంస్థలకు రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాల ఆమోదం కోసం పార్లమెంటులో సంస్కరణల పదాన్ని ఉపయోగించారు. దేశం అభివృద్ధిలోకి పోతుందని చెప్పారు. విజరుమాల్య, శివశంకర్, నీరవ్మోడీ బ్యాంకు మోసాల గురించి మాటమాత్రంగా కూడా చెప్పలేదు.
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల పరం చేయడానికి 10ఎఫ్పీవోలను రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఒక్కో ఎఫ్పీవోకు 2,500ఎకరాలు కేటాయించి ఒక కార్పొరేట్ సంస్థ ఆధీనంలోకి తెస్తారు. రెండేండ్లు గడిచాక 7,8 ఎఫ్పీవోలను ఏకం చేసి బడా కార్పొరేట్ సంస్థలకు హస్తగతం చేస్తారు. వారికి అనుకూలంగా నూతన కౌలుదారీ చట్టం, నూతన కాంట్రాక్టు వ్యవసాయ చట్టాన్ని నిటి ఆయోగ్ అన్ని రాష్ట్రాలకు ముసాయిదా పంపింది. రాష్ట్రాలు తమ శాసనసభలలో ఆమోదం తెలపాలని కోరింది. మెజారిటీగా 17 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. అందువల్ల ఈ చట్టాలను ఆమోదించడం తేలికవుతుంది. ఆ విధంగా వ్యవసాయ రంగం పూర్తిగా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇప్పటికే రోజుకు 378మంది రైతులు ఈ రంగాన్ని వదిలిపెట్టిపోతున్నారు.
విద్యా, ఆరోగ్య రంగాల్ని కూడా పూర్తిగా కార్పొరేట్ల పరం చేయడానికి ఈ బడ్జెట్లో స్థూలంగా అభిప్రాయాన్ని ఆవిష్కరించారు. నూతన విద్యావిధానం, పారిశ్రామిక విధానంతోపాటు, నూతన ఆరోగ్య విధానాన్ని కూడా తెస్తామన్నారు. ఇప్పటికే ఆరోగ్యరంగంలో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ పెట్టడం ద్వారా ఆన్లైన్ వ్యాపారంలోకి దించబోతున్నారు. ప్రజల ఆలోచనను దారి మళ్లించడానికి డ్వాక్రా గ్రూపులలో ఒక మహిళకు మాత్రమే రూ.లక్ష రుణం ఇస్తామన్నారు. అదేవిధంగా ఆరోగ్యం కోసం యోగాను బలపరుస్తూ 192 దేశాలలో యోగా అమలవుతున్నదని తెలిపింది. ఎన్ఆర్ఐలకు ఆధార్ కార్డ్ ఉంటే అన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈవిధంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ను పరిశీలించినపుడు అతి కొద్దికాలంలో సంపూర్ణంగా అన్ని వ్యవస్థలను కార్పొరేట్ రంగానికి బదలాయించడం జరుగుతుందనేది స్పష్టమవుతున్నది. బలమైన ఉద్యమాలు కొనసాగించడం ద్వారా మాత్రమే ఈ వినాశనకరమైన కార్పొరేటీకరణను ఎదుర్కో గలుగుతాం.
– సారంపల్లి మల్లారెడ్డి
సెల్: 9490098666
(నవతెలంగాణ సౌజన్యంతో …)