* పిహెచ్డిల్లో రిజర్వు స్థానాల కంటే క్షీణత..
* సింగిల్ డిజిట్ కూడా దాట లేదు : కేంద్రం
న్యూఢిల్లీ : ఉన్నత విద్యకు వెనుకబడినవర్గాలు దూరమవు తున్నాయా? ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో వారి వారి సంఖ్య తగ్గుతున్నదా? స్వయం గా ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించిన నివేదిక అవుననే అంటున్నది. పిహెచ్డిల్లో చేరుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య రిజర్వుడ్ స్థానాల కంటే తక్కువగా ఉంటున్నది. 2015-2019 మధ్యకాలంలో వీరి శాతం సింగిల్ డిజిట్ను దాటలేదని పార్లమెంటుకు ప్రభుత్వం సమర్పించిన గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. సిపిఎం ఎంపీలు ఎలమారం కరీం, కె సోమప్రసాద్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (హెచ్ఆర్డీ) ఈ గణాంకాలను ఇటీవల సమర్పించింది. ఎస్సీ విద్యార్థులకు 15శాతం సీట్లు, ఎస్టీ అభ్యర్థు లకు 7.5 శాతం రిజర్వు చేయగా.. అందులో చేరిన వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఐదేండ్ల (2015-2019) కాలంలో 23 ఐఐటీల్లో చేరిన మొత్తం 25,007 మంది పిహెచ్డి స్కాలర్స్లో 9.1 శాతం మంది ఎస్సీకి చెందినవారు కాగా, 2.1 శాతం మంది ఎస్టీ విద్యార్థులు’ అని నివేదిక పేర్కొంది. ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసి)కు చెందిన విద్యార్థుల కోటా 27 శాతం.
కాగా. పిహెచ్డి విద్యార్థులలో 23.2 శాతం మంది ఒబిసి వారున్నారు. ఈ ఐదేళ్లలో ఐఐటీల్లో పిహెచ్డి విద్యార్థుల ఎన్రోల్మెంట్లో 20 శాతం పెరుగుదల ఉన్నదనీ, అయితే ఎస్సీ, ఎస్టీ, ఒబిసి విద్యార్థుల నిష్పత్తిలో మాత్రం పెరుగుదల లేదని నివేదిక పేర్కొంది. మొత్తం 23 ఐఐటీల్లోనూ మొదటి ఐదు స్థానాల్లో మద్రాస్, బొంబాయి, న్యూఢిల్లీ, కాన్పూర్, ఖరగ్పూర్లలో 60 శాతం పిహెచ్డి ఎన్రోల్మెంట్ జరిగింది. కాగా వీటిల్లో వెనుకబడినవారి సంఖ్య అత్యల్పం. ఉదాహరణకు.. ఐఐటీ కాన్పూర్లో చేరిన 1,653 మందిలో 11 (0.6 శాతం) మంది మాత్రమే ఎస్టీ వారున్నారు.
Courtesy: NT